KTR | రాష్ట్ర ప్రభుత్వ పాలనపై ఏఐసీసీ సంతృప్తిగా ఉందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. నిజంగానే రాష్ట్ర పాలనపై ఏఐసీసీ సంతృప్తి చెందిందా అని ప్రశ్నించారు. అసలు రాష్ట్రంలో పాలన అనేది ఒకటి ఉంటే కదా..? ఇంతకంటే దిక్కుమాలిన ప్రకటన ఇంకోటి ఉంటదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంతకీ ఏఐసీసీకి అంత సంతృప్తి ఎందుకు అని కేటీఆర్ పలు ప్రశ్నలు ప్రశ్నించారు.? తెలంగాణ రైతులకు సంకెళ్లు వేసినందుకా ? అమాయకులైన అన్నదాతలను జైలులో పెట్టినందుకా ?? కొడంగల్ లో బలవంతంగా భూములు గుంజుకున్నందుకా ?? కొనుగోలు కేంద్రాల్లో రైతులను బలిపశువులను చేస్తున్నందుకా ?? మూసీ ప్రాజెక్టులో భాగంగా వేల ఇళ్ల కూల్చివేతకు సిద్ధమైనందుకా ?? హైడ్రా పేరిట పేద ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నందుకా ? ఏడాది కావస్తున్నా గ్యారెంటీ కార్డును పాతాళంలో పాతిపెట్టినందుకా ?? రెండు లక్షల ఉద్యోగాల హామీ అమలును గాలికి వదిలేసినందుకా ?? తెలంగాణ ప్రగతికి బ్రేకులు వేసి.. ఆర్థికంగా దివాలా తీయిస్తున్నందుకా ?? సంక్షేమానికి సమాధి కట్టి.. అభివృద్ధికి అడ్రస్ లేకుండా చేసినందుకా ?? తెలంగాణలోని సకల రంగాలను.. సబ్బండ వర్గాలను దగా చేసినందుకా.. మొత్తంగా తెలంగాణను ఆగం చేసినందుకా.. మీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి అంతటి సంతృప్తి అని ప్రశ్నించారు.
ఢిల్లీకి అందుతున్న వేల కోట్ల మూటలు చూసి మీరెంత మురిసిపోయినా.. మాటిచ్చి మోసం చేసిన ముఖ్యమంత్రిని.. గ్యారెంటీ కార్డు ఇచ్చి గారడీ చేసిన కాంగ్రెస్ పార్టీని చూసి, నాలుగు కోట్ల తెలంగాణ సమాజం మాత్రం రగిలిపోతోందని కేటీఆర్ అన్నారు. కనికరం లేని కాంగ్రెస్ పాలనకు కర్రుగాల్చి వాతపెడుతుందని మండిపడ్డారు.