KTR | రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): ఎన్నికల్లో ఇలాంటి ఫలితాలు సహజమేనని, ఇది తాత్కాలిక స్పీడ్బ్రేకర్ మాత్రమేనని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసేలా ప్రజా గొంతుకై ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని, ప్రతిపక్షపాత్రలో రాణిస్తామని పేర్కొన్నారు. ఐదోసారి ఎమ్మెల్యేగా గెలిచి బుధవారం మొదటిసారి సిరిసిల్లకు వచ్చిన ఆయనకు తెలంగాణ భవన్ వద్ద కార్యకర్తలు, నాయకులు పెద్దఎత్తున స్వాగతం పలికారు. అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కల్యాణమండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజలు తమకు ఇచ్చిన కొత్త పాత్రలో క్రియాశీలకంగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు.
పార్టీ పేరు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారినా పోరాటం తమకు కొత్తకాదని కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ సీఎంగా లేరా? ప్రభుత్వం పోయిందా? అంటూ కాంగ్రెస్కు ఓటేసిన వాళ్లు సైతం ఆవేదనతో తమకు మేసేజ్లు, వీడియోలు పెడుతున్నట్టు తెలిపారు. ఎవరు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా, అభివృద్ధి, సంక్షేమానికి ఓటేసి గెలిపించిన సిరిసిల్ల ప్రజలకు శిరస్సు వంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకొంటున్నట్టు తెలిపారు. 39మంది ఎమ్మెల్యేలను గెలిపించిన ప్రజల విశ్వాస్వాన్ని తాము నిలబెట్టుకుంటామని హామీ ఇచ్చా రు. దురదృష్టవశాత్తు వేములవాడలో స్వల్ప మెజార్టీతో ఓ సీటును కోల్పోయామని గుర్తు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నా, పాలక పక్షంలో ఉన్నా ప్రజల కోసం పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. సిరిసిల్ల అభివృద్ధికి అధికార పార్టీపై ఒత్తిడి తెస్తానని చెప్పారు.
గంభీరావుపేట, డిసెంబర్ 6: బీఆర్ఎస్ ఓటమిని జీర్ణించుకోలేక మంగళవారం గుండెపోటుతో మరణించిన రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం దమ్మన్నపేటకు చెందిన ఆవునూరి దేవయ్య కుటుంబాన్ని ఎమ్మెల్యే కేటీఆర్ బుధవారం పరామర్శించారు. పార్టీ కోసం చురుగ్గా పనిచేసిన దేవయ్య అకాల మరణం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్ హామీ ఇచ్చారు.