హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 67,411 మంది అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు సర్కారు సంక్రాంతి కానుకగా చేనేత చీరలను అందజేస్తున్నది. హైదరాబాద్లో పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు, గిరిజన, స్త్రీ,శిశు సంక్షేమశాఖల మంత్రి సత్యవతి రాథోడ్ గురువారం లాంఛనంగా ప్రారంభించి కొంతమంది అంగన్వాడీలకు అందజేశారు. ప్రతి సోమవారం వీటిని ధరించాలని నిర్ణయించారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు ఇప్పటికే రెండు జతల ప్రత్యేక చీరలు అం దించిన ప్రభుత్వం.. ఈసారి మూడో జతగా పోచంపల్లి ఇక్కత్ చేనేత చీరలు అందిస్తున్నది. రాష్ట్రంలోని 31,711 మెయిన్ అంగన్వాడీ కేం ద్రాలు, 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాల్లోని మొత్తం 67,411 మంది టీచర్లు, ఆయాలకు వీటిని అందిస్తున్నామని మంత్రులు తెలిపారు. పోచంపల్లి ఇక్కత్ చీరల కోసం రూ.5.71 కోట్లను స్త్రీ, శిశు సంక్షేమశాఖ వెచ్చించ్చింది. చేనేత కళాకారులకు ఉపాధి కల్పించడానికి ఈ చీరలను టెస్కో నుంచి సేకరించామని స్త్రీ, శిశు సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్యా దేవరాజన్ పేర్కొన్నారు.
స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఉన్న ట్రాన్స్ జెండర్లకు జూట్ బ్యాగ్ తయారీలో ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. జూట్ బ్యాగ్ తయారీలో శిక్షణ పొందిన ట్రాన్స్ జెండర్లు రూపొందించిన జ్యూట్బ్యాగ్ను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు.