హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): జనా భా నియంత్రణ విషయంలో దక్షిణాది రాష్ర్టాలు పాటించిన క్రమశిక్షణ.. వాటికి రాజకీయంగా శిక్షగా మారనున్నది. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వ నిర్వాకంతో ఉత్తరాది రాష్ర్టాల ఆధిపత్యం మరింత పెరిగే ప్రమాదం పొంచి ఉన్నది. జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని కేంద్రం నిర్ణయించినట్టు తెలిసింది. ఇదే జరిగితే ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర వంటి రెండుమూడు రాష్ర్టాల్లో గెలిచే పార్టీకే దేశాన్ని శాసించే అవకాశం దక్కుతుంది. ఇది అనేక విపరీత పరిణామాలకు దారి తీసే ప్రమాదం ఉన్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత లోక్సభ నియోజకవర్గాలను 1971 జనాభా లెక్కల ఆధారంగా నిర్ధారించారు.
అప్పుడు పెద్ద రాష్ట్రాల్లో ఒకో నియోజకవర్గానికి సగటున ఓటర్లు 10 లక్షల నుంచి 10.6 లక్షల వరకు ఉన్నారు. గత 40 ఏండ్లుగా సీట్ల సంఖ్య పెరుగలేదు. జనాభా లెక్కలు మాత్రం తారుమారయ్యాయి. దక్షిణాది రాష్ర్టాలు జనాభా నియంత్రణను కఠినంగా పాటించగా, ఉత్తరాది రాష్ర్టాలు ఇప్పటికీ అదుపు చేయలేదు. దీంతో ఆ రాష్ర్టాల్లో ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఉదాహరణకు తెలంగాణ జనాభాను లోక్సభ సీట్లతో గణిస్తే.. ఒక్కో ఎంపీ స్థానానికి 22 లక్షల మంది జనాభా వస్తుంది. ఇదే సమయంలో యూపీ జనాభా 28 లక్షలుగా, రాజస్థాన్ జనాభా 31 లక్షలుగా ఉన్నది. దీంతో జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ర్టాలకు అదనంగా సీట్లు వస్తాయి. జనాభాను అదుపు చేసిన తెలంగాణ వంటి దక్షిణాది రాష్ర్టాలు తీవ్రంగా నష్టపోతాయి.
ఉత్తరాదిలో సంతానోత్పత్తి రేటు ఎక్కువ..
జాతీయ కుటుంబ సర్వే తాజా నివేదిక ప్రకారం దేశంలోనే అత్యధికంగా బీహార్లో 3.1 శాతం సంతానోత్పత్తి రేటు నమోదైంది. అంటే అక్కడ ఒక్కో జంట సగటున ముగ్గురు పిల్లలను కంటున్నారు. యూపీ (2.4 శాతం), జార్ఖండ్ (2.3 శాతం), రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్ అస్సాంలో 2 శాతం ఉన్నది. ఇదే సమయంలో సంతానోత్పత్తి రేటు తెలంగాణ, తమిళనాడు, కేరళ, ఏపీల్లో 1.8 శాతంగా ఉన్నది. ఇదే ఇప్పుడు ఈ రాష్ర్టాలకు శాపంగా మారబోతున్నది.
2026 లక్ష్యాలు నెరవేరలేదు..
వాస్తవానికి పునర్విభజనను 1976 నుంచి 2000 సంవత్సరం వరకు అమలు చేయాలని నిర్ణయించారు. ఆ తర్వాత 2001 జనాభా లెక్కల ప్రకారం మళ్లీ నియోజకవర్గాలను విభజించాలని నిర్ణయించారు. అయితే.. దక్షిణాది రాష్ర్టాలు జనాభా నియంత్రణ పాటించడం, ఉత్తరాదిలో విపరీతంగా ఓటర్లు పెరిగిపోవడంతో సమతుల్యం దెబ్బతింటుందని నాటి ఎన్డీయే ప్రభుత్వం భావించి పునర్విభజనను 2026కు వాయిదా వేసింది. 25 ఏండ్లలో ఉత్తరాదిలోనూ జనాభా నియంత్రణ పద్ధతులు పాటించి జనాభా సమతుల్యత తీసుకురావాలనేది లక్ష్యం. కానీ అది నెరవేరలేదు. ఆయా రాష్ర్టాల్లో జనాభా పెరిగిపోతూనే ఉన్నది. దీంతో జనాభా ప్రాతిపదికన పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ర్టాలు తీవ్రంగా నష్టపోనున్నాయి. 2009లో జరిగిన అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన సైతం జనాభా ప్రాతిపదికనే జరిగాయి. అప్పుడు కనీసం 2 లక్షల జనాభాగా నిర్ణయించారు.
శాశ్వతంగా ద్వితీయ శ్రేణి రాష్ర్టాలుగా..
దేశంలో రాజకీయంగా ఉత్తరాది ఆధిపత్యం కొనసాగుతున్నది. దక్షిణాది పట్ల చిన్నచూపు చూస్తున్నారు. జాతీయ భాష అంటూ హిందీని నెత్తిన రుద్దుతున్నారనీ, హిందీ రాని వారిని ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారనే ఆరోపణలు మొదటి నుంచీ ఉన్నాయి. కేంద్రం నిధుల విభజన జనాభా ప్రాతిపదికన జరుగుతుండటంతో ఇప్పటికే తీవ్ర నష్టం వాటిల్లుతున్నది. దక్షిణాది రాష్ర్టాలు సంపాదించి పెడితే, ఉత్తరాది రాష్ర్టాలు కూర్చొని తింటున్నాయనే భావన ఉన్నది. 2026లో జనాభా ప్రతిపదికన విభజన జరిగితే దక్షిణాదిపై ఉత్తరాది ఆధిపత్యం శాశ్వతం కానున్నది. ఇది రాజకీయంగా, భాష, సంస్కృతి పరంగా, నిధుల పంపకం.. ఇలా అన్ని రంగాల్లో దక్షిణాది రాష్ర్టాలకు అన్యాయం జరుగుతుంది.
సీట్లు తగ్గిస్తే దక్షిణాదికి అన్యాయం
డీలిమిటేషన్ ప్రక్రియలో భాగంగా దక్షిణాది రాష్ర్టాల్లోని పార్లమెంట్ సీట్ల సంఖ్యను తగ్గిస్తే.. న్యాయాన్ని అపహాస్యం చేసినట్టే అవుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. సంక్షేమ కార్యక్రమాల అమలుతోపాటు జనాభా నియంత్రణలోనూ దక్షిణాది రాష్ర్టాలు మెరుగైన పురోగతి సాధిస్తున్నాయని, దీనిని సాకుగా చూపి పార్లమెంట్ సీట్ల సంఖ్యను తగ్గించరాదని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. దేశ మొత్తం జనాభాలో దక్షిణాది (తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు) రాష్ట్రాల్లో 1951లో 26.2% జనాభా ఉంటే.. 2022 నాటికి 19.8 శాతానికి తగ్గిందని వివరించారు. ఉత్తరాది (ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఝార్ఖండ్) రాష్ర్టాల్లో జనాభా 39.1% నుంచి 43.2 శాతానికి పెరిగిందని తెలిపారు. దక్షిణాదిలో జనాభా 6.4% తగ్గగా ఉత్తరాదిలో 4.1% పెరిగిందని వివరించారు. భారతదేశ గణాంకాల శాఖ ట్విట్టర్ అకౌంట్లో ఇందుకు సంబంధించిన వివరాలను పంచుకోగా దానిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. కేటీఆర్ అభిప్రాయంతో పలువురు నెటిజన్లు ఏకీభవించారు. డీలిమిటేషన్లో సీట్లు తగ్గిస్తే దక్షిణాది రాష్ర్టాలు ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. జనాభా ప్రాతిపదికన లోక్సభలో 846 సీట్లు ఏర్పడితే.. అందులో ఒక యూపీలోనే 143 సీట్లు ఉంటాయని, దీనితో దక్షిణాది నుంచి పార్లమెంట్లో ప్రాతినిథ్యం తగ్గుతుందని నెటిజన్లు పేర్కొన్నారు.
‘హార్స్ ట్రేడింగ్’పై జీఎస్టీకి ఇదే టైమ్
విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ప్రభుత్వాలను కూలదోసేందుకు బీజేపీ కోట్లకొద్దీ డబ్బును వెదజల్లటంపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. కొన్నేండ్లుగా బీజేపీ 277 మంది ఎమ్మెల్యేలను కొనడానికి రూ.6,300 కోట్లు ఖర్చు పెట్టిందన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణలను ఎన్డీటీవీ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ను రీట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్ ‘కేంద్రంలోని బీజేపీ తన దగ్గర ఉన్న అన్ని సంస్థాగత సాధనాలను దుర్వినియోగం చేసి, 8 రాష్ర్టాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోసింది. అది సరిపోదన్నట్టు జార్ఖండ్, ఢిల్లీలో అదే తప్పును పునరావృతం చేయడానికి ప్రయత్నిస్తున్నది. నిర్మలా సీతారామన్ జీ.. మీరు చెప్పిన హార్స్-ట్రేడింగ్ (ఇతర పార్టీల్లోని ప్రజా ప్రతినిధులను డబ్బు ఎరవేసి పార్టీ మారేలా ప్రోత్సహించటం)పై జీఎస్టీ విధించడానికి ఇదే సరైన సమయం’ అని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. గతంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హార్స్ రైడింగ్పై జీఎస్టీ వేసామని చెప్పడానికి బదులు హార్స్ ట్రేడింగ్ అని చెప్పారు. ఆ మాటను గుర్తుచేసిన కేటీఆర్, బీజేపీ తీరును ఒక్క ట్వీట్తో తూర్పారబట్టారు.
ప్రాజెక్ట్ శక్తి లీడర్స్ సాహసం అద్భుతం
రాష్ట్రంలో వంద మంది బాలికలను చదివించాలనే ఉద్దేశంతో ప్రముఖ పర్వతారోహకురాలు పూర్ణ మాలావత్, అంతరిక్ష శాస్త్రవేత్త కావ్య మాన్యపు కలిసి హిమాలయాల్లో గతంలో ఎవరూ అధిరోహించని 6,012 మీటర్ల ఎత్తయిన పర్వతాన్ని అధిరోహించారు. వీరి సాహసాన్ని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కొనియాడారు. ‘హిమాలయాల్లో గతంలో ఎవరూ అధిరోహించని 6,012 మీటర్ల పర్వతాన్ని అధిరోహించిన ప్రాజెక్ట్ శక్తి లీడర్స్ పూర్ణ మాలావత్, మాన్యపు కావ్యలకు హృదయపూర్వక అభినందనలు. తెలంగాణలో 100 మంది బాలికలకు విద్యను అందించాలనే గొప్ప ఉద్దేశంతో వారు చేసిన సాహసం ఇది. ప్రాజెక్ట్ శక్తి అనేది నిరుపేద బాలికలను ఎంపవర్-ఎడ్యూకేట్-ఎలివేట్ చేయాలనే లక్ష్యంతో చేపట్టిన ఓ మంచి కార్యక్రమం’ అని శుక్రవారం ట్వీట్ చేశారు.