KTR | ఐదునెలలుగా జీతాలు అందక ములుగు మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికుడు మహేశ్ ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అని ఆరోపించారు. కార్మికులకు కనీసం నెలనెలా జీతాలు కూడా చెల్లించలేని దుస్థితిని తెచ్చినందుకు ముఖ్యమంత్రి, మంత్రి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ములుగు నియోజకవర్గంలో జరిగిన ఈ దారుణ ఘటనకు మంత్రి సీతక్కతోపాటు.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే పూర్తి బాధ్యులు అని కేటీఆర్ తెలిపారు. ప్రతినెలా ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి, నెలల తరబడి పెండింగ్ పెడితే పేద కార్మికులు ఎలా బతకాలో ముఖ్యమంత్రి, మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మృతుని కుటుంబానికి వెంటనే 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాతో పాటు.. అతని భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలన్నారు. లేకపోతే బీఆర్ఎస్ పక్షాన బాధితుని కుటుంబంతోపాటు, జీతాలు అందని కార్మికులకు న్యాయం జరిగే వరకూ పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.