KTR | నల్లగొండ : రాష్ట్ర మంత్రులకు దమ్ము, ధైర్యం ఉంటే కరెంట్ కోతల్లేవని, సాగునీటి కొరత లేదని రైతుల ముందుకు వచ్చి చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. నల్లగొండ మండలం ముషంపల్లి గ్రామంలో రైతులు గన్నెబొయిన మల్లయ్య, బోర్ల రాంరెడ్డిని పరామర్శించిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
ఆనాటి తెలంగాణ రైతుల దుస్థితికి, అవస్థలకి చిహ్నంగా నిలిచిన బోర్ల రాంరెడ్డిని, ఆయన దీన పరిస్థితిని కేసీఆర్ వందల సార్లు చెప్పారని కేటీఆర్ గుర్తు చేశారు. ముషంపల్లికి చెందిన రాంరెడ్డి పేరు బోర్ల రాంరెడ్డిగా మారింది. గన్నెబొయిన మల్లయ్య యాదవ్, బోర్ల రాంరెడ్డి పరిస్థితులు తెలుసుకున్న తర్వాత మనసున్న ప్రతి ఒక్కరికి బాధ కలుగుతుంది. అందుకే మల్లన్నను ప్రత్యేకంగా కలిసేందుకు ఈరోజు ముషంపల్లికి రావడం జరిగింది. రాంరెడ్డి అన్నను కలిసినా, మల్లన్నను కలిసినా, కొంతమంది మహిళలను కలిసినా, గత పది సంవత్సరాలలో ఏ రోజు తాగునీటికి, సాగునీటికి కొరత రాలేదని చెప్పారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంటలు ఎండిపోయినయ్, తాగునీరు దొరకని పరిస్థితి ఉందని తమ దీనావస్థను చెప్పుకుంటున్నారని కేటీఆర్ తెలిపారు.
ఇది కాలం తెచ్చిన కరువు కాదు, అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు అని ప్రతి ఒక్కరు చెబుతున్నారు. ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టును విఫల ప్రాజెక్టుగా చూపించాలని… రిజర్వాయర్లలో నీళ్ళు నింపకుండా ఈ ప్రభుత్వం నాటకాలు ఆడింది. కానీ కేసీఆర్ పర్యటన భయంతో నంది పంప్ హౌస్లో ఎల్లంపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోసి కరీంనగర్కు నీళ్లు వదిలారు. నిన్నటిదాకా కాళేశ్వరం ఫెయిల్ అయిందని చెప్పి.. కానీ ఇదే రోజు అదే బాహుబలి మోటార్లతో కరీంనగర్కు నీళ్లు అందిస్తున్నారు. కేసీఆర్ ఉన్నన్ని రోజులు నాగార్జునసాగర్ నుంచి మొదలుకొని… టేయిల్ ఎండ్ దాకా ప్రతి ఒక్కరికి సాగునీరు అందింది. గత పది సంవత్సరాలలో ఏనాడు ఒక బోరు వెయ్యాల్సిన పరిస్థితి రాలేదు. కానీ గత నాలుగు నెలల్లో ఆరు బోర్లు వేసిన పరిస్థితి ఉందని రాంరెడ్డి చెప్పారు. ఈరోజు రైతాంగం పరిస్థితి దారుణంగా ఉంది.. చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వల్ల కలిగింది ఈ దుస్థితి. వంద పది రోజులు అయినా కూడా… నీళ్లు అందించలేని అసమర్థ పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చింది. కేవలం కేసీఆర్ను బద్నాం చేయాలన్న దుర్మార్గపూరిత, చిల్లర తాపత్రయంతో లక్షల మంది రైతుల పంటలను ఎండబెట్టింది. ఎక్కడెక్కడ అయితే పంట నష్టం జరిగిందో అక్కడ ఎకరానికి రూ. 25 వేల పంట నష్టం అందించాలి. ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు… కాంగ్రెస్ తెచ్చిన దుస్థితి.. కాబట్టి మీరు పరిహారం వెంటనే చెల్లించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
ఇప్పటివరకు ముఖ్యమంత్రి కానీ, ఒక్క మంత్రి కానీ రైతుల వద్దకి వెళ్లి పరామర్శించిన పాపాన పోలేదు. కానీ ప్రధాన ప్రతిపక్షంగా మేము, మా నాయకుడు కేసీఆర్ తన ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా మూడు నాలుగు జిల్లాలు తిరిగి రైతులకు పరామర్శించి ధైర్యం చెబుతున్నారు. రైతాంగానికి ధైర్యం చెప్పే బాధ్యత ప్రభుత్వానికి లేదా..? ముఖ్యమంత్రి ఎక్కడున్నాడు… సమాధానం చెప్పాలి. రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పిన పొంకణాల పోతిరెడ్డి రేవంత్ రెడ్డి ఎక్కడ పోయిండు..? వెంటనే రుణమాఫీ చేయనందుకు రాష్ట్ర రైతాంగానికి క్షమాపణ చెప్పాలి. రాష్ట్ర రైతాంగం పక్షాన మా బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది. ఇప్పటికే 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం. రైతులు ధైర్యంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం. వెంటనే క్వింటాల్కు రూ. 500 బోనస్ను అందించాలి. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచైనా ఇచ్చిన హామీలను నెరవేర్చేలా ఒత్తిడి తీసుకువస్తాం అని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి సమస్యను పరిష్కరించకుండా ఉత్త మాటలు మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులంతా కూడా రాజకీయ చేరికల పైన దృష్టి పెట్టారు కానీ రైతాంగం సమస్యల పైన పెట్టలేదు. స్వయంగా ముఖ్యమంత్రి కేశవరావు ఇంటికి వెళ్ళినప్పుడు కూడా కరెంటు పోయింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంత బుఖాయించిన వాస్తవాలు వాస్తవాలే గాని అబద్ధాలు కావు. రాష్ట్ర మంత్రులకు దమ్ము, ధైర్యం ఉంటే రైతుల ముందుకు వచ్చి కరెంటు కోతలు, సాగునీటి కొరత లేదని చెప్పాలి. ఇదే మాట ముషంపల్లికి వచ్చి రైతులతో చెప్పాలని మంత్రులకు కేటీఆర్ సవాల్ విసిరారు.
తమ పంటలు అన్ని ఎండిపోయి అప్పుల పాలయ్యామని, కేసీఆర్ ఉన్నన్ని రోజులు రైతులు బాగున్నారని, మళ్ళీ కేసీఆర్ సీఎం కావాలని మల్లయ్య ఇటీవలే ఆకాంక్షించారు. మల్లయ్య వీడియో చూసి చలించిపోయిన కేటీఆర్.. నల్లగొండ వచ్చినప్పుడు తప్పకుండా కలుస్తా అని ట్విట్టర్లో తెలిపారు.. ఇచ్చిన మాట నిలుపుకుంటూ ఇవ్వాళ ముషంపల్లి గ్రామంలో రైతు మల్లయ్యను కేటీఆర్ కలిశారు.