KTR | రాష్ట్రంలో యూరియా కొరత ఒకవైపు ఉంటే, రేవంత్ రెడ్డి మరోవైపు సినిమా వాళ్లతో సమావేశాలు పెట్టుకున్నారని కేటీఆర్ విమర్శించారు. “యూరియా కొరతకు ‘ఆపరేషన్ సింధూర్’ కారణమని బీజేపీ ఎంపీలు చెబుతున్నారు. అందుకే చైనా నుంచి ఎరువులు రాలేదని అంటున్నారట. అసలు మనకు చైనాతో యుద్ధం జరిగిందా? రేవంత్పై ఈగ వాలకుండా బీజేపీ కాపాడుతోంది” అని కేటీఆర్ ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి, నరేంద్ర మోదీల మధ్య అనేక పోలికలు ఉన్నాయని, ఇద్దరూ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని కేటీఆర్ ఎద్దేవా చేశారు.“ఒకరు బడా మోదీ, మరొకరు చోటా మోదీ. ఇద్దరూ కలిసి పని చేస్తున్నారు. రేవంత్ రెడ్డి వ్యవహార శైలి చూస్తుంటే, ఆయన రేపో మాపో మోదీతో కలిసిపోవడం ఖాయం అనిపిస్తోంది. దీనివల్ల కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకే పెద్ద దెబ్బ తగులుతుంది,” అని కేటీఆర్ విశ్లేషించారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లుగా ఎనిమిది చొప్పున ఎంపీ స్థానాలను పంచుకున్నారని ఆయన విమర్శించారు.
రేవంత్ రెడ్డి హామీల వైఫల్యాలపై బీజేపీ ఎంపీలు ఏనాడు ప్రశ్నించడం లేదని, కానీ రేవంత్కు రక్షణగా కేసీఆర్పై మాత్రం విమర్శలు చేస్తున్నారని కేటీఆర్ దుయ్యబట్టారు. అమృత్ స్కాం, హెచ్సీయూ భూముల స్కామ్లపై ఆధారాలతో ఫిర్యాదు చేసినా కేంద్రం చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణకు ద్రోహం చేయడంలో బీజేపీ, కాంగ్రెస్లు రెండూ ఒక్కటేనని కేటీఆర్ అన్నారు. పరిశ్రమలు, పెట్టుబడులు, విభజన హామీలు – అన్నింటిలోనూ బీజేపీ తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని పేర్కొన్నారు. లక్షల ఉద్యోగాలు కల్పించే ఐటీఐఆర్ ప్రాజెక్టును బీజేపీ రద్దు చేసిందని, హైదరాబాద్లోని డిఫెన్స్ కారిడార్ను కాదని బుందేల్ఖండ్కు తరలించిందని ఆరోపించారు. కేన్స్, మైక్రాన్ వంటి సంస్థల రూ. 10 వేల కోట్లకు పైగా పెట్టుబడులను కూడా గుజరాత్కు తరలించారని ఆయన వివరించారు.
తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేసిన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ. రెండూ దొందూ దొందే.
యూరియా కొరతకు ‘ఆపరేషన్ సింధూర్’ కారణం అని బీజేపీ ఎంపీలు చెబుతున్నారు. అందుకే చైనా నుంచి ఎరువులు రాలేదంటున్నారు. అసలు మనకు చైనాతో యుద్ధం జరిగిందా?
రేవంత్పై ఈగ వాలనీయకుండా బీజేపీ కాపాడుతోంది.
— BRS Party (@BRSparty) August 25, 2025
పారిశ్రామిక రంగంలో అన్యాయం, విద్యా, సాగునీటి రంగాల్లో బీజేపీ తీవ్ర మోసం చేసిందన్నారు. తెలంగాణకు ఒక్క నవోదయ పాఠశాల, మెడికల్ కాలేజీ, ఐఐఎం వంటి విద్యా సంస్థలను కూడా బీజేపీ ఇవ్వలేదని కేటీఆర్ గుర్తు చేశారు. అలాగే, పసుపు బోర్డును చిన్న రూమ్కు పరిమితం చేసిందని, కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు జాతీయ హోదా ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో చెప్పిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా అందరినీ మోసం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఈ 20 నెలల కాంగ్రెస్ పాలన నచ్చకుంటే, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసి ప్రజలు తమ తీర్పు ఇవ్వాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.