హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్కు అవకాశం ఇస్తే నోట్లపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బొమ్మను ముద్రించే అవకాశాలు ఉన్నాయని మంత్రి కే తారకరామారావు ఎద్దేవాచేశారు.
గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లోని ఎల్జీ వైద్య కళాశాల పేరును నరేంద్ర మోదీ కాలేజీగా మార్చారని, గతంలో అహ్మదాబాద్లోని సర్దార్ పటేల్ స్టేడియం పేరును నరేంద్ర మోదీ స్టేడియంగా మార్చారని మంత్రి కేటీఆర్ శుక్రవారం ట్విట్టర్లో గుర్తుచేశారు. ఈ పరిణామాలను పరిశీలిస్తే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ త్వరలో నోట్లపై గాంధీజీ బొమ్మ స్థానంలో ప్రధాని మోదీజీ బొమ్మను ముద్రించాలని ఆర్బీఐని ఆదేశించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
వాతావరణ మార్పులతో తక్షణ ముప్పు పొంచి ఉన్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. వాతావరణంలో తరచూ మార్పులు జరగకుండా సమతుల్యంగా ఉండాలన్నా, భూమిని రక్షించుకోవాలన్నా.. తెలంగాణ అటవీ విశ్వవిద్యాలయం తరహా కార్యక్రమాలు చేపట్టాలని ట్వీట్ చేశారు.