KTR | రాష్ట్రంలో కాంగ్రెస్ అరాచక పాలన కొనసాగిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వీటిపై రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించామని తెలిపారు. ప్రతి ప్రజా సమస్యను ఐడెంటిఫై చేస్తామని పేర్కొన్నారు. త్వరలోనే కేసీఆర్ అధ్యక్షతన మరో సమావేశం ఉంటుందని వెల్లడించారు. ప్రజా సమస్యలపై ఇక నుంచి ఉధృతంగా పోరాడాలని నిర్ణయించుకున్నామని చెప్పారు.
కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో జరిగిన రాష్ట్ర కార్యకవర్గ సమావేశంలో కీలక తీర్మానాలు చేశామని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అన్నివర్గాలకు ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేశామని పేర్కొన్నారు. అరాచక కాంగ్రెస్ పాలనకు సంబంధించి భేటీలో నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. తెలంగాణలో సబ్బండ వర్గాలు, సకల జనులకు ధన్యవాదాలు చెబుతూ తీర్మానం చేశామని అన్నారు. సమావేశం సందర్భంగా కీలక విషయాలను చర్చించామని తెలిపారు. కేసీఆర్ పార్టీ ఏర్పాటుకు దారి తీసిన పరిస్థితులు వివరించారని పేర్కొన్నారు. రైతుబంధు తీసుకొచ్చి రైతులను ఆదుకోవడాన్ని ఐరాస ప్రశంసించిందని చెప్పారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అరాచక పరిపాలన జరుగుతోందని కేటీఆర్ తెలిపారు. వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందని అన్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు సరిగ్గా జరగడం లేదని తెలిపారు. ఏ ఆంక్షలు లేకుండా మక్క, జొన్న పంటలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పంట కొనుగోళ్లు సరైన రీతిలో చేపట్టకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. పంట కొనుగోళ్లు త్వరగా చేసేలా ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావడంపై సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్థాన్ విభజనతో పోలుస్తూ పార్లమెంటులో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించామని కేటీఆర్ తెలిపారు. పార్లమెంటులో బీఆర్ఎస్ లేని లోటు స్పష్టంగా కనిపించిందని అన్నారు. తేజస్వి మాట్లాడిన సమయంలో సభలో ఒక్క బీఆర్ఎస్ ఎంపీ ఉన్నా అతనితో క్షమాపణలు చెప్పించి ఉండేవాళ్లమని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీల నిష్క్రియాపరత్వంపై సమావేశంలో నిరనస వ్యక్తమైందని చెప్పారు.
బీజేపీ ఉద్దేశపూర్వకంగానే మహిళా బిల్లుకు అడ్డుపుల్ల వేసిందని కేటీఆర్ విమర్శించారు. మహిళా బిల్లుకు మద్దతుగా ఆనాడే బీఆర్ఎస్ తీర్మానాలు చేసి పంపిందని చెప్పారు. మహిళా రిజర్వేషన్లపై కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేశామని తెలిపారు.
సర్ (SIR)పై కూడా కూలంకషంగా సమావేశంలో చర్చించామని కేటీఆర్ తెలిపారు. పశ్చిమ బెంగాల్లో 95 లక్షలు, బిహార్లో 65 లక్షల ఓట్లు తొలగించారని పేర్కొన్నారు. త్వరలోనే తెలంగాణలో కూడా సర్ మొదలు కాబోతుందని వెల్లడించారు. సర్ విషయంలో కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారని వివరించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో దొంగ ఓట్లు సృష్టించి గెలిచారని తెలిపారు. సర్ విషయంలో పార్టీ శ్రేణులు క్రియాశీలకంగా ఉండాలని కేసీఆర్ సూచించారని చెప్పారు. బూత్ లెవల్ టు స్టేట్ లెవల్ క్రియాశీలకంగా పనిచేయాలని తీర్మానం చేశామని తెలిపారు.
పార్టీ సభ్యత్వ నమోదు, పార్టీ కమిటీలపైనా సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని కేటీఆర్ తెలిపారు. రాష్ట్ర కమిటీ మినహా మిగతా అన్ని కమిటీలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. కొత్త కమిటీలను తొందరలోనే చేస్తామని చెప్పారు. స్టేట్ కమిటీ ఆధ్వర్యంలో మెంబర్షిప్ కార్యక్రమం చేపడతామని అన్నారు. ఆన్లైన్, ఆఫ్లైన్ రెండు పద్ధతుల్లో సభ్యత్వ నమోదు చేస్తామని చెప్పారు.
రాశి కంటే.. వాసి ముఖ్యమని కేటీఆర్ అన్నారు. క్వాలిటేటివ్గా మెంబర్షిప్ చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. బీఆర్ఎస్ నాయకత్వం తెలంగాణకు రక్షణ కవచంలా నిలబడాలని సూచించారు. ప్రతి నియోజకవర్గంలో ముఖ్య కార్యకర్తలకు, నాయకులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తామని చెప్పారు. దీనికి సంబంధించి త్వరలోనే షెడ్యూల్ వెల్లడిస్తామని అన్నారు.