KTR | బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్స్ హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కొప్పుల మహేశ్ రెడ్డి, నరేందర్ రెడ్డి, మెతుకు ఆనంద్, ఇతర నేతల అరెస్టులపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ భూమిని కాపాడుకోవాలని పోరాడుతున్న రైతులకు బాసటగా నిలిచేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ నేతలను అక్రమంగా గృహనిర్బంధం చేయడం, అరెస్టు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ పిరికిపంద చర్య అని ఆయన అభివర్ణించారు. ప్రశ్నించే గొంతులను పోలీసుల బలంతో నొక్కాలని చూడటం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఆయన మండిపడ్డారు.
పరిగి నియోజకవర్గంలోని కాళ్లాపూర్, రాపోలు గ్రామాల్లో ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో రైతుల నుంచి 1200 ఎకరాల భూమిని బలవంతంగా లాక్కోవడాన్ని కేటీఆర్ తీవ్రంగా తప్పుపట్టారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను గాలికొదిలేసి పేదల భూములపై పడిందని మండిపడ్డారు. రైతు భరోసా, రుణమాఫీ, ఆరు గ్యారెంటీలు 420 హామీలను అమలు చేయకుండా రైతులను అరిగోస పెడుతున్న ప్రభుత్వం, ఇప్పుడు పరిశ్రమల పేరుతో భూ సేకరణకు దిగడం దుర్మార్గమని పేర్కొన్నారు.
గత రెండున్నరేళ్లలో ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాని ఈ సర్కార్, భూములను దోచుకోవడంలో మాత్రం విపరీతమైన ఆసక్తి చూపిస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు దొంగల్లా ఊళ్లు పంచుకుంటున్నట్లు భూములను కబ్జా చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టులు, జైళ్లు, అక్రమ కేసులు బీఆర్ఎస్ నాయకులకు కొత్త కాదని, ఉద్యమ కాలం నుంచే ఇవన్నీ ఎదుర్కొని ప్రజల పక్షాన నిలబడ్డామని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం తాటాకు చప్పుళ్లకు, బెదిరింపులకు ఎవరూ భయపడేది లేదని, ప్రజల పక్షాన పోరాటం ఆగదని హెచ్చరించారు. ప్రభుత్వం ఎంత అణచివేతకు పాల్పడినా, బాధితులకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. అక్రమంగా నిర్బంధించిన నాయకులను వెంటనే విడుదల చేయాలని, భూ సేకరణను తక్షణమే నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు.