మన దేశంలో మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ధైర్యం చేసి మందు కనుగొన్నడు. వ్యాక్సిన్ కనుగొన్నడు.
–కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
ఏ క్యాటగిరీలో మోదీకి నోబెల్ ఇద్దాం?
మెడిసిన్: కొవిడ్ వ్యాక్సిన్ కనుగొన్నందుకా?
ఎకనమిక్స్: పెద్ద నోట్ల రద్దు, స్విస్ బ్యాంకుల్లోని బ్లాక్ మనీని వెనుకకు తీసుకొచ్చినందుకా?
పీస్: రష్యా- ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆరు గంటలపాటు ఆపినందుకా?
ఫిజిక్స్: రాడార్ సిద్ధాంతాన్ని రూపొందించినందుకా?
– రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్
హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): అబద్ధాలను అద్భుతంగా చెప్పడంలో బీజేపీ నేతలను మించినవారు మరొకరు లేరని, వారి నైపుణ్యాలకు నోబె ల్, ఆస్కార్ వంటి అవార్డులు ఇవ్వొచ్చని పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ వ్యం గ్యంగా పేర్కొన్నారు. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి కిషన్రెడ్డి తమ ప్రసంగాల్లో చెప్పిన విషయాలను ఉదహరిస్తూ సోమవారం ట్వీట్లు చేశారు. ప్రధాని మోదీ కొవిడ్కు వ్యాక్సిన్ కనుగొన్నారని కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఓ బహిరంగసభలో చేసిన వ్యాఖ్యల వీడియోను టీఎస్ఎండీసీ చైర్మన్ క్రిషాంక్ ట్విట్టర్లో పోస్ట్చేస్తూ మోదీ శాస్త్రజ్ఞుడా? అని ప్రశ్నించారు. దీనిపై కేటీఆర్ స్పంది స్తూ మెడిసిన్/సైన్స్రంగంలో మోదీకి నోబెల్ బహుమతి ఇవ్వాలని డిమాండ్ చేద్దామంటూ వ్యంగ్యంగా ట్వీట్చేశారు. నిజంగా మోదీ కొవిడ్ వ్యాక్సిన్ను ఎంతో ధైర్యంగా కనుగొన్నారని ఎద్దేవాచేశారు.
మోదీ అనేక రంగాల్లో నోబెల్ బహుమతికి అర్హుడని, కొవిడ్ వ్యాక్సిన్ కనిపెట్టినందుకు వైద్యశాస్త్రంలో, నోట్ల రద్దు, స్విస్ బ్లాక్మనీ వాపస్ తెచ్చినందుకు ఆర్థికశాస్త్రంలో, రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆరుగంటలు ఆపినందుకు శాంతికి, రాడార్ సిద్ధాంతం కనిపెట్టినందుకు భౌతిక శాస్త్రంలో నోబెల్ ఇవ్వొచ్చని ఎద్దేవాచేశారు. ‘నోబెల్ కన్నా ఇంకా పెద్ద అవార్డుకు మోదీ అర్హుడని భావించే బీజేపీ వాళ్లకు నేను చెప్పేది ఒక్కటే. 2013లో రూపాయి విలువ పతనమవటంపై మోదీ నాటి కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ అద్భుత నాటకీయ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. అందుకు మోదీని అతిపెద్ద అవార్డుకు నామినేట్ చేయాలనుకొంటున్నా. ఆయనకు ఆస్కార్ కాకపోయినా భాస్కర్ అవార్డు ఇవ్వాల్సిందే’ అని కేటీఆర్ మరో ట్వీట్లో పేర్కొన్నారు. అప్పటి మోదీ ప్రసంగం వీడియోను ట్విట్టర్లో పోస్ట్చేశారు. ‘ఏ దేశంతో మనకు సమస్యలేకున్నా, చిన్నచిన్న దేశాల్లోని కరెన్సీలన్నీ బలంగా ఉన్నా మన రూపాయే బలహీనపడింది. కేంద్రంలో అవినీతి రాజకీయాలే కారణం’అని మోదీ ఆ ప్రసంగంలో పేర్కొన్నారు.