KTR | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి గాలి లేదని.. అదే సమయంలో అర్థంకాకుండా ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎన్నికల ఫలితాలపై తెలంగాణ భవన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ఇది వేవ్ అయితేనేమో రాష్ట్రమంతా ఒకేలా ఉండేది. గ్రేటర్ హైదరాబాద్లో ప్రజలు ఏకపక్షమైన తీర్పునిచ్చారు. మెదక్ జిల్లాలో దాదాపు ఏకపక్షంగా ఉంది. కరీంనగర్లో 40-60శాతంగా ఉన్నది. ఇది వేవ్లా లేదు. సేమ్ టైమ్ అర్థం కాకుంటా ఉన్నది. మా నాయకులు, అభ్యర్థులతో మాట్లాడిన తర్వాత వారి అనుభవాలను కూడా తెలుసుకుంటాం. పెద్దపల్లి పార్లమెంట్లో చెన్నూరులో బాల్క సుమన్ చేసినంత అభివృద్ధి మంత్రులుగా చేసినవారు లేరు. సింగరేణికి మేం చేసినంత మేలు ఎవరూ చేయలేదు. సింగరేణిని ప్రైవేటీకరణ అడ్డుకోవడం.. కార్మికులకు బోనస్ ఇచ్చాం. సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చడం, వారసత్వ ఉద్యోగాలనే పెండింగ్ సమస్యను పరిష్కరించాం. కానీ, ఇవాళ అక్కడ చూస్తే అక్కడ సాధారణ మెజారిటీ వచ్చింది. ఇంకా లోతుగా అర్థం చేసుకోవాల్సి ఉంది’ అన్నారు.
‘ఇంకా కూలంకషంగా ఆలోచించి చర్చించాలి. మేం కార్యకర్తలు, నాయకులు 39 అసెంబ్లీ స్థానాల్లో గెలిచేందుకు కష్టపడ్డారు. వారికి నా అభినందనలు. ఎన్నికల్లో సహజంగా ఆశిస్తాం. ఎగ్జిట్ పోల్స్ తప్పుడు.. 70 సీట్లు వస్తాయని చెప్పాం. తప్పని ప్రూవ్ చేస్తామని చెప్పాం. కానీ నేను అనుకున్నది రాలేదు. కొంత నిరాశ ఉంది కానీ.. బాధ లేదు. ప్రజలకు మాకు రెండుసార్లు అవకాశం కల్పించారు. తెలంగాణ ప్రజానీకానికి సర్వదా రుణపడి ఉంటాం. పది సంవత్సరాలు అవకాశం కల్పించారు. వారే వాళ్లకు అవకాశం ఇచ్చారని తిట్టిపోయడం అనేది.. నిందించడం అనేది భావ్యం కాదు. రాజీకాయాల్లో హుందా తనం, స్థితప్రజ్ఞత, రాజనీతిజ్ఞత చాలా ముఖ్యం. మా నాయకుడు మాకు అది నేర్పించాడు. మా నాయకుడు ఏం అంటడంటే.. గెలవంగానే పొంగిపోవద్దు.. ఓడిపోగానే కుంగిపోవద్దు. నేను మా నాయకులు, కార్యకర్తలకు చెప్పేది అదే’నన్నారు.
‘గెలిచినప్పు పొంగిపోవడం.. ఓడిపోగానే కుంగిపోవడం ఓ రాజకీయ నాయకుడి లక్షణం కాదు. ధీరుడి లక్షణం కాదు. ఎట్లాంటి ప్రతికూల పరిస్థితి ఉన్నా తెలంగాణ ఉద్యమంలో ధీరోదాత్తంగా పోరాడం. మేం ఇలాంటివి ఎన్నో చూశాం. మమ్మల్ని ఖతం చేయాలన్న ప్రయత్నాలు.. మా పార్టీని ఫినిష్ చేయాలనే ప్రయత్నాలను ఎన్నో చూశాం. కాబట్టి ఎందుకు ప్రజలు ఎందుకు నిర్ణయం తీసుకున్నారో తీసుకున్నారు.. దాన్ని మే గౌరవిస్తాం. నాకు కూడా ఎమ్మెల్యే పదవి లేదు. మీతో ఎక్కువ సేపు కూర్చొని కూలంకషంగా మాట్లాడే అవకాశం ఉంటుంది. అన్ని తెలుసుకొని మాట్లాడతాను. ఇవాళ మేం ఓడిపోయాం. కానీ, ప్రతి రోజూ ఇదే జరుగదు. ఇవాళ ఆదివారం.. ప్రతిరోజూ ఆదివారం కాదు. ఇది గుర్తించుకోవాలి. మేం మళ్లీ స్ట్రాంగ్గా తిరిగి వస్తాం’ అని స్పష్టం చేశారు.