హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): ‘చెప్పింది చేస్తాం.. చేసేదే చెప్తాం. అదీ బీఆర్ఎస్ విధానం. సీఎం కేసీఆర్ దమ్ము అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం.. అలవికానీ హామీలు ఇస్తుందన్నారు. కాంగ్రెస్ సంస్థాగతంగా చేసుకున్న ఉదయ్పూర్ డిక్లరేషన్నే చెత్తబుట్టలో పారేసిన వాళ్లు మ్యానిఫెస్టోను పారేయరని గ్యారెంటీ ఏమిటని ప్రశ్నించారు. కుటుంబానికి ఒక్క సీటు మాత్రమే ఇవ్వాలని రాసుకున్నారని, అదే తెలంగాణలో ఉత్తమ్కుమార్రెడ్డి వారి సతీమణి, కోమటిరెడ్డి బ్రదర్స్, వివేక్ బ్రదర్స్, మైనంపల్లి అండ్ సన్ ఇలా సొంత పార్టీలో చేసుకున్న డిక్లరేషన్నే చిత్తుకాగితంలా పారేశారని వివరించారు.
ఈ క్రమంలో పార్టీ మ్యానిఫెస్టోకు ఏమాత్రం విలువ ఇవ్వరని పేర్కొన్నారు. కానీ, బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను అమలు చేయడమే కాకుండా అందులో ఇవ్వని రైతుబంధు, కల్యాణలక్ష్మి, మిషన్ భగీరథ, కేసీఆర్ కిట్, దళితబంధు ఇలా అనేక పథకాలు చెప్పకపోయినా చేసిన మొగాడు..మొనగాడు సీఎం కేసీఆరేనని వివరించారు. ప్రజల జీవితాల్లో మార్పు రావాలె కానీ, కాంగ్రెస్ నిరుద్యోగులకు పదవుల మార్పు కాదని స్పష్టం చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్కే అనుబంధ ఆటోయూనియన్ సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులకు రూ.73 వేల కోట్లు రైతుబంధు ఇచ్చింది మార్పు కాదా? అని ప్రశ్నించారు. ఆడపిల్ల పెండ్లికి కల్యాణలక్ష్మి/షాదీముబారక్ ద్వారా రూ.1,00,116 ఇవ్వడం మార్పులో భాగంగా కాదా? ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’ అని పాడుకున్న దుస్థితి నుంచి ‘నేను సర్కారు దవాఖాన్ల ప్రసూతి అయితే కేసీఆర్ కిట్ వస్తది’ అనేది వైద్యంలో మార్పు జరగలేదా? వెయ్యి గురుకులాలతో ప్రపంచంతో పోటీపడే విద్యార్థులుగా తీర్చిదిద్దిన మార్పు మార్పు కాదా? అని ప్రశ్నించారు. 2014లో ఉన్న భూముల ధరలకు ఇప్పుడున్న ధరలకు పోల్చిచూస్తే మార్పు ఎంత జరిగింది? అని అడిగారు.
ఎట్లుండె తెలంగాణ.. ఎట్లయింది
2014లో ఎట్లుండె తెలంగాణ.. ఇప్పుడు ఎట్లయింది తెలంగాణ అని కేటీఆర్ ఒక్కో రంగంలో తెలంగాణలో జరిగిన మార్పులను ఆవిష్కరించారు. కండ్ల ముందు జరిగిన మార్పును గమనించాలే కానీ, సోషల్ మీడియా సహా వివిధ మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న అసత్యాలను నమ్మకూడదని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో జరిగిన మార్పులను ఆటోయూనియన్ కార్మికులను అడిగి తెలుసుకున్నారు. అన్ని పట్టణాలు, పల్లెలు బ్రహ్మాండంగా మారాయని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీకి నిరుద్యోగం ఎక్కువ?
కాంగ్రెస్ పార్టీలో పదవులు లేనితనంతో నాయకులు నిరుద్యోగులుగా ఉన్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి సహా అనేక పదవుల కోసం పోటీపడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్కు నిరుద్యోగులపై ఏమాత్రం ప్రేమలేదని విమర్శించారు. దేశంలో తెలంగాణ కంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం మరేదైనా ఉంటే రాహుల్గాంధీ చూపించాలని సవాల్ విసిరారు. పదేండ్లలో తెలంగాణ 1,60,083 ఉద్యోగాలను ఇచ్చిందని, దేశంలో ఇలా ఉద్యోగాలు ఇచ్చిన ఒక్క రాష్ట్రమైనా చూపాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఆగం కావద్దని, అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ భరోసా అని చెప్పారు. సంపద పెంచడం, ప్రజలకు పంచడం అనే విధానంతో కేసీఆర్ ముందుకు సాగుతున్నారని తెలిపారు. 2009లో కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో తండాలను గ్రామ పంచాయతీలు చేస్తామని, రైతులకు 9 గంటల కరెంట్ ఇస్తామని, మనిషికి ఆరు కిలోల బియ్యం ఇస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చిన తరువాత ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదని గుర్తుచేశారు. ఇది ఆగమయ్యే సందర్భం కాదని, జాగ్రత్తగా ఆలోచించి ఓటేయ్యాలని విజ్ఞప్తి చేశారు. మార్చిలో పరీక్ష తప్పితే సెప్టెంబర్లో రాస్తామంటే కుదరదని, 1956లో ఒక్కచిన్న తప్పు చేస్తే 58 ఏండ్లు గోసపడ్డామని గుర్తుచేశారు. ఇప్పుడు మల్లా తప్పు చేస్తే ఐదేండ్లు గోసపడ్తామని సూచించారు.
ఆర్నెళ్లకో ముఖ్యమంత్రి మారితే పెట్టుబడులెలా వస్తాయి?
తెలంగాణ బాగుండాలంటే హైదరాబాద్ బాగుండాలని, రాష్ర్టానికి 50 శాతం ఆదాయం హైదరాబాద్ నుంచే వస్తుందని కేటీఆర్ వివరించారు. హైదరాబాద్లో ఐటీ, సహా ఇతర పెట్టుబడులు రావాలంటే ఆర్నెళ్లకో సీఎం మారితే ఎలా వస్తాయి? అని ప్రశ్నించారు. ఇలాంటి స్థితి ఉంటే నిర్ణయాలు ఎలా జరుగుతాయని అడిగారు. 55 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ ఇప్పుడు ఒక్క చాన్స్ అనడం దారుణమన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో పేదవాళ్లు, పెద్దవాళ్లు అందరూ సంతోషంగా ఉన్నారని చెప్పారు. ఆటో కార్మికులు ఒక్కొక్కరూ ఒక్కో కేసీఆర్లా ప్రతి ఒక్కరూ పది మందిని చైతన్యం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీలు శ్రీనివాస్రెడ్డి, కర్నె ప్రభాకర్, బీఆర్ఎస్కే అధ్యక్షుడు రాంబాబు యాదవ్, ఆటోయూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య, అబీబ్, పాల్వంచ కృష్ణ, సైదులు, నిరంజన్, జబ్బార్, అశోక్, వాజిద్, శాతం రమేశ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, శుక్రవారం మంత్రి కేటీఆర్ సమక్షంలో ఎన్ఎస్యూఐ జాతీయ కన్వీనర్ దినేష్సాగర్ బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మీకందరికీ అండగా ఉంటానని, భవిష్యత్లో రాజకీయంగా ఎదిగేందుకు సంపూర్ణ సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు.
డీప్ ఫేక్ ప్రచారంపై జాగ్రత్త: కేటీఆర్
డీప్ ఫేక్ ప్రచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలకు వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ఓటమి అంచున ఉన్న కాంగ్రెస్ పార్టీ రానున్న 4-5 రోజుల్లో అనేక ఫేక్ వీడియోలు, ఫేక్ వార్తలు ప్రచారం చేసే అవకాశం ఉన్నదని శుక్రవారం ట్విట్టర్లో హెచ్చరించారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి ఫేక్ ప్రచారం వల్ల ఓటర్లు ప్రభావితం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఆటో డ్రైవర్లకు రూ.100 కోట్ల పన్నును రద్దుచేసినా, రూ.5 లక్షల ప్రమాద బీమా, రవాణా పన్ను మాఫీ ఇలా అనేక మానవీయ నిర్ణయాలను ఎవరూ అడగకపోయినా చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దే. ఆటో యూనియన్కు భవనం కట్టిస్తాం. ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం.
– కేటీఆర్