KTR | ‘వీరప్పన్ అటవీ శాఖ మంత్రి అయితే ఎలా ఉంటుందో.. భూ దందాలు చేసే రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అయినందుకు అలాగే ఉంది’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు. రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు ఆర్టీఐని అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ చేసి బతికేవాడని ఆరోపించారు.
తెలంగాణ భవన్లో సెక్షన్ 22ఏ భూ బాధితులతో కేటీఆర్, హరీశ్రావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్రెడ్డి ప్రభుత్వ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. ‘బ్లాక్మెయిలర్ ఇప్పుడు ఏకంగా సీఎం అయ్యాడు’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. నేరపూరిత మనస్తత్వంతో ఒక ముఠాను ఏర్పాటు చేశారని, ఆ ముఠా కనుసన్నల్లోనే 22ఏ దందా నడుస్తోందని ఆరోపించారు. ప్రతి స్కీం వెనుక ఒక స్కాం ఉంటుందని కేటీఆర్ ఆరోపించారు. గుడి, బడి, ఆస్పత్రి, స్మశానం నిర్మించాలంటే ప్రభుత్వం దగ్గర గజం భూమి లేదని, కానీ హైదరాబాద్ చుట్టూ వేల ఎకరాల భూములపై రేవంత్రెడ్డి కన్ను పడిందని అన్నారు.
అస్మదీయుల కోసం హిల్ట్ పాలసీని తీసుకొచ్చారని, పది వేల ఎకరాల భూములను కాజేసే కుట్ర జరుగుతోందని కేటీఆర్ ఆరోపించారు. అడ్డికి పావుశేరు లెక్కన భూములను విక్రయిస్తున్నారని మండిపడ్డారు. మూసీ పేరుతో వేల ఎకరాలు మింగే కుట్ర జరుగుతోందని విమర్శించారు. ఫార్మాసిటీని రద్దు చేసి ఫ్యూచర్ సిటీ పేరుతో భూదందా చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. రూ.200 కోట్ల విలువైన భూమిని రూ.7 కోట్లకే కట్టబెట్టారని అన్నారు.
కేసీఆర్ పాలనలో కొంగరకలాన్కు ఫాక్స్కాన్ కంపెనీ వచ్చిందని, దీంతో అక్కడి భూములకు విపరీతమైన డిమాండ్ ఏర్పడిందని కేటీఆర్ తెలిపారు. ఆ భూములపై రేవంత్రెడ్డి కన్ను పడిందని, వంద ఎకరాల్లోనే రూ.వెయ్యి కోట్ల మాయాజాలానికి సిద్ధపడ్డారని ఆరోపించారు.
భూములు అమ్మబోమని చెప్పినందుకు నిషేధిత జాబితాలో పెట్టారని అన్నారు. ధరణిలో వేలిముద్ర లేకుండా ఇంచు భూమి కూడా అటూ ఇటూ కాదని.. కానీ భూభారతిలో భూముల గోల్మాల్ జరుగుతోందని కేటీఆర్ ఆరోపించారు.
భూములను కాపాడాల్సిన కాపలాదారులే కబ్జాదారులుగా మారారని విమర్శించారు. దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని భూదోపిడీ జరుగుతోందని ఆరోపించారు. ఈ వ్యవహారాలపై రేవంత్రెడ్డి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వస్తుందని కేటీఆర్ అన్నారు. మరో రెండేళ్లలో కేసీఆర్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.