హైదరాబాద్: రైతుబంధుపై అబద్ధాలు ప్రచారం చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. రైతు పచ్చబడితే కొందరికి కళ్లు ఎర్రబడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాత బాగుపడితే కొందరు ఓర్వలేకపోయారని మండిపడ్డారు. వందల ఎకరాలున్న రైతులకు, పెద్ద రైతులకు పెట్టుబడి సాయం ఇచ్చామని దుష్ప్రచారం చేశారన్నారు. అసెంబ్లీలో రైతుభరోసాపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ బుడుగు, బలహీన వర్గాల రాష్ట్రం. నూటికి 95 శాతం మంది చిన్న సన్నకారు రైతులే ఉన్నారు.
ప్రభుత్వ లెక్కల ప్రకారం తెలంగాణలో 91.33 శాతం మంది లబ్ధిదారులు 5 ఎకరాలు అంతకంటే తక్కువ ఉన్నవారే ఉన్నారు. 7.28 శాతం మంది 5 నుంచి 10 ఎకరాల మధ్య ఉన్నవారు ఉన్నారని, పదెకరాల పైన ఉన్నవారు కేవలం 1.39 శాతమని, 25 ఎకరాలున్నవారు 0.9 శాతం అని చెప్పారు. రూ.72 వేల కోట్ల రైతుబంధులో పెద్ద రైతులకు ఇచ్చింది 1.39 శాతం మాత్రమేనని వెల్లడించారు. 80 శాతం మంది లబ్ధిదారులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉన్నారు. అందులో బీసీలు 54 శాతం, ఎస్సీలు 13 శాతం, ఎస్టీలు 13 శాతం ఉన్నారు. 70 శాతం రైతుబంధు పైసలు ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతుల ఖాతాల్లో పడ్డాయన్నారు.
4.5 లక్షల ఎకరాల ఆర్వోఎఫ్ఆర్ భూములను గిరిజనులకు ఇచ్చామని, ఆ భూముల్లో ఒక్క పంట మాత్రమే పండుతుందని, వారికిచ్చే పంటసాయంలో కోత పెట్టొద్దని సూచించారు. మట్టిని నమ్ముకున్న రైతుకు ఎంత చేసినా, ఎంతిచ్చినా తక్కువనన్నారు. కానీ అన్నదాత విషయంలో కోతలు పెడుదామనుకుంటున్నారని చెప్పారు. రైతుకు చేసే సాయాన్ని దానధర్మంగా చూసే ప్రయత్నం చేస్తున్నారు. రైతు భరోసాను భారంగా చూడొద్దన్నారు. బాధ్యతగా చూడాలన్నారు. రాష్ట్రంలో 47 శాతం మందికి వ్యవసాయం ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తున్నదని, పరోక్షంగా కలుపుకుంటే 65 శాతం మంది వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడి ఉన్నారు. పరిశ్రమలకేమో పెద్దపెద్ద ప్రోత్సాహకాలు ఇస్తున్నామని, రైతుల విషయానికి వచ్చేసరికి కటింగులు పెట్టేందుకు చూడటం మంచిదికాదన్నారు.