హైదరాబాద్ : ఈ నెల 27న మాదాపూర్ హెచ్ఐసీసీలో టీఆర్ఎస్ ప్లీనరి సమావేశం జరుగనున్నది. ఈ సందర్భంగా ప్లీనరీ ఏర్పాట్లపై రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నేతలతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం సమావేశమయ్యారు. హెచ్ఐసీసీలో జరిగిన సమావేశంలో ప్లీనరీ ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్లీనరీకి సంబంధించిన ఏర్పాట్లపై సలహాలు, సూచనలు స్వీకరించినట్లు తెలిపారు. ప్లీనరీ కోసం కమిటీలు ఏర్పాటు చేయడంతో పాటు అందరికీ ఆహ్వానాలు పంపామన్నారు. మాజీ మంత్రులు, ఎంపీలకు ప్రత్యేక ఆహ్వానాలు పంపినట్లు తెలిపారు.
ప్లీనరి రోజున ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ప్రతినిధుల వివరాల నమోదు కార్యక్రమం ఉంటుందన్నారు. ఆ తర్వాత 11 గంటలకు పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరిస్తారని తెలిపారు. సాయంత్రం 5 గంటల వరకు వివిధ అంశాలపై తీర్మానాలు, చర్చలు ఉంటాయని పేర్కొన్నారు. ప్రతినిధుల సభకు ఆహ్వానితులు మాత్రమే రావాలని ఈ సందర్భంగా కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గ్రామ పంచాయతీల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించాలన్నారు.