కట్టంగూర్, జూలై 14 : కట్టంగూర్ కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో సోమవారం ఎస్ఐ మునుగోటి రవీందర్, ఎస్ఐ నాయని శ్రీనివాస్ ఆధ్వర్యంలో బాల్య వివాహాలు, మహిళల అక్రమ రవాణాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రవీందర్ మాట్లాడుతూ.. బాల్య వివాహాలు చట్టవిరుద్ధమని, అలాంటి ఘటనలు కనిపిస్తే వెంటనే పోలీసులకు లేదా షీ టీంకు సమాచారం అందించాలని సూచించారు. బాలికలు తమ విద్యపై దృష్టి సారించి, అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. మహిళల భద్రత కోసం ప్రభుత్వం, పోలీసులు చేపడుతున్న చర్యలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం నల్లగొండ షీ టీం సభ్యులు, కళాబృందం సభ్యులు పాల్గొని నాటికలు, అవగాహన ప్రదర్శనల ద్వారా విద్యార్థినులకు చైతన్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.