హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడం కోసం రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అమెరికాలో పర్యటించనున్నారు. వారం రోజుల పర్యటన కోసం ఆయన శనివారం రాత్రి బయలుదేరి వెళ్లారు. తన పర్యటనలో న్యూయార్క్, షికాగో నగరాల్లో పలువురు దిగ్గజ పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు. ఆ సందర్భంగా ఆయా కంపెనీలు తెలంగాణకు భారీగా పెట్టుబడులను ప్రకటించే అవకాశమున్నట్టు సమాచారం. దేశంలోనే తెలంగాణను పారిశ్రామికంగా అత్యున్నత స్థానంలో నిలిపి, భారీగా ఉద్యోగావకాశాలను సృష్టించేందుకు కేటీఆర్ పెద్ద ఎత్తున కృషిచేస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం దేశ విదేశాల్లోని పారిశ్రామికవేత్తలతో తరచూ సమావేశాలు నిర్వహిస్తూ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారికి వివరిస్తున్నారు.
పెట్టుబడులను రాబట్టేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోకపోవడమే కాకుండా ఇతర ప్రాంతాలకు వెళ్లే అవకాశమున్న పెట్టుబడులను సైతం రాష్ర్టానికి మళ్లించేందుకు తనదైన శైలిలో కృషిచేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి కేటీఆర్ అమెరికా పర్యటనకు వెళ్లారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్న పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశం నిర్వహించేందుకు ఇప్పటికే అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. న్యూయార్క్, షికాగో నగరాల్లో వివిధ రంగాలకు చెందిన సుమారు 15 మంది పారిశ్రామిక, వాణిజ్య ప్రతినిధులతో కేటీఆర్ భేటీ అయ్యేందుకు షెడ్యూల్ ఖరారైందని అధికారవర్గాలు తెలిపాయి. మంత్రితోపాటు ఐటీ, పరిశ్రమల శాఖకు చెందిన పలువురు డైరెక్టర్లు కూడా ఈ సమావేశాల్లో పాల్గొంటారు. ఆయా కంపెనీల ప్రతినిధులు ఇదివరకే రాష్ర్టాన్ని సందర్శించి ఇక్కడి అవకాశాలను అధ్యయనం చేసి వెళ్లారని, రాష్ర్టానికి భారీగా పెట్టుబడులు వచ్చే అవకాశముందని అధికారులు తెలిపారు.
అమెరికా పర్యటన ప్రథమాంకంలో బిజినెస్ దిగ్గజాలతో బిజీబిజీగా గడపనున్న మంత్రి కేటీఆర్, పర్యటన చివరి అంకంలో తన కుమారుడు హిమాన్షు యూనివర్సిటీ అడ్మిషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇప్పటికే హిమాన్షుకు అమెరికాలోని ఓ ప్రముఖ యూనివర్సిటీలో ప్రవేశం ఖరారైంది. కుమారుడిని యూనివర్సిటీలో చేర్పించేందుకు మంత్రి కేటీఆర్ తన భార్యతో కలిసి వెళ్లనున్నారు.