హైదరాబాద్: ఆరు గ్యారంటీల అమలుపై సీఎం రేవంత్ రెడ్డి చేతులెత్తాశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. కేంద్రంలో తాము అధికారంలోకి వస్తేనే గ్యారంటీలను అమలు చేస్తామంటున్నారని విమర్శించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు, గ్యారెంటీలు అమలు చేసేది లేదని చెప్పారు. ఆ పార్టీకి గతంలో వచ్చిన సీట్లు కూడా రావన్నారు. ఇండియా కూటమిలో ముఖ్యమైన పార్టీలు వెళ్లిపోయాయని తెలిపారు. ఘట్కేసర్లో నిర్వహించిన మేడ్చల్ నియోజకవర్గ విజయోత్సవ సభకు కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి చెక్ పెట్టాలన్నారు. కేంద్రంలో బీజేపీని అడ్డుకోగలిగేది ప్రాంతీయ పార్టీలేనని స్పష్టం చేశారు.
‘కృష్ణా, గోదావరి జీవ నదులు. కృష్ణా నదిలో మన వాటాను కేంద్రం ఇంకా తేల్చలేదు. మన వాటా చెప్పకుండానే ఆ బోర్డుకు మన కృష్ణా జలాలను రేవంత్ రెడ్డి తాకట్టు పెట్టారు. అందుకే బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో ఉండాలి. తెలంగాణ హక్కుల కోసం కొట్లాడేది బీఆర్ఎస్ ఎంపీలే. మాయమాటలు చెప్పి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. 420 హామిలిచ్చిన రేవంత్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలి. అప్పు తెచ్చుకోండి రూ.2 లక్షల వరకు మాఫీ చేస్తామన్నారు. ఇప్పుడ ఆ హామీ ఎటుపోయింది?. ఆడబిడ్డలకు నెలకు రూ.2500 ఇస్తామన్నారు. వాటికోసం కోటి 57 లక్షల మంది ఆడబిడ్డలు వేచి చూస్తున్నారు. రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలు జుట్లు పట్టుకుంటున్నారు. ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్లు రోడ్డునపడ్డారు. కడుపు కాలిన ఆటోడ్రైవర్ ప్రజాభవన్ ముందు ఆటో కాలబెట్టాడు.
బీఆర్ఎస్ను పాతిపెడతానని రేవంత్ ప్రగల్భాలు పలుకుతున్నారు. రేవంత్ లాంటి బుడ్డర్ ఖాన్లను కేసీఆర్ ఎంతోమందని చూశారు. ఎంతో మంది తీస్మార్ ఖాన్లను మాయం చేసి తెలంగాణ తెచ్చారు. పార్టీ కార్యకర్తలు ఎవరికి అన్యాయం జరిగినా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరం వస్తాం. మన బాస్లు ఢిల్లీలోనో, గుజరాత్లోనో లేరు.
లంకె బిందెల కోసం వెతికే వారు అధికారంలోకి వచ్చారు. సెక్రటేరియట్లో కంప్యూటర్లు, జీవోలు ఉంటాయి.. లంకె బిందెలు ఉండవు. లంకెబిందెల కోసం వెదికేది ఎవరో ప్రజలకు తెలుసు. ప్రతి ప్రతి హామీని నెరవేర్చే వరకు ప్రజల తరపున పోరాడుతాం. కాంగ్రెస్ ఇచ్చింది ఆరు గ్యారంటీలు కాదు.. 420 హామీలు. కాంగ్రెస్ అబద్ధాలపై అసెంబ్లీ వేదికగా ఎండగట్టినం. బీఆర్ఎస్ ఎంపీలుంటేనే పార్లమెంటులో మన వాణి వినిపిస్తరు. కేసీఆర్ సీఎం కాలేదని జనం బాధపడుతున్నరు’ అని కేటీఆర్ అన్నారు.
Live: మేడ్చల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం.@KTRBRS @chmallareddyMLA @RajuShambipur @MarriRajasekar https://t.co/SgbZy6pDkI
— BRS Party (@BRSparty) February 2, 2024