KTR | రాజన్న సిరిసిల్ల, మార్చి 28 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరంపై కడుపు మంట, కేసీఆర్పై కండ్ల మంటతో 3 నెలలుగా మేడిగడ్డను రిపేర్ చేయించకపోవటం వల్లే లక్షల ఎకరాల పంటలు ఎండిపోయాయని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఇదే సీజన్లో కాళేశ్వరం ద్వారా మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తిపోసి, మిడ్మానేరు, అన్నపూర్ణ, రంగనాయకసాగర్, తంగళ్లపల్లి మండలంలోని అన్ని చెరువులను నింపి సాగునీరిచ్చినట్టు గుర్తుచేశారు. మేడిగడ్డలో మూడు పిల్లర్లు కుంగితే రిపేర్ చేయించేందుకు సీఎంకు టైం సరిపోవటం లేదా? అని ప్రశ్నించారు. 3 పిల్లర్ల వద్ద కాఫర్ డ్యాం కట్టి, వృథాగా సముద్రంలోకి పోతున్న నీటిని పంపింగ్ చేసి ఉంటే ఈరోజు ఈ దుస్థితి వచ్చేది కాదని తెలిపారు. అందుకే ఇది కాలం తెచ్చిన కరువు కాదని, పక్కా కాంగ్రెస్ తెచ్చిన కరువేనని విమర్శించారు. పంటలు ఎండిపోయి రైతులు అరిగోస పడుతుంటే పరామర్శించే తీరికలేదు గానీ, గత 4 నెలలుగా 15 సార్లు విమానం ఎక్కే, విమానం దిగే అన్నట్టు ఢిల్లీకి జాతర పోవుడు, యాత్రలు చేసుడు తప్ప ఇంతవరకు సీఎంగానీ, మంత్రులుగానీ రైతుల పొలాల దిక్కుచూసిన పాపాన పోలేదని ధ్వజమెత్తారు.
వేసిన పంటలు మేతకు తప్ప ఎందుకూ పనికిరాకుండా పోయాయని అన్నారు. రైతుల గోస చూస్తుంటే గుండె తరుక్కుపోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. యాసంగిలో రైతుబంధు కోసం పెట్టిన రూ.7 వేల కోట్లను రైతులకు ఇవ్వకుండా కాంట్రాక్టర్ల ఖజానాకు, వారి పేమెంట్లకు పెట్టిన చిల్లర ప్రభుత్వమని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీమేరకు రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని, ఎన్నికల కోడ్ అడ్డురాకుండా ఎన్నికల కమిషన్కు ప్రత్యేక లేఖ రాసి అమలు చేయాలని డిమాండ్ చేశారు. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం సారంపల్లిలో కౌలు రైతు జింకా పరశరాములుకు చెందిన ఎండిన వరిపంటను కేటీఆర్ పరిశీలించారు. పెట్టుబడి పెట్టి తీవ్రంగా నష్టపోయానంటూ కంటతడిపెట్టిన రైతును ఓదార్చి, అధైర్యపడవద్దని, అండగా కేసీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరం ఉన్నామని భరోసా ఇచ్చారు. అనంతరం సిరిసిల్ల, వేములవాడలో జరిగిన పలు శుభకార్యాలకు హాజరయ్యారు. చీర్లవంచలో ‘నమస్తేతెలంగాణ’ బ్యూరో ఇన్చార్జి కడపర్తి ప్రకాశ్రావు కుటుంబసభ్యులను పరామర్శించారు. బీవైనగర్లోని షాదీఖానాలో ఇఫ్తార్ విందుకు హాజరయ్యారు. సిరిసిల్లలోని 33వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ నేత మూడం సాయికుమార్ను పరామర్శించారు. ఇటీవల పార్టీ అధ్వర్యంలో నిర్వహించిన నిరసనలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేస్తుండగా ప్రమాదవశాత్తు నిప్పంటుకుని సాయికుమార్ గాయాలపాలయ్యారు. మెరుగైన వైద్యం అందిస్తామని ఆయనకు భరోసా ఇచ్చారు.
‘రైతులు అధైర్యపడొద్దు. అండగా మేమున్నాం. దయచేసి చేతులు జోడించి మొక్కుతున్నా ఆత్మహత్యల్లాంటి తీవ్రమైన చర్యలకు పాల్పడి కుటుంబాలను ఇబ్బందులపాలు చేయొద్దు’ అని రైతులకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ‘కొంత మోసపోయి కాంగ్రెస్కు ఓట్లేసి గెలిపించుకున్నారు. మిమ్మల్ని ప్రభుత్వం పట్టించుకోనప్పటికీ, మంత్రులు, సీఎంకు తీరిక లేకపోయినా? మీ తరఫున మేముంటాం’ అని తెలిపారు. ప్రతి గ్రామానికి వస్తామని, మీ కోసం కేసీఆర్ స్వయంగా వస్తున్నారని ధైర్యం చెప్పారు. ప్రభుత్వ మెడలు వంచైనాసరే నష్టపరిహారం సాధించుకుందామని, మేడిగడ్డ రిపేర్ చేయించి కాళేశ్వరం నీళ్లు తెచ్చుకుందామని, ధాన్యానికి బోనస్, రుణమాఫీ సాధించుకుందామని భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ పెట్టిన ఆరు డిమాండ్లను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రైతుల్లో భరోసా నింపేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి వారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ వెంట నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్తు మాజీ చైర్పర్సన్ తుల ఉమ, టీఎస్టీపీడీసీ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, ఎంపీపీ పడిగెల మానస, ఏఎంసీ మాజీ చైర్పర్సన్ పూసపల్లి సరస్వతి, బీఆర్ఎస్ నాయకులు గజభీంకార్ రాజన్న ఉన్నారు.