హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గడ్డుకాలం ఎదుర్కొంటున్నదని, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆయన పార్లమెంటు పరిధిలోనే గింగిరాలు తిరిగుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కొడంగల్ నియోజకవర్గంలోని ప్రతి మండలంలో పర్యటిస్తున్న ఆయనకు క్షేత్రస్థాయి పరిస్థితులు అర్థమయ్యాయని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క వర్గమూ సంతృప్తిగా లేదన్న కేటీఆర్, ప్రజలు నిత్యం కేసీఆర్ను తలచుకుంటున్నారని పేర్కొన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన అభయహస్తం వారికి భస్మాసుర హస్తం కానుందని హెచ్చరించారు. తెలంగాణ భవన్లో శనివారం కేటీఆర్ మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. దేశంలో బీజేపీని ఎదుర్కొంటున్నది ప్రాంతీయ పార్టీలేనని, కాంగ్రెస్కు దానిని ఎదుర్కొనే సత్తా లేదని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి 220 సీట్లు దాటే పరిస్థితి లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో రాజకీయాలను కేసీఆర్ శాసించాలంటే బీఆర్ఎస్ను 10-12 స్థానాల్లో గెలిపించాలని ప్రజలను కోరారు.
రేవంత్రెడ్డి మాటమీద నిలబడే వ్యక్తి కాదని, ఆగస్టు 15 లోపు రుణమాఫీ అని చెప్పడం మోసం పార్ట్-2లో భాగమని కేటీఆర్ విమర్శించారు. ఆయనకు క్షేత్రస్థాయిలో పరిస్థితి అర్థమైంది కాబట్టే ఆయన తన సొంత నియోజకవర్గం మహబూబ్నగర్కు పదిసార్లు వెళ్లారని ఎద్దేవా చేశారు. ప్రజల మూడ్ మారిందని, కాంగ్రెస్కు గడ్డుకాలం మొదలైందని చెప్పారు. సీఎంవి అన్నీ ఉద్దెర మాటలేనని, బస్సు ఉద్దెర, సిలిండర్ ఉద్దెర, కరెంటు కూడా ఉద్దెరేనని.. ఇప్పటి వరకు ఎవరి ఖాతాలోనూ రూపాయి కూడా పడలేదనని తెలిపారు. రూ. 4 వేల పింఛన్, ఆడబిడ్డలకు రూ. 2500, రూ. 500 బోనస్, వ్యవసాయ కూలీలకు రూ. 12 వేలు, కౌలు రైతులకు భరోసా, నిరుద్యోగులకు రూ. 4వేల భృతి, ఫ్రీ స్కూటీ, తులం బంగారం వంటివి అతీగతీ లేకుండా పోయాయని, ఉన్న రైతుబంధుకు కూడా దిక్కులేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకసారి మోసపోతే అది మోసం చేసినవాడి తప్పని, రెండోసారి కూడా అదే వ్యక్తి చేతిలో మోసపోతే అది మన తప్పు అవుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు మోసం పార్ట్-1లో భాగంగా రుణమాఫీ డిసెంబర్ 9న రిలీజ్ అన్నారని, ఓట్లు వేయించుకుని గట్టెక్కాక.. మోసం పార్ట్-2లో భాగంగా రుణమాఫీ ఆగస్టు-15 అంటూ కొత్త మోసానికి తెరతీశారని మండిపడ్డారు. కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని రెండుసార్లు చెప్పి మాట నిలుపుకోలేదని కేటీఆర్ గుర్తుచేశారు.
మహబూబ్నగర్, చేవెళ్ల ఇన్చార్జిని తానేనని రేవంత్ తొలుత ప్రకటించుకున్నారు. రెండుచోట్లా పరాజయం పక్కా అని తేలిపోవడంతో ఇన్చార్జ్గా తప్పుకున్నారు. భట్టి విక్రమార్క కూడా రెండు సీట్లకు ఇన్చార్జిగా ఉండగా ఆ తర్వాత తప్పుకోవడంతోనే పరాజయం ఓటమి తేలిపోయింది.
-కేసీఆర్
చేవెళ్ల, సికింద్రాబాద్, మల్కాజిగిరిలో తాము బలంగా ఉన్నామని కేటీఆర్ తెలిపారు. జీహెచ్ఎంసీ ప్రజలు బీఆర్ఎస్నే నమ్ముతున్నారని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ మార్పు మొదలైందని, ప్రజలకు కాంగ్రెస్ తత్వం బోధపడిందని చెప్పారు. మైనార్టీ నుంచి ఒక్క మంత్రి కూడా లేరని, రంజాన్ తోఫా లేదు, క్రిస్మస్ కానుక లేదని ఆవేదన వ్యక్తం చేశారు.46 లక్షలమంది ఆసరా పింఛన్దారులకు చేయూత అని చేయిచ్చారని ఆరోపించారు.100 రోజుల్లో 1.67 కోట్లమంది ఆడబిడ్డలకు నెలకు రూ. 2,500 ఇస్తామని మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల్లో ఓటు వేయకుంటే ఫ్రీ బస్సు పథకాన్ని ఎత్తివేస్తామని ప్రజలను ముఖ్యమంత్రి బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు.
ఇఫ్తార్ విందులో సీఏఏ, ఎన్ఆర్సీపై మీ వైఖరేంటో చెప్పాలన్న అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నకు రేవంత్ ఒక్క మాటా మాట్లాడలేదని, రేవంత్ బీజేపీలోకి జంప్ అవుతాడంటూ తాను 20సార్లు అంటే దానిపైనా స్పందించడం లేదని కేటీఆర్ గుర్తుచేశారు. ప్రభుత్వం ఏర్పడి మార్చి 15కు వంద రోజులు అయ్యాయని, ఆగస్టు 15 నాటికి 250 రోజులు అవుతాయని, అప్పటికీ హామీలు అమలు చెయ్యవా? అని ప్రశ్నించారు. హరీశ్ కూడా అదే అడిగారని, రేవంత్కు సత్తా ఉంటే స్పందించాలని కోరారు. రేవంత్ రుణమాఫీ నేతిబీరకాయలోని నెయ్యిలాంటిదేనని ఎద్దేవా చేశారు. మోదీని రాహుల్గాంధీ చౌకీదార్ చోర్ అంటారని.. చౌకీదార్ చోర్ హమారే బడే భాయ్ అని రేవంత్ అంటారని, ఆయన ఎవరి కోసం పనిచేస్తున్నారో ప్రజలకు అర్థంకావడం లేదని ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ నుంచి ఇతర పార్టీల్లోకి వెళ్లినవారు అక్కడ కంఫర్ట్గా లేరు. కాంగ్రెస్లోకి వెళ్లినవారు రేవంత్తో డీల్ చేసుకుని వెళ్లారు. పార్టీ మారిన నాయకుల పరిస్థితి ఏమిటో ఎన్నికల తరువాత బయటపడుతుంది. కేసీఆర్ పక్కన కూర్చునే కేకే కాంగ్రెస్లో ఎక్కడా కనిపించడం లేదు. పార్టీని విడిచి వెళ్లిన వారి వల్ల కొంత నష్టం జరిగిన మాట వాస్తవమే.
-కేటీఆర్
2014లో బడే భాయ్ బడా మోసం చేస్తే, 2023లో చోటే భాయ్ కూడా బడా మోసం చేశారని కేటీఆర్ విమర్శించారు. ఈ మోసగాళ్లకు బుద్ధి చెప్పేందుకు కేసీఆర్ను తిరిగి గెలిపించాలని కోరారు. మోదీ తెలంగాణ పుట్టకనే అవమానించారని, ఒకటికి పదిసార్లు విషం చిమ్మారని ఆగ్రహం వ్యక్తంచేశారు. గ్యాస్ నుంచి డీజిల్ పెట్రోలు వరకు అన్ని ధరలు పెంచేసి మోదీ దేశ ప్రజల నడ్డి విరిచారని విమర్శించారు. క్రూడాయిల్ ధరలు తగ్గినా చమురు ధరలు మాత్రం తగ్గడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థులకు జనామోదం, క్యాడర్ ఆమోదం లేదని తెలిపారు. వరంగల్లో కడియం శ్రీహరిని కాంగ్రెస్లో చేర్చుకోగానే మూడో స్థానంలోకి వెళ్లారని అన్నారు. బీఆర్ఎస్ను గెలవనివ్వకుండా చేయడమే కాంగ్రెస్, బీజేపీ లక్ష్యమని, అందుకు ఆ పార్టీలు కొన్ని స్థానాల్లో నిలబెట్టిన అభ్యర్థులే సాక్ష్యమని పేర్కొన్నారు.
కేసీఆర్ బస్సుయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని కేటీఆర్ తెలిపారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ 10-12 స్థానాల్లో గెలిస్తే రాష్ట్ర రాజకీయాల్లో చాలా మార్పులు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. గట్టిగా కష్టపడితే 12 స్థానాలు గెలుచుకోవడం కష్టం కాదని తెలిపారు. ప్రజలు విజ్ఞతతో ఓట్లు వేయాలని కోరారు. రేవంత్ ప్రభుత్వంలో కమ్మ, ముదిరాజ్, మాదిగ, మైనార్టీ వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయని, ఆయా వర్గాలకు సీట్లు ఇవ్వలేదని కేటీఆర్ గుర్తుచేశారు. బీఆర్ఎస్ మాత్రం సామాజిక సమతూకం పాటించిందని తెలిపారు. ఏ వర్గాన్నీ విస్మరించకుండా సీట్లు ఇచ్చామని గుర్తు చేశారు.
మీడియా తన చుట్టూ ఉన్నప్పుడు మజాక్ చేస్తుండడం మల్లారెడ్డికి అలవాటేనని కేటీఆర్ పేర్కొన్నారు. ఈటలను మునగచెట్టు ఎక్కించి కిందపడేసేందుకే ఆయన గెలుస్తారని మల్లారెడ్డి అన్నారని తెలిపారు. మల్లారెడ్డి మాటలతో రాజేందర్ ఉబ్బితబ్బిబ్బయి ప్రచారాన్ని బంద్ పెడితే బీఆర్ఎస్ స్పీడ్ పెరుగుతుందని, తద్వారా బీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తాడంటూ మల్లారెడ్డి మాటల్లోని ఆంతర్యాన్ని బయటపెట్టారు. ఈటలను గతంలో రెండుసీట్లలో ఓడించామని, ఈసారి కూడా ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ మారిన నాయకులు పోటీ చేసిన స్థానాల్లోనే ఎక్కువ దృష్టి పెడతామని, వారిని ఓడించేందుకు కృషి చేస్తామని చెప్పారు. శారీరకంగా ఇబ్బంది పడుతున్నప్పటికీ రైతుల కోసం కేసీఆర్ పర్యటిస్తున్నారని, క్యాడర్లో ఉత్సాహం నింపుతున్నారని తెలిపారు. ఎన్నికల తర్వాత పార్టీ సంస్థాగత నిర్మాణం చేపడతామని, ప్రజా సమస్యలపై పోరాడతామని స్పష్టం చేశారు.
400 సీట్లు అంటూ మోదీ ఉత్తర కుమారుడి ప్రగల్భాలు పలుకుతున్నారు. బీజేపీకి 220 సీట్లకు మించి వచ్చే ప్రసక్తే లేదు. 2014లో దేశం మొత్తం మోదీ గాలి వీచినా తెలంగాణలో మాత్రం బీజేపీని బీఆర్ఎస్ అడ్డుకున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ కలిసి కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయి.
-కేటీఆర్
దేశానికి ఉపయోగం ఉంటుందనే జీఎస్టీ, నోట్ల రద్దుకు అప్పట్లో మద్దతు తెలిపామని కేటీఆర్ గుర్తుచేసుకున్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పార్లమెంటులో ఓటు వేశామని, సీఏఏ, ఎన్ఆర్సీలకు అసెంబ్లీలో తీర్మానం చేశామని, విభజన చట్టంలోని హామీల గురించి కొట్లాడామని పేర్కొన్నారు. దళితుడు రాష్ట్రపతిగా, తెలుగువ్యక్తి ఉపరాష్ట్రపతిగా పోటీలో ఉంటే మద్దతు తెలిపామని పేర్కొన్నారు. బీజేపీకి తాము ఇచ్చింది అంశాలవారీ మద్దతు మాత్రమేనని పేర్కొన్నారు. చాలా బిల్లలకు కాంగ్రెస్ మద్దతు తెలిపిందని, అంతమాత్రాన ఆ రెండు పార్టీలూ ఒకటే అని అనలేమని చెప్పారు.
కాంగ్రెస్ నాయకులు కేరళ వెళ్లి తిడతారని, మిగిలిన రాష్ర్టాల్లో మాత్రం కలిసి పనిచేస్తారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళలో సీపీంఎను రేవంత్రెడ్డి బండబూతులు తిట్టినా ఇక్కడ మాత్రం వారు కాంగ్రెస్కే మద్దతు ఇస్తారని, అది వారికే చెల్లిందని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కమిటీ కేసీఆర్ను పిలిస్తే ఆయన హాజరవుతారని పేర్కొన్నారు. సిరిసిల్లలో సాంచాలు నడవక నలుగురు నేతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడోసారి గెలిచి ఉంటే మహారాష్ట్రలో పోటీచేసి ఉండేవారమన్న కేటీఆర్.. ఏపీలో మాత్రం ప్రాంతీయ పార్టీలే గెలవాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. అక్కడ జగన్ గెలుస్తారని తమకు సమాచారం ఉందని కేటీఆర్ తెలిపారు.
ఒక రాజకీయ పార్టీ o23 సంవత్సరాలు పూర్తి చేసుకోవడమంటే చిన్న విషయం కాదని కేటీఆర్ పేర్కొన్నారు. దేశ రాజకీయ చరిత్రలో ఒక ప్రాంతీయ పార్టీగా ప్రయాణం మొదలు పెట్టి, ఈ స్థాయికి చేరుకోవడమంటే మాములు విషయం కాదని అన్నారు. 24 ఏండ్లలో 14 సంవత్సరాలు ఉద్యమం, 10 ఏండ్లు ప్రభుత్వంలో ఉన్నామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారుందరికీ పాదాభివందనం చేస్తునట్టు చెప్పారు. వారు లేకపోతే తాము లేమని, వారు ఆనాడు చేసిన అసమాన పోరాటాలే ప్రభుత్వంలో రావడానికి, 33 జిల్లాల్లో పార్టీ వేళ్లునుకోవడానికి కారణమైందని వివరించారు. పిడికెడు మందితో జలదృశ్యంలో ప్రారంభమైన టీఆర్ఎస్.. తెలంగాణను సుజల దృశ్యంగా మార్చిందని పేర్కొన్నారు. మేధావులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, యువత, సబ్బండవర్గాలకు శిరసు వంచి ధన్యవాదాలు తెలుపుకొంటున్నట్టు చెప్పారు. మీరు చూపిన బాటలోనే ముందుకు నడుస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నట్టు పేర్కొన్నారు. డిసెంబర్ 3 నుంచి గత 144 రోజులుగా ప్రతి రోజు ఏదో ఒక సందర్భంలో కేసీఆర్ను తలుచుకోని వారులేరని పేర్కొన్నారు. కేసీఆర్ మళ్లీ వస్తే బాగుంటదని ప్రజలు ఆలోచిస్తున్నారని చెప్పారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం జరగలేదని, కేజ్రీవాల్ అరెస్ట్ అన్యాయమని రాహుల్గాంధీ అంటారు. మద్యం కుంభకోణం జరిగిందని, కవిత అరెస్ట్ న్యాయమేనని రేవంత్ అంటారు. ఒకే కేసులో అరెస్ట్ అయిన ఇద్దరిపై కాంగ్రెస్ పార్టీకి రెండు రకాల వైఖరి ఎలా ఉంటుంది.
-కేటీఆర్
వరంగల్ ప్రజల హృదయాలను కడియం శ్రీహరి తీవంగా గాయపరిచారని కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. రాహుల్గాంధీ, రేవంత్రెడ్డి ప్రచారం చేసినా కడియంను కాపాడలేరని తేల్చిచెప్పారు. కడియం శ్రీహరి ఉద్యమ ద్రోహి అని, ఆయనకు కేసీఆర్ చాలా పదవులు ఇచ్చారని, చివరికి ఆయన బిడ్డకు ఎంపీ టికెట్ కూడా ఇచ్చారని గుర్తుచేశారు. ఆయన చేసిన మోసాన్ని పార్టీ కార్యకర్తలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. కాకతీయ కళాతోరణాన్ని అధికారిక ముద్ర నుంచి తీసేస్తామన్న రేవంత్రెడ్డి వరంగల్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.