KTR | ప్రధాని నరేంద్ర మోదీ తన దోస్తు కోసం దిగుమతి చేసుకున్న బొగ్గును ధర ఎంతనా కొనుగోలు చేయాలని అంటున్నాడని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. సిరిసిల్ల బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ నేతల తీరుపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘పీక్ అవర్లో కరెంటు చార్జీలు పెంచాలని కేంద్రం తాఖీదులు ఇస్తున్నది. సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు పీక్ అవర్. అప్పుడు ఇంటికి వచ్చి చాయ్ తాగుతాం. భార్యాపిల్లలతో కలిసి టీవీ చూసుకుంట డిన్నర్ చేసే టైమ్.
ఈ టైమ్లో 20శాతం చార్జీలు పెంచమంటున్నరు. లేకపోతే కరెంటు కట్ చేయమని చెబుతున్నరు. ఇది కేంద్ర ప్రభుత్వం తెలివి. ఆకలికి అయినోడికి అన్నం పెట్టొద్దు.. కడుపు నిండాక పెట్టమని చెప్పమంటున్నరు ఇదే వాళ్లు చెప్పే నీతి. దానికి ఈ సన్నాసులు సిగ్గూశరం లేకుండా వంతపాడుతున్నరు. ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది రోజు. దేశంలో సింగరేణి, కోలిండియా బొగ్గు ఉన్నది. దేశంలో 361 బిలియన్ మెట్రిక్ టన్నుల బొగ్గు 125 సంవత్సరాలకు పెరుగుతున్న అవసరాలకు విద్యుత్ ఉత్పత్తి ఉన్నది. కానీ, నరేంద్ర మోదీ కానీ కావాలని ఆస్ట్రేలియాతో ఒప్పందం చేసుకుంటున్నడు’ అని మండిపడ్డారు.
‘అదానీ కోసం అక్కడి బొగ్గును దిగుమతి చేసుకోమంటున్నరు. రూ.3వేలకు టన్ను బొగ్గును వదులుకొని.. దానికంటే పదిరెట్లు విలువైన బొగ్గును కొనాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం తాఖీదులు ఇచ్చింది. మనం కాదు యూపీ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సైతం ఇది తప్పు. మేం కొనమని.. కొంటే మునిగిపోతమని సీఎం కుండబద్దలు కొట్టారు. కానీ సిగ్గే లేకుండా ఎంతకైనా తెగించి.. ఆయన ఇచ్చే చందాల కోసం దిగజారి ఇవాళ విదేశీ బొగ్గు, అదానీ కోసం పాలసీ తెచ్చిన వ్యక్తి నరేంద్ర మోదీ. తనదోస్తు కోసం బొగ్గు మాత్రమే కాదు విమానాశ్రయాలను సైతం రాసిస్తున్నడు.
ఇదివరకు ఇక సంస్థకు రెండుకంటే ఎక్కువ విమానాశ్రయాలు ఉండొద్దని ఉండేది. కానీ, ఎప్పుడైతే అదానీ వచ్చిండో బ్రహ్మాండంగా ఆరు విమానాశ్రయాలు ఉండవచ్చని రాసి ఇచ్చిండు. మోదీ అదానీకి రాసిస్తే మనదేం పోయిందే అని చాలామంది తమ్ముళ్లు నాతో అంటున్నరు. ఎప్పుడైనా విదేశీ బొగ్గు తెచ్చుకుంటమో ఆటోమేటిక్గా బొగ్గు కాస్లీ అవుతుంది. ఆ తర్వాత కరెంటు కూడా కాస్లీ అవుతుంది. కరెంటు కాస్లీ అయితే మోదీ ఓర్సుకుంటడా? మళ్లీ మన రైతులు, నేతన్నలు, మన ఇండ్లు, పారిశ్రామికవేత్తల మీదికి నూకుతడు. విదేశీ బొగ్గు తేవాలి.. దాని ద్వారా వచ్చే లాభాలు అదానీకి రావాలి. అందులో నుంచి చందాలు మోదీకి పోవాలి. కష్టం, నష్టం మనం భరించాలి, దేశం భారం మోయాలి. ఇదీ వాళ్ల నీతి. ఇది అందరికీ చెప్పాలి’ అని పార్టీ శ్రేణులకు సూచించారు.
‘ఇది ఒక విద్యుత్ రంగానిదే కాదు.. ప్రతి రంగంలో ఇదే కథా. డబుల్ ఇంజిన్ అంటే మోదీ, అదానీ. డబుల్ ఇంజిన్ ఇవాళ ఇంకో వైపు దేశంలో రాజకీయ పార్టీలను దొంగ పైసలు చీల్చాలి. ఎమ్మెల్యేలను కొనాలి. పార్టీలను పడగొట్టాలి. ఏక్నాథ్ షిండేలను తయారు చేయాలి. దేశంలో ఒంకొకరు మిగలొద్దు. ఇంకో వైపు ఆ పైసలతో దేశాన్ని ఆగమాగం చేసి బ్రహ్మాండంగా వాళ్ల పార్టీ మాత్రమే బతికుండాలి. మిగతా పార్టీలన్నింటిని చంపేయాలి. ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకుడికి, ప్రతి ఇంటికి, ప్రతి గుండెకు చేరేలా చెప్పాలి. తెలంగాణ అస్థిత్వానికే, ప్రయోజనాలకే గండికొట్టేలా చేస్తున్న వ్యవహారాన్ని ప్రజలకు విడమరిచి చెప్పే బాధ్యత మనపై ఉన్నది. మనం చేశామో చెప్పాలి. ఏం చేయబోతున్నామో చెప్పాలి. దాంతో పాటు తప్పకుండా వారి దుర్నీతిని ఎండగట్టాలి’ అని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.