Minister KTR | హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన వేళ త్వరలో నిర్వహించబోతున్న బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి ప్రతినిధుల సభలు పార్టీ యంత్రాంగానికి గొప్ప అవకాశమని పార్టీ వరింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు అన్నారు. తొమ్మిదేండ్ల ప్రభుత్వ ప్రస్థానాన్ని ప్రజలకు మరోసారి వివరించేందుకు, పార్టీ క్యాడర్ను ఎన్నికలకు అన్నివిధాలుగా కార్యోన్ముఖులను చేసేందుకు ఈ సభలు ఎంతగానో దోహదపడుతాయని వివరించారు. తొలిసారి నియోజకవర్గ స్థాయిలో జరగబోతున్న ప్రతినిధుల సభలు వచ్చే ఎన్నికలకు శంఖారావం లాంటివని అన్నారు. ఆదివారం పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 25న ప్రతినిధుల సభల నిర్వహణపై సలహాలు, సూచనలు ఇచ్చారు. సభలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని ఆదేశించారు. తెలంగాణ ఉద్యమ ప్రస్థానాన్ని, తొమ్మిదేండ్ల తెలంగాణ రాష్ట్ర ఉజ్వల ప్రయాణాన్ని సభల్లో సమగ్రంగా చర్చించేలా ప్రసంగాలు, రాజకీయ తీర్మానాలు ఉండాలని సూచించారు. కార్యకర్తల్లో సమరోత్సాహాన్ని నింపడంతోపాటు సీఎం కేసీఆర్ సారథ్యంలో పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించేందుకు ఈ సభల ద్వారా బలమైన పునాది వేయాలని దిశానిర్దేశం చేశారు. బీజేపీ అన్యాయాలు, మోసాలు, వైఫల్యాలపై పార్టీ శ్రేణులకు అవగాహన వచ్చేలా సభల నిర్వహణ ఉండాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో దాదాపు 3 వేల నుంచి 3500 మంది కార్యకర్తలను ఈ సభలకు ఆహ్వానించాలని, గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి దాకా దాదాపు నాలుగు లక్షల మందిని ఇందులో మమేకం చేయాలని సూచించారు.
రైతుకు వెన్నెముక కేసీఆర్
ప్రతినిధుల సభల్లో ప్రధానంగా ఆరు తీర్మానాల ద్వారా పార్టీని విసృ్తతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేటీఆర్ సూచించారు. వ్యవసాయం, సంక్షేమం, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, విద్య, ఉపాధి, బీజేపీ వైఫల్యాలు, స్థానిక అంశాలపై తీర్మానాలు చేయాలని కోరారు. వీటితోపాటు వివిధ అంశాలపై సమయాన్ని బట్టి తీర్మానాలు చేసుకోవచ్చని అన్నారు. అన్నింటికన్నా ముఖ్యంగా వ్యవసాయరంగంలో తెలంగాణ సాధించిన ప్రగతి అసాధారణమైనదని, యావత్ దేశానికే ఇది అదర్శంగా నిలుస్తున్న విషయాన్ని తీర్మానాల్లో ప్రస్తావించాలని సూచించారు. దేశానికి వెన్నెముక రైతన్న అయితే ఆ రైతుకు వెన్నెముకగా కేసీఆర్ నిలిచిన విషయాన్ని సభల్లో చర్చించాలని చెప్పారు. స్వతంత్ర భారత చరిత్రలో ఏ పాలకుడు ఆలోచించని విధంగా సీఎం కేసీఆర్ అమలుచేసిన రైతుబంధు, రైతుబీమాపై కూడా పార్టీ సమావేశంలో తీర్మానాలు చేయాలని సూచించారు.
సంక్షేమ ఫలాలను వివరించండి
రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ రంగానికి, సామాజిక భద్రతకు చేపట్టిన కార్యక్రమాల పైన ఒక తీర్మానం ప్రవేశపెట్టి చర్చించాలని కేటీఆర్ సూచించారు. మహిళా సంక్షేమం, వృద్ధులకు ఆసరా పెన్షన్లు, వికలాంగులకు సంక్షేమ కార్యక్రమాలు.. ఇలా సమాజంలోని అన్ని వర్గాలకు అందిస్తున్న సంక్షేమ పథకాలపైన, వాటి ద్వారా ప్రజలకు అందుతున్న ప్రయోజనాలపై ప్రత్యేకంగా రాజకీయ తీర్మానం ఉండాలని సూచించారు.
విద్య, ఉపాధిలో తెలంగాణకు సాటి ఏది?
‘విద్యారంగం ఉపాధి’ అనే అంశంపై మూడో రాజకీయ తీర్మానం చేయాలని కేటీఆర్ కోరారు. ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్న అనేక విద్యాభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేకంగా ప్రసంగాలు ఉండాలని సూచించారు. గురుకుల పాఠశాలల ద్వారా ప్రతి విద్యార్థిపై ఏటా రూ.1,25,000 ఖర్చు చేస్తూ వారి బంగారు భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పాన్ని సభా వేదికపై ఆవిషరించాలని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీఎస్ ఐపాస్ ద్వారా ప్రైవేటు రంగంలో వచ్చిన ఉపాధి అవకాశాలపై ప్రత్యేకంగా చర్చించాలని కోరారు. ప్రభుత్వరంగంలో లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి దాదాపు రెండు లక్షల 30 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తున్న తీరును కూడా ప్రత్యేకంగా ప్రస్తావించాలని సూచించారు. ఉద్యోగాల కల్పనపై కొందరు పనిగట్టుకొని చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
విభజన అంశాలపై విల్లు ఎక్కుపెట్టాలి
నియోజక వర్గాలు, జిల్లాలకు అత్యంత కీలకమైన స్థానిక అంశాలపైన ఆరో రాజకీయ తీర్మానం రూపొందించుకోవాలని కేటీఆర్ సూచించారు. ముఖ్యంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సుదీర్ఘకాలంగా పెండింగ్లో పెట్టిన అంశాలు, విభజన హామీలు, స్థానిక ప్రజల డిమాండ్ల పట్ల బీజేపీ వివక్షా పూరిత వైఖరి వంటి అంశాలు ఈ తీర్మానాల్లో స్పష్టంగా ఉండాలని పేర్కొన్నారు. దీంతోపాటు నియోజకవర్గాలవారీగా కేంద్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను (ఉదాహరణకు సిరిసిల్లకు మెగా పవర్ లూం క్లస్టర్, నారాయణపేటకు హ్యాండ్లూం పారు, మునుగోడులో ఫ్లోరోసిస్ రిసెర్చ్ సెంటర్ ఏర్పాటు, భువనగిరిలో ఎయిమ్స్ కార్యకలాపాలపై నిర్లక్ష్యం వంటి అంశాలు) నెరవేర్చకపోవడంపై తీర్మానాలు చేయాలని కోరారు.
అంబేద్కర్ స్ఫూర్తికి నిలువెత్తు సంతకం స్వతంత్ర భారత చరిత్రలోనేతొలిసారి 125 అడుగుల అంబేదర్ విగ్రహాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయటంపై కూడా తీర్మానం చేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు. ఏ పాలకుడు ఆలోచించని విధంగా తెలంగాణలో అమలుచేస్తున్న దళితబంధు పథకం దేశం దృష్టిని ఆకర్షిస్తున్నదనే విషయాన్ని కూడా ప్రతినిధుల సభలో చర్చించాలని తెలిపారు. రాష్ట్ర అత్యున్నత పరిపాలనా కేంద్రమైన నూతన సచివాలయ భవనానికి డాక్టర్ బీఆర్ అంబేదర్ పేరు పెట్టుకోవడం రాజ్యాంగ నిర్మాతకు తెలంగాణ సమర్పిస్తున్న సమ్మునత గౌరవం అనే విషయాన్ని ఘనంగా చర్చించుకోవాలని సూచించారు.
బీఆర్ఎస్ చారిత్రక అవసరం
ఉద్యమ పార్టీగా మొదలైన టీఆర్ఎస్.. బీఆర్ఎస్గా రూపాంతరం చెందడం, జాతీయ పార్టీగా అవతరించడం ఒక చారిత్రక అవసరమనే విషయాన్ని పార్టీ వేదికపై చర్చించి ప్రజలకు వివరించాలని కేటీఆర్ సూచించారు. సీఎం కేసీఆర్ విజన్ దేశానికి ఏ విధంగా ఉపయోగపడే అవకాశం ఉన్నదో చర్చిచాలని కోరారు. దేశానికి విజన్ ఉన్న నాయకత్వం కావాలి.. టెలివిజన్లో ఊకదంపుడు ఉపన్యాసాలతో ఊదరగొట్టే నాయకత్వం కాదనే విషయాన్ని ప్రజలకు వివరించేలా తీర్మానం చేయాలని ఆదేశించారు. కేసీఆర్ అంటే సంక్షేమం, మోదీ అంటే సంక్షోభంగా ప్రజలు భావిస్తున్న అంశంపై సభలో తీర్మానించడంతోపాటు.. వచ్చే ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని సర్వసన్నద్ధం చేసేలా సభలను నిర్వహించాలని కోరారు.
పల్లె సిరులు.. పట్టణ వెలుగులను ప్రజలకు చూపండి
నాలుగో రాజకీయ తీర్మానంగా పల్లె ప్రగతి – పట్టణ ప్రగతి ద్వారా అటు పట్టణాలు, ఇటు పల్లెల్లో సాధించిన సమగ్ర ప్రగతిపై విసృ్తతంగా చర్చించాలని మంత్రి కేటీఆర్ అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా తెలంగాణవ్యాప్తంగా జరుగుతున్న ప్రగతిపై చర్చించడం ద్వారా ఈ సరికొత్త అభివృద్ధి నమూనాను దేశానికి పరిచయం చేయాల్సిన ఆవశ్యకతపై సభలో తీర్మానాలు చేయాలని విజ్ఞప్తిచేశారు. ఒకప్పుడు దగాపడ్డ పల్లెలు ఇప్పుడు ప్రగతికి చిరునామాగా మారాయని, పట్టణాలు వెలుగు రేఖలతో ఎలా విరాజిల్లుతున్నాయో ప్రజలకు గుర్తుచేయాలని సూచించారు.
ప్రియమైన సీఎం కావాలా.. పిరమైన ప్రధాని కావాలా?
ఐదో రాజకీయ తీర్మానంగా కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని మంత్రి కేటీఆర్ సూచించారు. మండిపోతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసరాల ధరలతో పేద, మధ్యతరగతి ప్రజలు ఏ విధంగా ఆర్థికంగా చితికిపోతున్నారో తీర్మానంలో ప్రస్థావించాలని కేటీఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు. ముడిచమురు ధరలు తగ్గుతున్నా మోదీ చమురు ధరలు మాత్రం పెరిగిపోతున్నాయనే విషయాన్ని స్పష్టంగా చర్చించాలని కోరారు. రాష్ట్ర ప్రజలను సీఎం కేసీఆర్ కడుపులో పెట్టి చూసుకొంటుంటే, మోదీ మాత్రం పిరమైన ప్రధానిగా మారిపోయారన్న విషయాన్ని పార్టీ శ్రేణులకు వివరించాలని తెలిపారు. ‘ప్రియమైన ముఖ్యమంత్రి కావాలా.. లేక పిరమైన ప్రధాని కావాలో’ ప్రతి ఒకరూ తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందనే విషయాన్ని గుర్తుచేయాలని కోరారు.