KTR : అసెంబ్లీలో కీలకమైన అంశాలపై చర్చను పక్కన పెట్టేందుకే ప్రభుత్వం ఆటల పోటీలకు తెర తీస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మండిపడ్డారు. గురువారం అసెంబ్లీ లాబీల్లో మీడియాతో చిట్చాట్లో మాట్లాడిన కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రేవంత్ సర్కార్ సభను నడపలేకనే క్రీడా పోటీల ఎత్తుగడ వేసిందని ఆయన విమర్శించారు.
రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు అత్యంత కీలకమైన పద్దులపై చర్చలు కొనసాగుతున్న తరుణంలో ఎమ్మెల్యేలకు ఆటల పోటీలు నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కేటీఆర్ తప్పుబట్టారు. ఇంత సీరియస్గా సభ జరుగుతున్న సమయంలో క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వడం ఏంటీ?అని ఆయన ప్రశ్నించారు. ఇదే విషయాన్ని తాను అసెంబ్లీ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లగా ఆయన వద్ద ఎటువంటి సమాధానం లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
ప్రభుత్వం ప్రజా సమస్యల పట్ల బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. ఇరిగేషన్ వంటి అత్యంత ముఖ్యమైన సబ్జెక్టులపై సభలో లోతైన చర్చ జరగాల్సి ఉందని, కానీ ప్రభుత్వం మాత్రం పద్దులపై చర్చను త్వరగా ముగించి పారిపోవాలని చూస్తోందని ఆయన విమర్శించారు. కీలకమైన అంశాలపై చర్చలు జరగాల్సిన సమయంలో ఎమ్మెల్యేలు మైదానాల్లో ఆటలు ఆడుతుంటే ప్రజలు ఏమనుకుంటారు? అని కాంగ్రెస్ను ఆయన నిలదీశారు.
ఈ నెల 28, 29 తేదీల్లో ఈ క్రీడా పోటీలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడంపై కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల కాలాన్ని ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగించకుండా, ఇలాంటి కార్యక్రమాలతో కాలయాపన చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. పద్దులపై చర్చకు తగినంత సమయం కేటాయించకుండా క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వడం ప్రభుత్వ చిత్తశుద్ధిపై అనుమానాలకు తావిస్తోందని వ్యాఖ్యానించారు. చర్చించాల్సిన కీలకమైన అంశాలు పక్కనపెట్టి.. కేవలం ప్రతిపక్షాలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే రేవంత్ సర్కార్ క్రీడా పోటీలను ఒక సాకుగా చూపిస్తోందని కేటీఆర్ మండిపడ్డారు.