హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): ‘ప్రాంతేతరుడు మోసం చేస్తే తరిమి తరిమి కొడుతాం! ఈ ప్రాంతం వాడు మోసం చేస్తే ఇక్కడే పాతి పెడుతాం! తెలంగాణను పీక్కుతింటున్న రాబందుల పనిపడతాం’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. నిధులు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీకి, నీళ్లు ఏపీ సీఎం చంద్రబాబుకు పంపిస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్రెడ్డి ముసుగు వీడిందని, నిజం తేట తెల్లమైందని, సీఎం 48వ ఢిల్లీ పర్యటన గుట్టు రట్టయిందని పేర్కొన్నారు.
ఈ మేరకు బుధవారం కేటీఆర్ ఎక్స్లో పోస్టు చేశారు. బనకచర్ల గురించి చర్చే రాలేదని బుకాయించి, గురుదక్షిణగా గోదావరి జలాలను అప్పజెప్పడం కోసమా తమరు గద్దె నెక్కింది అని సీఎం రేవంత్రెడ్డిని సూటిగా ప్రశ్నించారు. ‘జై తెలంగాణ’ అనడానికి ఉన్న సిగ్గు, 4 కోట్ల తెలంగాణ ప్రజల హక్కులను చంద్రబాబుకి ధారపోయడానికి మాత్రం లేదా? అని ఎద్దేవా చేశారు.
రేవంత్ తన గురువుపై విశ్వాసం చూపించడానికి, తెలంగాణ విధ్వంసం కావాల్సిందేనా? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఇంకెందుకు ఈ రెండు రాష్ట్రాలు, ఇద్దరు సీఎంలు? అని ప్రశ్నించారు. సరిహద్దులు చెరిపేస్తే, తెలంగాణపై తమరి అక్కసు చల్లారుతుందేమో? ‘జై తెలంగాణ’ అనాల్సిన బాధ రేవంత్కు తప్పుతుందేమోనని అన్నారు. ‘కానీ ఒక్క మాట గుర్తు పెట్టుకో, ఒక్క బొట్టు నీరు అక్రమంగా అప్పజెప్పినా, మరో పోరాటం చూస్తావు’ అని కేటీఆర్ హెచ్చరించారు.