మా భగీరథలో మీ వాటా ఉందా?
ఏకాణా ఇవ్వకుండా ప్రచారం చేసుకొంటారా?
భగీరథ కంటే హర్ఘర్జల్ వ్యయమే తక్కువ
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై నాడేమన్నారు?
ఇప్పుడు మీ ప్రభుత్వం చేస్తున్నది ఏమిటి..?
ప్రధానిపై పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఫైర్
‘పెట్రోల్ ధరల భారీ పెరుగుదల కాంగ్రెస్ లీడ్ చేస్తున్న యూపీఏ ప్రభుత్వ వైఫల్యానికి ఉదాహరణ. ధరలు భారీగా పెంచడంతో కోట్ల మందిపై తీవ్ర ప్రభావం పడుతుంది. మేం అధికారంలోకి వచ్చినప్పటి నుంచే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తాం.. దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపడానికి కమిట్ అయి ఉన్నాం’ అని అన్నారుగా మోదీజీ.. అచ్చేదిన్ తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు –మంత్రి కేటీఆర్ ట్వీట్
హైదరాబాద్, మార్చి 31 : తెలంగాణలో ఇంటింటికీ మంచినీరు కేంద్ర ప్రభుత్వ హర్ఘర్ జల్ యోజన ద్వారా సరఫరా చేస్తున్నట్టు ప్రధానమంత్రి ప్రచారం చేసుకోవడంపై పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రధాని స్థాయికి ఇంత అబద్ధపు ప్రచారం చేసుకోవడం ఏమిటని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకాన్ని పరోక్షంగా తమ పథకంగా చెప్పుకోవడాన్ని ఎండగట్టారు.
‘జల్జీవన్ మిషన్ హర్ఘర్మే జల్.. ఆడవాళ్లకు ఉపశమనం. తెలంగాణలో 38 లక్షల ఇండ్లకు గడిచిన మూడేండ్లలో నల్లా నీటిని సరఫరా చేస్తున్నాం’ అంటూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పత్రిక ప్రకటనను ట్యాగ్ చేసిన కేటీఆర్.. ‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీ.. మిషన్ భగీరథ పథకానికి భారత ప్రభుత్వం చేసిన సహకారం ఏమిటి? పథకంలో మీ వాటా ఎంత ఉన్నదో దయచేసి తెలంగాణ ప్రజలతో పంచుకోండి.. తెలంగాణ ప్రభుత్వ ఫ్లాగ్ షిప్ ప్రోగామ్కు జీరో సహకారం అందించి ప్రచారం చేసుకోవడం ప్రధాన మంత్రి స్థాయికి తగదు’ అంటూ చురకలు అంటించారు. కేటీఆర్ ట్వీట్లపై స్పందించిన నెటిజన్లు సైతం ‘తెలంగాణలో ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇచ్చామని బీజేపీ అబద్ధపు ప్రచారం చేస్తున్నదని.. మిషన్ భగీరథ పథకం ప్రారంభించాక చాలా రోజులకు జల్ జీవన్ మిషన్ మొదలు పెట్టారని… మిషన్ భగీరథకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చు కంటే.. దేశవ్యాప్తంగా ఇంటింటికీ నల్లా నీరు అందించేందుకు కేంద్రం కేటాయించిన మొత్తం చాలా తక్కువని ట్వీట్లు చేశారు.
పెట్రో ధరలపై అప్పుడేమన్నారు?
ఐదు రాష్ర్టాల ఎన్నికలు ముగిసినప్పటినుంచి రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గతంలో పెట్రో ధరలపై మోదీ చేసిన ప్రకటనలను ట్వీట్ల ద్వారా గుర్తుచేశారు. ‘కేంద్ర ప్రభుత్వ వైఫల్యం-రాష్ర్టాలపై భారం.. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తాం.. కాంగ్రెస్ది అధికార అహంకారం.., పేదల అవసరాల పట్ల సానుభూతి ఏది’ అంటూ మోదీ గతంలో చేసిన ప్రకటనలను ప్రస్తావించారు. అంతేకాదు.. ‘ పెట్రోల్ ధరల భారీ పెరుగుదల కాంగ్రెస్ లీడ్ చేస్తున్న యూపీఏ ప్రభుత్వ వైఫల్యానికి ఉదాహరణ. ధరలు భారీగా పెంచడంతో కోట్ల మందిపై తీవ్ర ప్రభావం పడుతుంది. మేం అధికారంలోకి వచ్చినప్పటి నుంచే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తాం.. దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపడానికి కమిట్ అయి ఉన్నాం’ అని ప్రధాని చేసిన ట్వీట్లను కూడా మంత్రి కేటీఆర్ పోస్ట్ చేశారు. పది రోజుల్లో ఇది 9 వ పెరుగుదల’ అని ప్రముఖ ఇంగ్లిష్ న్యూస్ చానెల్లో వచ్చిన బ్రేకింగ్ క్లిప్ను ట్వీట్చేసిన మంత్రి కేటీఆర్.. ‘థాంక్యూ మోదీజీ ఫర్ అచ్చేదిన్’ అంటూ వ్యంగ్యంగా పేర్కొన్నారు. కాంగ్రెస్ పెట్రోల్ ధరలు పెంచిందని చెప్పుకొని అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ.. ఇప్పుడు ఇంటికి వెళ్లాల్సిన సమయం వచ్చిందంటూ’ ఆగ్రహం వ్యక్తంచేస్తూ పలువురు ట్వీట్ చేశారు.