హైదరాబాద్, మే 3 (నమస్తేతెలంగాణ)/కరీంనగర్ కార్పొరేషన్: అక్రమ కేసులో అరెస్ట్పై సంగారెడ్డి జైలులో ఉన్న కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ను సోమవారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించనున్నారు. ఆయన యోగక్షేమాలు తెలుసుకున్న తర్వాత అక్కడే మీడియాతో మాట్లాడుతారు. అనంతరం కరీంనగర్ పీఎంజే నగల షాపు దోపిడీ ఘటనలో గాయపడి దవాఖానలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శిస్తారని బీఆర్ఎస్ కరీంనగర్ అధ్యక్షుడు చల్లా హరిశంకర్ తెలిపారు.
మధ్యాహ్నం 2.30 గంటలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయానికి కేటీఆర్ చేరుకుంటారని, అనంతరం 3 గంటలకు బాధితులను పరామర్శిస్తారని, 3.30 గంటలకు పీఎంజే నగలషాపును పరిశీలిస్తారని పేర్కొన్నారు. సాయంత్రం 4 గంటలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతారని తెలిపారు.