KTR | మెడికల్ ఎంట్రన్స్ పరీక్షలలో అర్హత సాధించినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త స్థానికత జీవో కారణంగా ప్రవేశాలకు అనర్హులుగా మిగిలిపోతున్న తెలంగాణ విద్యార్థుల ఆవేదనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్కు సోమవారం వచ్చిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కేటీఆర్తో సమావేశమయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్థానికతకు సంబంధించి ఒక ఇబ్బందికరమైన జీవోను తీసుకువచ్చిందని విద్యార్థులు కేటీఆర్కు తెలిపారు.
గతంలో పదో తరగతి వరకు 7 సంవత్సరాలు ఎక్కడ చదివితే అక్కడే స్థానికులుగా పరిగణించే నిబంధన ఉండేదని విద్యార్థులు తెలిపారు. అయితే ఇప్పుడు 9, 10, 11, 12 తరగతులు వరుసగా చదివిన వారికే స్థానికత వర్తించేలా మార్పు చేశారని పేర్కొన్నారు. దీనివల్ల వందలాది మంది విద్యార్థులు నష్టపోతున్నారని కేటీఆర్కు వివరించారు. పదో తరగతి వరకు తెలంగాణలో చదివిన తర్వాత, అత్యుత్తమ శిక్షణ కోసం చాలామంది ఆంధ్రాతో పాటు అనేక నాన్-తెలుగు రాష్ట్రాలలో కోచింగ్లు తీసుకుని నీట్ పరీక్షలకు సన్నద్ధమయ్యారని, ఇప్పుడు ఆ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అర్హత సాధించినప్పటికీ, ప్రభుత్వం వారిని అనర్హులుగా ప్రకటించి ప్రవేశాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం మొండిగా సుప్రీంకోర్టు వరకు వెళ్లిందని వారు తెలిపారు.
విద్యార్థులు, వారి తల్లిదండ్రుల సమస్యలను సవివరంగా విన్న కేటీఆర్.. వెంటనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ఫోన్లో మాట్లాడారు. ఈ సమస్యను సానుకూలంగా పరిశీలించాలని ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక ప్రతినిధి బృందం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలుస్తుందని తెలిపారు.
తెలంగాణ విద్యార్థుల మెడికల్ అడ్మిషన్లపై @KTRBRS స్పందన: విద్యార్థుల ఆవేదనపై ప్రభుత్వానికి విజ్ఞప్తి
విద్యార్థులు, వారి తల్లిదండ్రుల సమస్యలను సవివరంగా విన్న కేటీఆర్, వెంటనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ఫోన్లో మాట్లాడారు.
మానవీయ కోణంలో ఆలోచించాలని ప్రభుత్వానికి సూచన.
మెడికల్… pic.twitter.com/Fd8i66Y0oL
— BRS Party (@BRSparty) September 15, 2025
అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పాలసీపరమైన మార్పులు లేదా స్థానికతకు సంబంధించిన అర్హతలను మార్చినప్పుడు, వాటిని గతానుగతంగా కాకుండా భవిష్యత్తు కోసం ఒక కటాఫ్ డేట్ పెట్టి, రెండు లేదా మూడు సంవత్సరాల సమయం ఇచ్చి అలాంటి నిబంధనలు తీసుకువస్తే బాగుంటుందని సూచించారు. కానీ, విద్యార్థులు అప్పటికే తమ ఇంటర్మీడియట్ కోసం ఇతర ప్రాంతాల్లో చదువుతూ, ప్రిపేర్ అవుతున్న వారిని పరిగణనలోకి తీసుకోకుండా ఇచ్చిన ఆదేశాల వల్లనే ఈ పరిస్థితి నెలకొన్నదని కేటీఆర్ అన్నారు. ఈ అంశంలో మానవతా కోణంలో నిర్ణయం తీసుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యపై ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకొని విద్యార్థులకు ఉపశమనం కల్పిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.