హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎంత కుమ్మక్కు రాజకీయాలు చేసినా ఈ ఎన్నికల్లో తాము గతంలో కంటే ఎక్కువ స్థానాల్లో గెలిచి ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రాబోతున్నట్టు మంత్రి కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. బుధవారం దీక్షా దివస్ సందర్భంగా తెలంగాణ భవన్లో రక్తదానం చేసిన ఆయన అనంతరం మీడియాతో ఇష్టాగోష్టిగా ముచ్చటించారు. తాము చేసిన అభివృద్ధి, సంక్షేమం వైపే ప్రజలు ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తమ కార్యాలయంలో కూర్చొని సర్వేలు చేసిన విషయం ప్రజలు తెలిసిపోయిందని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ పరస్పర ప్రయోజనాల కోసం సర్వశక్తులు ఒడ్డాయని ఆరోపించారు.
గతంతో తమ అభ్యర్థులు ఓడిపోయిన ములుగు, గోషామహల్ సహా ఖమ్మంలోని కొన్ని స్థానాలను కూడా ఈసారి బీఆర్ఎస్ గెలుబోతున్నదని ధీమా వ్యక్తం చేశారు. కొడంగల్, కామారెడ్డిలో రేవంత్రెడ్డి.. గజ్వేల్, హుజూరాబాద్లో ఈటల రాజేందర్ ఓడిపోతారని జోస్యం చెప్పారు. గోషామహల్, కోరుట్ల, కరీంనగర్, ఆదిలాబాద్ సహా పలు నియోజకవర్గాల్లో బీజేపీని గెలిపించేందుకు కాంగ్రెస్ పార్టీ బలహీన అభ్యర్థులను నిలిపిందని ఆరోపించారు. నాంపల్లిలో ప్రచారం చేసిన రాహుల్గాంధీ గోషామహల్లో ప్రచారం చేయలేదని, కరీంనగర్, కోరుట్లలో రేవంత్ ప్రచారం చేయలేదని గుర్తు చేశారు. తెలంగాణలో ప్రధాని మోదీ ప్రచారం పార్లమెంటు ఎన్నికల దృష్టిలోనే సాగిందని విమర్శించారు.
ఈసారి ఉమ్మడి మెదక్, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలను తాము స్వీప్ చేయబోతున్నట్టు కేటీఆర్ తెలిపారు. కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ స్థానాలను నిలబెట్టుకుంటామని, ఖమ్మంలో ఈసారి ఆరేడు సీట్లు సొంతం చేసుకోబోతున్నట్టు వివరించారు. గతంలో 108 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయిన బీజేపీకి ఈసారి అంతకుమించిన భంగపాటు తప్పదని చెప్పారు. పొలిటికల్ టూరిస్టులు వచ్చిపోతుంటారని, ఈ గడ్డ బిడ్డ కేసీఆర్నే ప్రజలు తమ నాయకుడిగా ఎన్నుకునేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి అడ్డుచెప్పని కాంగ్రెస్ పార్టీ రైతుబంధుకు మాత్రం అడ్డుచెప్పడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. టీహబ్లో నిరుద్యోగ యువతతో మాట్లాడినందుకు ఈసీ తనకు నోటీసులు ఇచ్చిందని, మంత్రి హరీశ్రావు రైతుబంధుపై మాట్లాడితే చర్యలు తీసుకోవాలి కానీ పథకాన్ని ఆపడం సరికాదని తెలిపారు. కర్ణాటకలో ‘పవర్’ ఇవ్వలేకపోతున్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పవర్లోకి వచ్చినా అదే పరిస్థితి ఉంటుందని విమర్శించారు. ముఖ్యమంత్రి పదవిని గుంపుమేస్త్రీతో పోల్చిన నాయకులు అధికారంలోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు.