KTR | కేసీఆర్ హయాంలో తెలంగాణలో స్వర్ణయుగం నడిచిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పేదల కోసం కేసీఆర్ అనేక పథకాలను ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. కానీ అడ్డగోలు హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ పాల్గొన్నారు. ముందుగా కొయ్యగుట్టలో అమరవీరుల స్తూపం వద్ద కేటీఆర్ నివాళులర్పించారు. కొయ్యగుట్ట నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్తో కలిసి ఆయన భారీ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో కేటీఆర్ పాల్గొన్నారు.
కార్నర్ మీటింగ్లో కేటీఆర్ మాట్లాడుతూ.. పోచారం శ్రీనివాస్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. బాన్సువాడలో పోచారం శ్రీనివాస్ రెడ్డిని నమ్మి గెలిపిస్తే ఏం చేశాడని ప్రశ్నించారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆయన తనయులు దోచుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి గతంలో అన్న విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. ఒక ఆంబోతు, రెండు దున్నపోతులంటూ విమర్శించలేదా అని ప్రశ్నించారు. అయినప్పటికీ వెళ్లి రేవంత్ రెడ్డి పక్కకు చేరాడని విమర్శించారు. ఈ సందర్భంగా గతంలో పోచారం శ్రీనివాస్ రెడ్డిని రేవంత్ రెడ్డి తిట్టిన తిట్లను ఫోన్లో పెట్టి ప్రజలకు వినిపించారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి బండ కట్టుకొని బాయిలో దుంకాలె అని మండిపడ్డారు. కాంగ్రెస్లోకి ఎందుకు వెళ్లారో పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని ఓటేసి గెలిపించిన పోచారం శ్రీనివాస్ రెడ్డిని గల్లా పట్టి అడగాలని సూచించారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ సిగ్గు తీసిండని ధ్వజమెత్తారు.
ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని రేవంత్ రెడ్డి తిట్టిన తిట్లను ఫోన్లో పెట్టి వినిపించిన కేటీఆర్ pic.twitter.com/snKznWXpnH
— Telugu Scribe (@TeluguScribe) February 7, 2026
బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి జరిగిందని కేటీఆర్ అన్నారు. తామే బాన్సువాడను మున్సిపాలిటీ చేశామని గుర్తుచేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో బాన్సువాడ నియోజకవర్గంలో 10వేల కోట్లతో అభివృద్ధి జరిగిందని వివరించారు. భవనాలు, ఆస్పత్రి, కులసంఘాల భవనాలకు రూ.500 కోట్లు ఇచ్చామని తెలిపారు.42వేల మందికి ఆసరా పెన్షన్లు, 70 వేల మందికి రైతుబంధు, 14వేల మందికి రైతుబీమా ఇచ్చామని పేర్కొన్నారు. 15 వేల మందికి కల్యాణ లక్ష్మీ, 30 వేల మందికి కేసీఆర్ కిట్లు అందించామని చెప్పారు. ఆ నిధులు అన్నీ కేసీఆర్ ఇచ్చిండని.. పోచారం పీకిందేమీ లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్లోకి వెళ్లాక ఒక్క రూపాయి కూడా పోచారం తీసుకురాలేదని విమర్శించారు. కాంగ్రెస్ నేతల మాటలు నమ్మొద్దని సూచించారు. పోచారం శ్రీనివాస్ రెడ్డికి కేసీఆర్ ఏం అన్యాయం చేశాడని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి వేసే ఎంగిలి మెతుకులకు పోచారం ఎగిరెగిరి పడ్డాడని విమర్శించారు. బాన్సువాడ ప్రజలు గులాబీ జెండా ఎగురాలని అనుకుంటున్నారని అన్నారు. పోచారం లాంటి దొంగలకు సద్దులు కట్టింది చాలని కాంగ్రెస్ నాయకులకు హితవు పలికారు.