హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): స్వతంత్ర భారతదేశ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెలంగాణ వేదికైంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ దిగ్గజం హోన్ హై ఫాక్స్కాన్ కంపెనీ రాష్ట్రంలో భారీ పెట్టుబడికి శ్రీకారం చుట్టింది. ఈ ఒక్క పెట్టుబడితో లక్ష ఉద్యోగాలు కల్పించనున్నారు. ఇది దేశ చరిత్రలోనే తొలిసారి. ఇది తెలంగాణ సాధించిన సరికొత్త రికార్డు. ఈ కంపెనీ అంత ఆషామాషీగా ఏమీ తెలంగాణకు రాలేదు. రాత్రికి రాత్రే జరిగిన అద్భుతం కాదు. దీని వెనుక పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ ఎనిమిదేండ్ల కృషి ఉన్నది.
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పారదర్శక విధానాలు, టీఎస్ ఐపాస్ వంటి విప్లవాత్మక మార్పులతోనే ఇది సాధ్యమైంది. కేటీఆర్ అకుంఠిత దీక్ష, పట్టుదలతోనే ఇది సాకారమైంది. తెలంగాణపై కక్షగట్టిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, చివరికి ఫాక్స్కాన్ కంపెనీని సైతం రాష్ర్టానికి రాకుండా అడ్డుకొనేందుకు విశ్వ ప్రయత్నం చేసింది. దీనిని మహారాష్ట్రకు తరలించేందుకు అన్నివిధాలా కుట్రలు పన్నింది. ఆ కుట్రలకు మంత్రి కేటీఆర్ ఎప్పటికప్పుడు చెక్ పెడుతూ వచ్చారు. 2015 నుంచి క్రమం తప్పకుండా ఫాక్స్కాన్ కంపెనీతో సంప్రదింపులు కొనసాగించారు. ఎనిమిదేండ్లలో పదుల సందర్భాల్లో ఫాక్స్ కాన్ కంపెనీతో చర్చలు జరిపారు. మూడు సార్లు తెలంగాణ ప్రతినిధి బృందం తైవాన్కు వెళ్లి ఫాక్స్కాన్ యాజమాన్యంతో చర్చలు జరిపింది. రెండుసార్లు తైవాన్ నుంచి కంపెనీ ప్రతినిధులు రాష్ర్టానికి వచ్చారు.
దేశ జీడీపీని ప్రభావితం చేసే శక్తి
ఫాక్స్కాన్ అషామాషీ కంపెనీ కాదు. ఇది ఎక్కడ స్థాపిస్తే ఆయా దేశాల జీడీపీని ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు వియత్నాంలో సామ్సంగ్ కంపెనీ ఏర్పడింది. సామ్సంగ్ విడిభాగాలను వస్తువులను ఫాక్స్కాన్ కంపెనీనే తయారు చేస్తుంది. ప్రస్తుతం వియత్నాం దేశ జీడీపీని ఆ కంపెనీ ప్రభావితం చేస్తున్నది. ఆ దేశంలోని కంపెనీలో 1.25 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కేవలం సామ్సంగ్ కంపెనీ వ్యవహారాలను పరిశీలించేందుకే ఆ దేశంలో ఒక మంత్రిని నియమించారంటే దీనికి ఎంతటి ప్రాధాన్యం ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. తాజాగా మనదేశంలో అతిపెద్ద ఎలక్ట్రానిక్ పెట్టుబడిని తెలంగాణలో పెట్టింది. ఇకపై దేశ జీడీపీని తెలంగాణ ప్రభావితం చేయనున్నది. ఈ కంపెనీ వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. కంపెనీలో లక్షమందికి ఉద్యోగాలు రానున్నాయి. దీని అనుబంధ కంపెనీల్లోనూ భారీగానే ఉద్యోగాలు వచ్చే అవకాశమున్నది. ఈ కంపెనీతో పల్లెల్లోని సెమీ స్కిల్డ్ లెవెల్ యు వతకు ఉద్యోగాలు దొరుకుతాయి. గ్రామీణ ప్రా ంతాల వారికి ఉపాధి లభిస్తుంది. అనుబంధ పరిశ్రమల్లో స్వయం ఉపాధి దొరుకుతుంది.
టీఎస్ ఐపాస్ దేశానికే ఆదర్శం
తెలంగాణ పరిశ్రమల స్థాపనకు అనుకూలమైనది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరం ఇంకా అనుకూలమైనది. తుఫాన్లు, భూకంపాల ప్రభావం లేని దకన్ పీఠభూమిలో హైదరాబాద్ ఉన్నది. సమశీతోష్ణ వాతావరణం హైదరాబాద్ ప్రత్యేకత. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారే కాకుండా, విదేశాల నుంచి వచ్చిన వారు కూడా ఇకడ ఎంతో సౌకర్యంగా, ప్రశాంతంగా జీవనం గడుపుతారు. సహజసిద్ధమైన అనుకూలతలతోపాటు ప్రభుత్వ పరంగా కూడా పెట్టుబడి దారులకు అనుకూలమైన సులభతర వాణిజ్య, పారిశ్రామిక విధానాన్ని సీఎం కేసీఆర్ తీసుకొచ్చారు. టీఎస్ ఐపాస్ చట్టం చేసి, సులభతర అనుమతుల విధానం ప్రవేశపెట్టారు.
కేసీఆర్తో భేటీ జీవితాంతం గుర్తుంటుంది…
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుతో భేటీ తనకు జీవితాంతం గుర్తుంటుందని ఫాక్స్కాన్ చైర్మన్ యంగ్ లియూ అన్నారు. పుట్టిన రోజున స్వదస్తూరీతో కూడిన బహుమతితో శుభాకాంక్షలు తెలపడం తైవాన్లో సంప్రదాయం. గురువారం యంగ్ లియూ పుట్టిన రోజు కావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా తన చేతి రాతతో పుట్టిన రోజు శుభాకాంక్షలు అని రాసిన గ్రీటింగ్ కార్డును యంగ్ లియూకు బహూకరించారు. దీనిపై యంగ్ లియూ సంతోషం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఇచ్చిన ఆతిథ్యం అద్భుతంగా ఉన్నదని తెలిపారు. సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. తైవాన్ నుంచి మొత్తం 17 మంది బృందం తెలంగాణకు వచ్చారు. వారికి సీఎం కేసీఆర్ అరగంట సేపు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన వీడియో ప్రజెంటేషన్ ఇచ్చారు. ఎనిమిదేండ్లలో తెలంగాణ ప్రగతిని వివరించారు. అనతికాలంలోనే తెలంగాణ సాధించిన అభివృద్ధిపై ఫాక్స్కాన్ బృందం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కాగా, ఇబ్రహీంపట్నంతోపాటు దుండిగల్లోనూ తమకు భూమి కావాలని ఫాక్స్కాన్ ప్రతినిధులు అడిగారు. తెలంగాణలో మరో నాలుగైదు అనుబంధ కంపెనీలు స్థాపిస్తామని యంగ్ లియూ తెలిపారు. తమ తదుపరి గమ్యస్థానం హైదరాబాదేనని చెప్పారు. కేటీఆర్ రెండుసార్లు వచ్చి ప్రత్యేకంగా కలిశారని గుర్తుచేశారు. దేశంలోని ఆరు రాష్ర్టాలకు చెందిన ప్రతినిధులు తమను సంప్రదించారని, కానీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం సంతోషంగా ఉన్నదని వివరించారు.
తెలంగాణకు భారీగా ఉపాధి: కేటీఆర్
ఫాక్స్కాన్ సంస్థ తెలంగాణలో భారీ పెట్టుబడి పెడుతున్నట్టు, తద్వారా రాష్ట్రంలో లక్షమంది యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఫాక్స్కాన్ చైర్మన్ యంగ్ లియూ గురువారం ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్తో సమావేశం అయిన అనంతరం కేటీఆర్ ట్వీట్ చేశారు. ఫాక్స్కాన్ ప్రతినిధిబృందం సీఎం కేసీఆర్తో సమావేశమైన ఫొటోలు, ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న ఫొటోలను కేటీఆర్ పోస్ట్ చేశారు.
ప్రపంచ దిగ్గజం
హోన్ హై టెక్నాలజీ గ్రూప్ (ఫాక్స్ కాన్) ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ. దీనిని 1974లో తైవాన్లో స్థాపించారు. చైనా, జపాన్, వియత్నాం, మలేషియా, చెక్ రిపబ్లిక్, అమెరికాతోపాటు అనేక దేశాల్లో విస్తరించి ఉన్నది. ఆర్ అండ్ డీ, తయారీ కేంద్రాలను స్థాపించింది. కంపెనీ 2019లో ఫోర్బ్స్ టాప్ 100 కంపెనీల్లో 25వ స్థానంలో, 2021లో ఫార్చ్యూన్ గ్లోబల్ 500 ర్యాంకింగ్స్లో 22వ స్థానంలో ఉన్నది. 2021లోనే ఫోర్బ్స్ వరల్డ్ బెస్ట్ ఎంప్లాయర్స్ అవార్డును సొంతం చేసుకొన్నది. క్లారివేట్ టాప్ 100 గ్లోబల్ ఇన్నోవేటర్స్గా గత ఐదేండ్లుగా మొదటి ర్యాంకులో నిలుస్తున్నది. ఈ కంపెనీలో మొత్తం 13 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఎలక్ట్రానిక్ వస్తువులు, కంప్యూటర్ విడిభాగాల ఉత్పత్తి, ఎలక్ట్రిక్ వాహనాలు, డిజిటల్ హెల్త్, రోబోటిక్స్, కమ్యూనికేషన్ టెక్నాలజీ, అభివృద్ధి తదితర అనేక రంగాల్లో కంపెనీ పెట్టుబడులు పెట్టింది.
అలుపెరగని కృషి
ఫాక్స్కాన్ కంపెనీ గురించి సాధారణ ప్రజలకు పెద్దగా తెలియదు. ఎందుకంటే వివిధ కంపెనీలకు చెందిన వస్తువులను ఇది తయారు చేస్తుంది. ఉదాహరణకు యాపిల్ ఫోన్లు, ఇతర విడి భాగాలను తయారు చేస్తుంది. కానీ, ఒక్కో కంపెనీలో 50 వేల నుంచి లక్ష మందికి అవకాశం కల్పిస్తుంది. 2015లోనే తెలంగాణ ప్రభుత్వం, మంత్రి కేటీఆర్ ఆ కంపెనీ గురించి తెలుసుకొన్నారు. కంపెనీని ఎలాగైనా తెలంగాణకు తీసుకురావాలని సంకల్పించారు. 2015 జనవరి 11న తొలిసారి ఫాక్స్కాన్ కంపెనీ ప్రతినిధులను మంత్రి కేటీఆర్ కలిశారు. కంపెనీ స్థాపనకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను, హైదరాబాద్కు ఉన్న ప్రత్యేకతలను వివరించారు. అదే సంవత్సరం తొలిసారి ఫాక్స్కాన్ ప్రతినిధులు తెలంగాణను సందర్శించారు. ఆ రోజు నుంచి నిత్యం కంపెనీ ప్రతినిధులతో కేటీఆర్ సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. రెండుసార్లు కేటీఆర్ స్వయంగా కంపెనీ ప్రతినిధులను కలిశారు. ఫాక్స్కాన్ కంపెనీ తెలంగాణకు రాకుండా కేంద్రం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, కేటీఆర్ మాత్రం వెనుకడుగు వేయలేదు. చివరికి ఆ కంపెనీ చైర్మన్ యంగ్ లియూ తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకునే వరకు పట్టు విడవలేదు.