హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఉద్యమాన్ని, ఆత్మగౌరవాన్ని అవమానిస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ సర్కార్ను హెచ్చరించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సిట్ నోటీసులు విచారణ కోసం కాదని, ప్రతీకారంలో భాగమని మండిపడ్డారు. గురువారం ‘ఎక్స్’ వేదికగా ఆయన స్పందించారు. చావు నోట్లో తలపెట్టి ‘కేసీఆర్ సచ్చుడో-తెలంగాణ వచ్చుడో’ అనే మొక్కవోని సంకల్పంతో సుదీర్ఘ ఉద్యమం చేసి తెలంగాణను సాధించిన మహానాయకుడు కేసీఆర్ అని స్పష్టంచేశారు. పదేండ్ల తన పాలనలో తెలంగాణ అస్తిత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. సబ్బండ వర్గాలను కడుపులో పెట్టుకుని, రాష్ర్టాన్ని చంటి బిడ్డలా చూసుకుంటూ సాగునీటి విప్లవం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు, రైతుబీమా, దళితబంధు వంటి పథకాలతో తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిన గొప్ప విజనరీ కేసీఆర్ అని వివరించారు.
అడ్డగోలు హామీలు ఇచ్చి, అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన అసమర్థత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ప్రజల నోట్లో మట్టి కొట్టి, ఇచ్చిన హామీల అమల్లో పూర్తిగా విఫలమైందని కేటీఆర్ దుయ్యబట్టారు. తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు, పాలనా లోపాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు, ఇప్పుడు విచారణల పేరిట కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం కక్ష సాధింపు రాజకీయానికి నిదర్శనం అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది న్యాయం కాదని.. ఇందులో రాజకీయ దురుద్దేశం ఉందని పేర్కొన్నారు. కేసీఆర్ తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిన నాయకుడు అని నోటీసులు, బెదిరింపులతో తెలంగాణ చరిత్రను చెరిపేయలేరని మండిపడ్డారు. ఈ కక్షసాధింపు రాజకీయాలను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తున్నదని పేర్కొన్నారు. ప్రజల పక్షాన నిలబడి, ప్రజల గొంతుకగా ఈ అన్యాయ పాలనపై పోరాటం కొనసాగిస్తామని తేల్చిచెప్పారు. ప్రజలు తమ తీర్పుతోనే తెలంగాణ చరిత్రను రాస్తారని, ప్రభుత్వ విచారణలతో కాదని స్పష్టంచేశారు.