KTR | హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా? లేనట్టా? విత్తనాల కోసం రైతులకు ఏమిటీ వెతలు? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. వ్యవసాయశాఖను పర్యవేక్షించాల్సిన ఆ శాఖ మంత్రి ఎకడ?, ముందుచూపు లేని ముఖ్యమంత్రి జాడేది? అని నిలదీశారు. ‘ఎన్నికల ప్రచారంలో తిరగటం తప్ప, ఎన్ని ఎకరాలకు విత్తనాలు అవసరమో లెకలేదా? నిన్న ధాన్యం అమ్ముకుందామంటే కొనేటోడు లేడు. నేడు విత్తనాలు కొందామంటే అమ్మేటోడు లేడు. పాలన పూర్తిగా పడకేసిందని చెప్పటానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి?’ అని బుధవారం ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై మండిపడ్డారు.
సాగునీళ్లు ఇవ్వటం చేతకాక పంటలు ఎండగొట్టారని, ఇప్పుడు విత్తనాలు అందించే విజన్ కూడా లేదా? తెల్లవారుజామున 4 గంటలకు లైన్లో నిలబడితే సాయంత్రం 4 గంటల వరకూ విత్తనాలు ఇవ్వలేరా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. పదేండ్లపాటు 10 నిమిషాల్లో అందిన విత్తనాలను.. 10 గంటలపాటు పడిగాపులు పడినా అందించలేరా? అని నిలదీశారు. రంగారెడ్డి నుంచి కామారెడ్డి దాకా రైతులకు ఏమిటీ కష్టాలు? ఇంకెన్ని రోజులు ఈ కన్నీళ్లు? దేశం కడుపునింపే స్థాయికి ఎదిగిన తెలంగాణ, అన్నదాతకే తిండితిప్పలు లేకుండా చేస్తారా? బీఆర్ఎస్ పాలనలో పండుగలా సాగిన వ్యవసాయాన్ని అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఆగం చేస్తారా? అని వరుస ప్రశ్నలతో కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఇప్పటికైనా సరిపడా విత్తనాల స్టాక్ తెప్పించాలని, బ్లాక్ మారెట్కు తరలించకుండా కళ్లెం వేయాలని డిమాండ్ చేశారు. అన్నదాతలను ఇంకా అరిగోస పెట్టవద్దని, రైతుల సంఘటిత శక్తిలో ఉన్న బలాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చవిచూడక తప్పదని హెచ్చరించారు.