తెలంగాణ ఆస్తులను తెగనమ్ముతున్న కేంద్రం
రాష్ర్టాల హక్కులను అపహాస్యం చేయటమే!
పెట్టుబడుల ఉపసంహరణను మానుకోవాలి
రాష్ట్రంలో 6 సంస్థలకు 7,200 ఎకరాలిచ్చాం
వాటిలోని పీఎస్యూలను పునరుద్ధరించాలి
లేకుంటే కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయాలి
మోదీ సర్కార్పై మంత్రి కేటీఆర్ ధ్వజం
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలకు ఘాటు లేఖ
హిందుస్థాన్ కేబుల్స్ లిమిటెడ్, హిందుస్థాన్ ఫ్లోరో కార్బన్స్ లిమిటెడ్, ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, హెచ్ఎంటీ, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంస్థలను విక్రయించడానికి కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధి జరగాలన్న ఉదాత్త లక్ష్యంతో
ఆ ఆరు సంస్థలకు గత రాష్ట్ర ప్రభుత్వాలు 7,200 ఎకరాల భూములను కేటాయించాయి. వీటి విలువ బహిరంగ మార్కెట్లో రూ.40 వేల కోట్లకు పైనే ఉంటుంది. ఆయా సంస్థలను ప్రైవేటీకరించడమంటే తెలంగాణ ఆస్తులను అమ్ముతున్నట్టుగానే ఇకడి ప్రజలు భావిస్తారు.
హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వరంగ సంస్థ (పీఎస్యూ)ల అమ్మకం విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు రాష్ట్ర ప్రభుత్వాల హకులను అపహాస్యం చేసేలా ఉన్నదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించకుండా ‘పకోడీ’ కహానీలు చెప్తున్న నరేంద్రమోదీ ప్రభుత్వం.. ప్రజలకు చెందిన కోట్ల రూపాయల ఆస్తులను అమ్ముకొనే పనిలో బిజీగా ఉన్నదని విమర్శించారు. ఒకప్పుడు ప్రజల ఆత్మగౌరవానికి, దేశాభివృద్ధికి చిహ్నంలా నిలిచిన ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను బీజేపీ ప్రభుత్వం అడ్డగోలుగా తెగనమ్ముతున్నదని మండిపడ్డారు. రాజ్యాంగబద్ధంగా తెలంగాణకు ఇచ్చిన ఎన్నో హామీల అమలును పట్టించుకోని మోదీ ప్రభుత్వం.. ఇప్పుడు పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో రాష్ట్ర ప్రజలకు చెందిన రూ.40 వేల కోట్ల ఆస్తులను అమ్మేందుకు ప్రయత్నిస్తున్నదని దుయ్యబట్టారు. తెలంగాణలోని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మవద్దని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు ఘాటైన లేఖ రాశారు.
ఉద్యోగాలు కల్పించాలన్న సోయిలేని కేంద్రం
దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మాలన్న మోదీ సర్కారు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వంతోపాటు టీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయా సంస్థల అమ్మకాన్ని కట్టిపెట్టి వాటిని పునఃప్రారంభించేందుకు అవకాశాలను పరిశీలించాలని మరోసారి కేంద్రాన్ని కోరారు. ప్రత్యక్షంగా వేల మందికి, పరోక్షంగా లక్షల మందికి ఉపాధి కల్పించిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను తిరిగి ప్రారంభిస్తే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు విస్తృతమవుతాయన్న సోయి మోదీ ప్రభుత్వానికి లేకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడుల ఉపసంసహరణ ప్రణాళికల్లో భాగంగా రాష్ట్రంలోని హిందుస్థాన్ కేబుల్స్ లిమిటెట్, హిందుస్థాన్ ఫ్లోరో కార్బన్స్ లిమిటెడ్, ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, హెచ్ఎంటీ, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంస్థలను అమ్ముతున్నదని మండిపడ్డారు. ప్రస్తుతం తెలంగాణలో వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక అనుకూల వాతావరణం ఉన్న నేపథ్యంలో ఈ సంస్థలను పునరుద్ధరించడంపై దృష్టి సారించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. స్థానిక ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించడంతోపాటు తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధి జరగాలన్న ఉదాత్త లక్ష్యంతో గతంలోని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ 6 సంస్థలకు సుమారు 7,200 ఎకరాల భూములను కేటాయించాయని గుర్తుచేశారు. ప్రస్తుతం ఆ భూముల విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.5 వేల కోట్లకుపైగా.. బహిరంగ మారెట్ ధరల ప్రకారం రూ.40 వేల కోట్లకుపైగా ఉంటుందని పేర్కొన్నారు.
రాష్ట్రం ఇచ్చిన భూములను అమ్మే హక్కు కేంద్రానికి ఎక్కడిది?
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అమ్మాలనుకొంటున్న ప్రభుత్వ రంగ సంస్థల భౌతిక ఆస్తులను తెలంగాణ ప్రజలకు చెందినవిగా తమ ప్రభుత్వం గుర్తిస్తున్నదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. పెట్టుబడుల ఉపసంహరణ పేరిట ఆయా సంస్థలను ప్రైవేటీకరించడమంటే తెలంగాణ ఆస్తులను అమ్ముతున్నట్టుగానే ఇకడి ప్రజలు భావిస్తారని తేల్చిచెప్పారు. హైదరాబాద్లో ప్రజా రవాణా కోసం చేపట్టే సైవే లాంటి ప్రజోపయోగ ప్రాజెక్టులకు భూములు అడిగితే మారెట్ ధరల ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన భూములను అమ్మే హకు ఎకడ ఉన్నదని ప్రశ్నించారు. తమిళనాడుతోపాటు చాలా రాష్ట్రాల్లోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను అమ్మేందుకు జరుగుతున్న ప్రయత్నాలను ఆయా రాష్ర్టాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో పీఎస్యూల అమ్మకంపై పునరాలోచన చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.
నూతన పరిశ్రమల ఏర్పాటుకు అవకాశమివ్వాలి
తెలంగాణలో ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా కొనసాగిన పీఎస్యూలను అమ్మడానికి బదులు వాటిని పునరుద్ధరించి, బలోపేతం చేయాలని మంత్రి కేటీఆర్ కేంద్రానికి సూచించారు. అలా చేయకుండా ఆ కంపెనీల ఆస్థులను అమ్మి సొమ్ము చేసుకొందామనుకొంటే కచ్చితంగా వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. వాటిని తిరిగి ప్రారంభించేందుకు అవకాశం లేకుంటే ఆ సంస్థలున్న ప్రాంతంలోనే నూతన పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని మంత్రి కేటీఆర్ కోరారు.