హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని చోటాభాయ్, కేంద్రంలోని బడాభాయ్ల వ్యవహారం అనుమానాస్పదంగా ఉన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఎద్దేవా చేశారు. బడాభాయ్కి దమ్ముంటే చోటాభాయ్ వసూలు చేస్తున్న ‘డబుల్-ఆర్ ట్యాక్స్’పై నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు.
ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో మంగళవారం ఆయన ఎక్స్ వేదికగా ప్రశ్నలు సంధించారు. ‘గౌరవనీయులైన మోదీ గారూ.. చోటాభాయ్ అక్రమంగా డబుల్ ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తుంటే, కేంద్రంలో అధికారంలో ఉన్న మీరేం చేస్తున్నారు? మీ రాజకీయ ప్రత్యర్థులపై కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తున్నారు.
మరి చోటాభాయ్ నిర్వాకాన్ని ఎందుకు క్షమిస్తున్నారు? చోటాభాయ్ అక్రమాలను, డబుల్ ఆర్ ట్యాక్స్ వసూళ్లను చూసీచూడనట్టు వదిలేస్తే, రేపు డబుల్ ఇంజిన్ సరారు ఏర్పాటుకు మీకు సహకరిస్తాడనా?’ అని కేటీఆర్ ప్రశ్నించారు. ‘తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టుపై కూడా బడేభాయ్, ఛోటాభాయ్ది ఒకే మాట-ఒకే బాట.
ఒకరు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును బలిచేయాలని చూస్తుంటే, మరొకరు తమిళనాడు కోసం తాకట్టుపెట్టాలని ప్రయత్నిస్తున్నారు. గోదావరి జలాలను తరలించుకుని పోవాలనేనా కాళేశ్వరంపై ఈ కక్ష? మీకు, మీ కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రైతులపై ఎందుకీ వివక్ష? పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణకు వచ్చారు.
అదే పార్లమెంట్లో ఇచ్చిన హామీలకు ఎందుకు పాతరేశారు? పదేండ్లు గడిచినా తెలంగాణ విభజన హకులను ఎందుకు కాలరాశారు? అత్యున్నత చట్టసభలో ఇచ్చిన హామీలకే దికులేకపోతే బహిరంగ సభల్లో బీజేపీ హామీలను ప్రజలెలా విశ్వసిస్తారు? కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను దెబ్బతీసే ఈ ఫెవికాల్ బంధంపై యుద్ధానికి తెలంగాణ సమాజం సిద్ధం’ అని పేర్కొన్నారు.
పదేండ్ల బీజేపీ పాలన తరువాత కూడా ఉచిత రేషన్ పథకం కింద దేశంలో 80 కోట్ల మంది పేదలు ఎందుకు ఉన్నారో వివరించండి? వికసిత్ భారత్ ఎలా సాధ్యమో సెలవివ్వండి?’ అని ప్రశ్నించారు. మండుతున్న ధరలు, తీవ్రమవుతున్న నిరుద్యోగం, దళితులపై జరుగుతున్న దాడులు, మైనార్టీల్లో పెరుగుతున్న అభద్రతపై.. ఒకమాట కూడా మాట్లాడకపోవడం అన్యాయం అని పేర్కొన్నారు.
అవినీతిపరులకు బీజేపీని కేరాఫ్గా మార్చి రాజకీయ ప్రత్యర్థులపై కక్షగట్టి పెడుతున్న కేసులను, ఎలాంటి ఆధారాలు లేకుండా చేస్తున్న అక్రమ అరెస్టులను, తెలంగాణ ప్రజలే కాదు.. యావత్ భారత సమాజం గమనిస్తున్నదని హెచ్చరించారు. దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేసిన కాంగ్రెస్కు ఏ దుస్థితి పట్టిందో త్వరలో బీజేపీకి కూడా దేశ ప్రజానీకం అదే గుణపాఠం చెప్పి తీరుతుందని హెచ్చరించారు.
రాజ్యాంగంపై ప్రమాణం చేసి, అదే రాజ్యాంగాన్ని కాలరాయడం భావ్యమా? రాజ్యాంగ సంస్థలను దెబ్బతీయడం ధర్మమా? అని ప్రశ్నించారు. నాడు కాంగ్రెస్ పాలనలో దేశం ఎమర్జెన్సీని చూసిందని, నేడు బీజేపీ హయాంలో అనధికార ఎమర్జెన్సీని చవిచూస్తున్నదని విమర్శించారు.