హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉన్నదని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. సీఎం కేసీఆర్ విజన్తో రాష్ట్రం ఆర్థిక వృద్ధిలో అగ్రగామిగా నిలుస్తున్నదని శుక్రవారం ట్వీట్ చేశారు. కేంద్రం సహకరించకున్నా తెలంగాణ ఆర్థికంగా అగ్రస్థానంలో నిలుస్తున్నదని తెలిపారు. ‘ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్తో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉన్నది.
2014-15 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో తలసరి ఆదాయం రూ.1,24,000 మాత్రమే. కానీ సీఎం కేసీఆర్ పటిష్ట ఆర్థిక ప్రణాళికతో 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.3,17,000కు ఎగబాకింది. తొమ్మిదేండ్లలోనే అత్యధికంగా 155 శాతం వృద్ధిరేటును నమోదు చేసింది. కేంద్ర ప్రభుత్వం చేయూత ఇవ్వనప్పటికీ, ఆర్థికంగా అవస్థలు పెడుతున్నప్పటికీ తెలంగాణ మాత్రం ప్రగతిపథం వైపు దూసుకెళ్తున్నది.’ అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. కేటీఆర్ ట్వీట్కు అనూహ్య స్పందన లభించింది. ‘ఇది తెలంగాణ సాధించిన ఘనత.. సీఎం కేసీఆర్ పనితీరుకు, నిబద్ధతకు నిదర్శనం.. జయహో కేసీఆర్, జయహో బీఆర్ఎస్..’ ఇలా అనేక మంది ట్విట్టర్లో తమ అభినందనలు తెలియజేశారు.