హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మరోసారి విమర్శలు గుప్పించారు. కొనుగోలు కేంద్రాలు లేక 20 రోజులగా కల్లాల వద్ద రైతులు బాధపడుతున్నారని, హైడ్రా, మూసీ సుందరీకరణ పేరుతో పేదలపై సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతాపం చూపిస్తున్నదని ఎక్స్ వేదికగా విరుచుకుప్పడారు. ‘‘తడిగుడ్డతో గొంతు కోయడం అంటే ఏంటో అనుకున్నాం కొనుగోళ్లు లేక తడుస్తున్న ఈ ధాన్యం చూస్తుంటే తెలుస్తుంది. కళ్లు కాయలు కాసేలా ఎదురుచూడడం అంటే ఏంటో అనుకున్నాం కల్లాల వద్ద 20 రోజులుగా రైతన్నలు పడుతున్న బాధలు చూస్తే తెలుస్తుంది. మీసాలెందుకు రాలేదురా అంటే మేనత్త సాలు అని, గడ్డం ఎందుకు వచ్చిందిరా అంటే మేనమామ పోలిక అంటే ఏంటో అనుకున్నాం రుణమాఫీ, రైతుభరోసా, ఆడబిడ్డలకు కళ్యాణలక్ష్మి కింద రూ.లక్ష 116, తులం బంగారం అడిగితే కాంగ్రెస్ నేతలు చెబుతున్న సాకులు చూస్తుంటే అర్థం అవుతుంది.
అందితే జుట్టు అందకపొతే కాళ్ళు ఏమో అనుకున్నాం ఓట్ల కోసం నాడు నిరుద్యోగుల కాళ్లు పట్టుకుని, నేడు వారి మీద నిర్దాక్షిణ్యంగా లాఠీఛార్జ్ చేస్తుంటే అర్థం అవుతుంది. సుఖం వస్తే మొకం కడగడానికి తీరిక లేదంటే ఏమో అనుకున్నాం పది నెలల పాలనలో సీఎం, మంత్రుల 25కు పైగా ఢిల్లీ, 26కు పైగా విదేశీ పర్యటనలు చూస్తే అర్థమవుతుంది. తేలుకు పెత్తనం ఇస్తే తెల్లవార్లు కుట్టిందంటే ఏమో అనుకున్నాం హైడ్రా, మూసీ సుందరీకరణ పేరుతో పేదలపై ప్రభుత్వ ప్రతాపం చూస్తుంటే అర్థం అవుతుంది. ఏరు దాటే వరకు ఓడ మల్లన్న.. ఏరు దాటిన తరువాత బోడ మల్లన్న అంటే ఏమో అనుకున్నాం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తే అర్థం అవుతుంది’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
తడిగుడ్డతో గొంతు కోయడం అంటే ఏంటో అనుకున్నాం కొనుగోళ్లు లేక తడుస్తున్న ఈ ధాన్యం చూస్తుంటే తెలుస్తుంది
కళ్లు కాయలు కాసేలా ఎదురుచూడడం అంటే ఏంటో అనుకున్నాం కల్లాల వద్ద 20 రోజులుగా రైతన్నలు పడుతున్న బాధలు చూస్తే తెలుస్తుంది
మీసాలెందుకు రాలేదురా అంటే మేనత్త సాలు అని, గడ్డం ఎందుకు…
— KTR (@KTRBRS) November 7, 2024