KTR | తెలంగాణ భవన్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాబోయే ఎన్నికలకు సంబంధించి కార్యాచరణపై చర్చించారు. రానున్న లోక్సభ, ఎమ్మెల్సీ ఉప ఎన్నికలపై చర్చించారు. ఇప్పటికే ఒక స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నోటిఫికేషన్ విడుదలైంది. సోమవారం నుంచి నామినేషన్లు ప్రారంభమైన నేపథ్యంలో ఎన్నికల కోసం చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్ స్థానంతో పాటు నాగర్కర్నూల్ లోక్సభ స్థానంలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఉమ్మడి జిల్లా నేతలతో కేటీఆర్ చర్చించారు.
ఒకటి రెండు రోజుల్లోనే ఈ రెండు పార్లమెంట్ నియోజకవర్గాలపై పార్టీ అధినేత కేసీఆర్ విస్తృతస్థాయి సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఎమ్మెల్సీతో పాటు లోక్సభ ఎన్నికలకు సంబంధించిన పరిస్థితులను కేసీఆర్కు విజ్ఞప్తి చేస్తామని భేటీలో నేతలు చెప్పారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు ఈ రెండు లోక్సభ ఎన్నికల్లో పార్టీ విజయ అవకాశాలు బలంగా ఉన్నాయని నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో మాజీ మంత్రులు నిరంజన్రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్గౌడ్తో పాటు పలువురు నేతలు హాజరయ్యారు.