KTR | హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒకటేనని, బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయడానికి ఆ పార్టీలు ఒక్కటవుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ధ్వజమెత్తారు. బీజేపీ ఎంపీ బండి సంజయ్, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ వ్యాఖ్యలు ఇదే విషయాన్ని చెప్తున్నాయని అన్నారు. బీఆర్ఎస్.. మోదీ, రేవంత్రెడ్డికి భయపడే పార్టీ కాదని స్పష్టంచేశారు. బీఆర్ఎస్ను లేకుండా చేసే శక్తి ఎవరికీ లేదని అన్నారు. నిజాలు మాట్లాడితే విధ్వంసకర మనస్తత్వమా? అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను నిలదీశారు. కరెంటు బిల్లులు
కట్టొద్దని అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలే ప్రజలకు చెప్పారని, అదే విషయాన్ని తాను గుర్తుచేశానని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మరో ఏడెనిమిది స్థానాలు గెలిచి ఉంటే రాష్ట్రంలో హంగ్ వచ్చేదని చెప్పారు. అతి తక్కువ ఓట్లతో 14 సీట్లను కోల్పోయామని, మైనారిటీల్లో ఉన్న అపోహలను తొలగించాలని పార్టీ నాయకులకు సూచించారు. ఆదివారం తెలంగాణ భవన్లో మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం నిర్వహించారు. 2019 ఎన్నికల్లో మలాజిగిరి లోక్ సభ స్థానాన్ని అతి తకువ ఓట్లతో కోల్పోయామని, ఈసారి కచ్చితంగా అక్కడ బీఆర్ఎస్ జెండా ఎగురుతుందని తెలిపారు.
కరెంటు బిల్లు సోనియా కడుతుందని చెప్పింది మీరే
ఈ ఏడాది జనవరి నుంచి 200 యూనిట్ల లోపు విద్యుత్తు బిల్లులు కట్టొద్దని గత ఎన్నికల సమయంలో రేవంత్రెడ్డి ప్రజలకు చెప్పారని, గత నవంబర్ నుంచే బిల్లులు కట్టొద్దని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చెప్పారని కేటీఆర్ గుర్తుచేశారు. ‘కరెంటు బిల్లులు కట్టొద్దని నేను ప్రజలకు చెప్తే భట్టి విక్రమార్క నాది విధ్వంసకర మనస్తత్వం అంటున్నారు. నిజాలు మాట్లాడితే విధ్వంసకర మనస్తత్వమా? సోనియాగాంధీయే కరెంటు బిల్లులు కడుతారని చెప్పింది కాంగ్రెస్వాళ్లే. అందుకే కరెంటు బిల్లులు సోనియాకే పంపుదాం. ప్రజలు తమ బిల్లులు సోనియాకు పంపేలా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు సమాయాత్తం చేయాలి. నిరుద్యోగ భృతిపై భట్టి ఇప్పటికే అసెంబ్లీ సాక్షిగా మాట తప్పారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఇక తప్పించుకున్నట్టే. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదాపై మాట మార్చింది. ఎన్నికల హామీల నుంచి కాంగ్రెస్ తప్పించుకుంటున్న తీరును ప్రజాకోర్టులోనే ఎండగడదాం’ అని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు సమాచార హకు చట్టాన్ని కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు.
కారు సర్వీసింగ్కు మాత్రమే వెళ్లింది
పాలనపై దృష్టిపెట్టి ప్రతిపక్షాల దృష్ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టలేకపోవటం వల్లనే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు వ్యతిరేక ఫలితాలు వచ్చాయని కేటీఆర్ అన్నారు. ‘మనం పాలనమీదే దృష్టి పెట్టి యూట్యూబ్ చానళ్లలో వచ్చిన అడ్డగోలు దుష్ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టలేక పోయాం. ప్రగతి భవన్లో విలాసవంతమైన సౌకర్యాలున్నాయని దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు భట్టి అందులోనే ఉంటున్నారు. అందులో విలాసాలుంటే ఆయన ఈపాటికే టాంటాం చేయకపోయేవారా? బీఆర్ఎస్ ప్రభుత్వం ఆన్లైన్లో రేషన్కార్డులిచ్చింది. ఆ విషయం పార్టీ కార్యకర్తలకు కూడా తెలియలేదు. పార్టీ కమిటీలు పూర్తిగా వేయకపోవడం వల్ల కూడా నష్టం జరిగింది. ఇకపై మూడు నెలలకోసారి అన్ని కమిటీల సమావేశం నిర్వహించుకుందాం. గతంలో జరిగిన పొరపాట్లు ఇకముందు జరగవు. కారు కేవలం సర్వీసింగ్కు వెళ్లింది. మళ్లీ రెట్టింపు వేగంతో పరుగెత్తుతుంది. కాంగ్రెస్ వాళ్లు తప్పుడు కేసులు పెడుతున్నారు.
కార్యకర్తలు అధైర్యపడొద్దు. పార్టీ కార్యకర్తలకు లీగల్ సెల్ అండగా ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ మోదీ, రేవంత్రెడ్డికి భయపడేది కాదు. ఎట్టి పనికైనా మట్టి పనికైనా తెలంగాణ ఏకైక గొంతుక బీఆర్ఎస్ పార్టీనే. పార్లమెంటులో తెలంగాణ గొంతుక వినబడాలంటే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలి. కాంగ్రెస్, బీజేపీ కలిసి తెలంగాణ గొంతుక అయిన బీఆర్ఎస్ను ఖతం చేయాలని చూస్తున్నాయి. బీజేపీ నేత బండి సంజయ్ వ్యాఖ్యలు చూసినా, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కొత్త పలుకు చూసినా అదే విషయం రుజువవుతున్నది. ఇటీవల మోదీని రేవంత్, భట్టి కలిసినపుడు ఆయన బీఆర్ఎస్ను ఖతం చేసేందుకు పూర్తిగా సహకరిస్తానన్నారని రాధాకృష్ణ స్పష్టంగా చెప్పారు. దీన్నిబట్టే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ టీం కాదని.. బీజేపీ, కాంగ్రెస్ ఒకటేనని స్పష్టంగా తెలియడం లేదా? మైనారిటీల్లో ఉన్న అపోహలను తొలగించాలి. మలాజిగిరిలో బీఆర్ఎస్ భారీ మెజారిటీ సాధించేందుకు కష్టపడదాం’ అని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అసెంబ్లీ మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్యేలు సుధీర్రెడ్డి, బండారు లక్ష్మారెడ్డి, కేపీ వివేకానంద్, మాధవరం కృష్ణారావు, లాస్య నందిత, మర్రి రాజశేఖర్రెడ్డి పాల్గొన్నారు.
కాంగ్రెస్కు ముందుంది ముసళ్ల పండగ: మల్లారెడ్డి
అసెంబ్లీ ఎన్నికల్లో మలాజిగిరి పార్లమెం ట్ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ స్థానాలకు ఏడింటిని గెలిచి చరిత్ర సృష్టించామని మాజీ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి తెలిపారు. మలాజి గిరి బీఆర్ఎస్ అడ్డా అని అన్నారు. కేసీఆర్లాంటి నాయకుడు దేశంలో మరొకరు దొరకరని పేర్కొన్నారు. కాంగ్రెస్ అంటేనే పెద్ద దరిద్రమని, బీఆర్ఎస్ అంటే తెలంగాణకు గొప్ప నమ్మకమని అన్నారు. కాంగ్రెస్వాళ్లు గెలవగానే ఎగిరెగిరి పడుతున్నారని, వాళ్లకు ముందుంది ముసళ్ల పండగ అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ను సీఎంగా కోల్పోయినందుకు ప్రజలు బాధ పడుతున్నారని తెలిపారు. యుద్ధంలాగా పోరాడి లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపిద్దామని పిలుపునిచ్చారు.
కేసీఆర్పై ప్రజల్లో ఆదరణ చెకు చెదరలేదు: పోచారం
హైదరాబాద్ ఓటర్లు మంచిని ఎప్పటికీ ఆదరిస్తారని, అదే విషయాన్ని అసెంబ్లీ ఎన్నికల్లో నిరూపించారని అసెంబ్లీ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. నిత్యం ప్రజ ల్లో ఉండే నాయకులకు ప్రజల అండ ఉంటుందని తెలిపారు. ‘అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కేసీఆర్ది తప్పు లేదు. మనదే తప్పు. కేసీఆర్పై ప్రజల్లో ఆదరణ చెకు చెదరలేదు. రాజకీయాలను వ్యాపారంగా కాకుండా సేవాదృక్పథంతో చూడాలి. కార్యకర్తలను బాగా చూసుకోవాలి. కాంగ్రెస్ పాలనలో క్రమశిక్షణ లేదు. ఓకే సీఎంతో ఐదేండ్లు పాలన సాగే అవకాశం లేదు. మనం అధైర్య పడే అవసరంలేదు. పార్లమెంటు ఎన్నికల్లో గట్టిగా పోరాడి మెజారిటీ సీట్లు గెలుద్దాం’ అని పిలుపునిచ్చారు.
కోతుల గుంపులా మంత్రుల ప్రవర్తన: కడియం
బీఆర్ఎస్ను బొంద పెట్టే మొనగాడు ఈ భూమి మీద ఇంకా పుట్టలేదని మాజీ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. బీఆర్ఎస్ను బొంద పెట్టడం రేవంత్తో కాదు కదా.. రేవంత్ అయ్య వల్ల కూడా కాదని ఘాటుగా వ్యాఖ్యానించారు. దావోస్లో సీఎం తెలంగాణ పరువు తీశారని, గుంపు మేస్త్రీ పేరుకు తగ్గట్టుగానే రేవంత్ వ్యవహార సరళి ఉన్నదని ఎద్దేవా చేశారు. కేటీఆర్ దావోస్ వెళ్లినప్పుడు ఎంత హుందాగా వ్యవహరించారో, రేవంత్ ఎంత దరిద్రంగా ప్రవర్తించారో ప్రజలు గమనించాలని కోరారు. కాంగ్రెస్ మంత్రులు కోతుల గుంపులా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ఎపుడు ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్దే విజయమని ధీమా వ్యక్తంచేశారు.