హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఇండస్ట్రియల్ భూములు ఉన్నాయని, కాబట్టి కొత్తగా వచ్చే పరిశ్రమలకు అనువైన స్థలాన్ని కేటాయించడం ప్రభుత్వానికి చాలా సులభమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. యూరోపియన్ బిజినెస్ గ్రూప్ సభ్యులతో బుధవారం జరిగిన వెబినార్లో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఎస్ఐపాస్ గురించి మంత్రి వివరించారు.
యూరప్ మరియు భారత దేశానికి చెందిన పలు కంపెనీల ప్రతినిధులు, వ్యాపార వర్గాలు, రాయబార కార్యాలయాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కే తారకరామారావు యూరోపియన్ వ్యాపార వాణిజ్య వర్గాలకు తెలంగాణలో ఉన్న పెట్టుబడి అవకాశాలతో పాటు ఇక్కడి వ్యాపార అనుకూలతలను వివరించారు. యూరప్ వ్యాపార వాణిజ్య వర్గాలను చేరుకుని, తెలంగాణ గురించి వివరించేందుకు సహకరించాలని ఈ సమావేశంలో పాల్గొన్న వివిధ దేశాలకు చెందిన రాయబార కార్యాలయాల ప్రతినిధులకు మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా మంత్రి కే తారకరామారావు తెలంగాణలో ఉన్న పెట్టుబడి అవకాశాలను వివరిస్తూ ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన విధానం గురించి వివరించి, టీఎస్ఐపాస్ విధానంలో ఉన్న ప్రత్యేకతలను తెలియజేశారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి చెందిన పెట్టుబడులకు అనుకూలమైన పాలసీలతో పాటు వివిధ రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అనేక వినూత్నమైన కార్యక్రమాలకు, దేశవ్యాప్తంగా వివిధ వర్గాల నుంచి వస్తున్న ప్రశంశలను వివరించారు. తాము చేపట్టిన టీఎస్ఐపాస్ తెలంగాణను పెట్టుబడులకు ఆకర్షణనీయ గమ్యస్థానంగా మార్చడంలో విజయం సాధించిందని ఈ సందర్భంగా, టీఎస్ఐపాస్ ద్వారా సాధించిన విషయాల తాలూకు గణాంకాలను ఈ సందర్భంగా మంత్రి ప్రస్తావించారు.
తమ ప్రభుత్వ పాలసీల వలన తెలంగాణ ప్రభుత్వం గత ఏడు సంవత్సరాల్లో అద్భుతమైన పురోగతి సాధించిందని, భారత దేశ జీడీపీకి తెలంగాణ రాష్ట్రం తరఫున గణనీయమైన వాటాను అందిస్తోందని కేటీఆర్ ఈ సందర్భంగా తెలియజేశారు. మంత్రి కేటీఆర్ తన ప్రసంగం తర్వాత ఆయా ప్రతినిధులు వివిధ అంశాలపైన అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే ఐటి, లైఫ్ సైన్సెస్, ఫార్మా, ఏరోస్పేస్, డిఫెన్స్, టెక్స్టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి 14 రంగాలను ప్రాధాన్యతా రంగాలుగా ఎంచుకుని ఆయా రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం స్థానికంగా ఉన్న రాష్ట్రాలతోనే కాకుండా ఈ రంగాల్లో దూసుకు వెళ్తున్న వివిధ దేశాలతోనూ పోటీ పడేందుకు సిద్ధంగా ఉందని, ఇందుకు సంబంధించి భారీ పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేస్తున్నామని హైదరాబాద్ ఫార్మా సిటీ, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, మెడికల్ డివైస్ పార్క్ వంటి అంశాలను ప్రస్తావించారు.
అలాగే తెలంగాణలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకునే కంపెనీలు భూసేకరణ కోసం క్లిష్టతరమైన విధానాలు అనుసరించాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. రాష్ట్రంలో అత్యుత్తమ స్థాయి విద్యుత్ పుష్కలంగా ఉందని, ఉత్తమ మానవ వనరులు కూడా లభిస్తాయని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం కేవలం మౌలిక వసతులు సదుపాయాల కల్పనకు మాత్రమే కాకుండా మానవ వనరుల అభివృద్ధి, వారి శిక్షణకు సైతం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఇందులో భాగంగానే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే కంపెనీల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వమే తన ఖర్చుతో శిక్షణ కార్యక్రమాలను చేపట్టిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేశారు.
ఇప్పటికే తెలంగాణలో అమెరికా, జపాన్, చైనా, కొరియా, తైవాన్ వంటి దేశాలకు చెందిన పెట్టుబడులు ఉన్నాయని, అనేక యూరోపియన్ కంపెనీలు కూడా అత్యంత సౌకర్యవంతంగా తమ కార్యకలాపాలను తెలంగాణలో కొనసాగిస్తున్న విషయాన్ని మంత్రి కేటీఆర్ ప్రస్తావించారు. తెలంగాణ ప్రభుత్వ పాలసీలను వ్యాపార అనుకూలతను ఇక్కడి పెట్టుబడి అవకాశాలను యూరోపియన్ వ్యాపార వాణిజ్య సంస్థలకు తెలియజేసేందుకు ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు ప్రయత్నించాలని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
లాజిస్టిక్స్ విషయంలో కూడా పరిశ్రమలకు తెలంగాణ అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందని వివరించారు. రాష్ట్రంలో కొత్తగా వస్తున్న పెట్టుబడుల్లో 24 శాతం ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన వారి నుంచి వస్తున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అంటే సదరు కంపెనీలు, వ్యాపారవేత్తలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం లాభదాయకంగా ఉన్నట్లు గుర్తించినట్లే కదా అని ఆయన అన్నారు.
తమ రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు పెట్టడం వల్ల కలిగే లాభాలను ఈబీజీ (యూరోపియన్ బిజినెస్ గ్రూప్) సభ్యులు గుర్తించాలని, భారత్లో కొత్తగా ప్రాజెక్టులు ప్రారంభించదలచుకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నారు. ఇప్పటికే తెలంగాణ గురించి తమకు సానుకూల సమాచారం ఉందని, తెలంగాణ రాష్ట్రానికి చెందిన పాలసీలు, ముఖ్యంగా అనుమతుల ప్రక్రియకు సంబంధించి ప్రత్యేకమైన సానుకూల ఫీడ్బ్యాక్ ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు ప్రస్తావించారు.