KTR | హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): ఎన్నికల ముందు అదానీ దొంగ అని విమర్శించిన సీఎం రేవంత్రెడ్డి, దావోస్లో అదానీతో అలయ్ బలయ్ చేసుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కే తారకరామారావు విమర్శించారు. కాంగ్రెస్ అవకాశవాద, దిగజారుడు రాజకీయాలకు ఇదే నిదర్శమని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో అదానీతో కొట్లాడుతూ ఇకడ మాత్రం ఆయనతో కలిసి ఎందుకు పనిచేస్తున్నదో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అధికారంలో లేనప్పుడు అదానీ దేశానికి శత్రువు అని పేర్కొన్న కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు అదే అదానీతో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ ఆదేశాల మేరకే అదానీతో సీఎం రేవంత్ కలిసి పని చేస్తున్నారని ఆరోపించారు. అదానీపట్ల కాంగ్రెస్ పార్టీ వైఖరి మారటానికి కారణాలేంటో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. గురువారం తెలంగాణ భవన్లో మహబూబ్నగర్ బీఆర్ఎస్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో ఆయన పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్క గులాబీ సైనికుడిపై ఉన్నదని పేర్కొన్నారు. తెలంగాణ బలం, గళం బీఆర్ఎస్సేనని పునరుద్ఘాటించారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి బీఆర్ఎస్ను ఓడించాలని బీజేపీ నేత బండి సంజయ్ చేసిన ప్రకటన ఆ రెండు పార్టీల లోపాయికారి ఒప్పందానికి నిదర్శనమని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో భాగంగా మొత్తం 420 హామీలు ఇచ్చిందని, వాటిని ఆరు నెలల్లో అమలు చేయకపోతే ప్రభుత్వం ప్రజల నుంచి తిరుగుబాటును ఎదుర్కోవాల్సి వస్తుందని కేటీఆర్ హెచ్చరించారు. కాంగ్రెస్ 420 హామీలను ఎప్పటికప్పుడు ప్రజలకు గుర్తుచేయాలని బీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం కార్యకలాపాలపై ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలపై స్పందించకపోతే ప్రజలు అపోహపడే ప్రమాదం ఉన్నదని, అందుకే వాస్తవాలను ప్రజలకు వివరిస్తున్నామని తెలిపారు. ‘డిసెంబర్ 9వ తేదీలోపు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన హామీనే గుర్తుచేస్తున్నాం. రైతుబంధు రూ.15 వేలకు పెంచి ఇస్తానని చెప్పిన విషయాన్ని గుర్తుచేస్తున్నాం. రూ.2 వేల పింఛన్ను రూ.4 వేలు చేస్తామన్న రేవంత్ హామీని మాత్రమే గుర్తుచేస్తున్నాం’ అని పేర్కొన్నారు. నిరుద్యోగ భృతి నెలకు రూ.4 వేలు చెల్లిస్తామని ప్రియాంకగాంధీ స్పష్టంగా చెప్పినా, అసెంబ్లీ సాక్షిగా ఆ హామీని తాము ఇవ్వలేదని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అబద్ధం చెప్పారని మండిపడ్డారు. రుణమాఫీ ఒకేసారి సాధ్యం కాదని, దశల వారీగా అమలు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి చెప్పటంపై కేటీఆర్ తీవ్రంగా ఆక్షేపించారు. పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధిస్తామని చెప్పిన సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్కుమార్ కేంద్ర జలవనరుల మంత్రిని కలిసిన తర్వాత హోదా సాధ్యం కాదని చెప్పటంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా తేవటం తమ వల్ల కాదని కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందనే విషయాన్ని ఉమ్మడి పాలమూరు ప్రజలు గుర్తుంచుకోవాలని సూచించారు. మహబూబ్నగర్ను ఆనుకునే ఉన్న అప్పర్ భద్ర ప్రాజెక్టుకు కర్ణాటకలో జాతీయ హోదా ఇచ్చిన బీజేపీని నిలదీసే ప్రయత్నం సీఎం రేవంత్ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి గ్రామ పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా బలమైన సైన్యం ఉన్నదని కేటీఆర్ తెలిపారు. స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్కు ఉన్నంత ప్రాతినిధ్యం ఇతర ఏ పార్టీకి లేదని చెప్పారు. 60 లక్షల సభ్యత్యాలున్న పార్టీ కూడా మరొకటి లేదని పేర్కొన్నారు. చిన్నచిన్న లోపాలను సవరించుకొని తిరిగి పడిలేచిన కెరటమై గులాబీ సైన్యం ప్రజల ఆశీర్వాదాన్ని పొందేందుకు అహర్నిశలు కృషి చేస్తే పార్లమెంట్ ఎన్నికల్లో విజయతీరాలు చేరటం పెద్ద కష్టమేమీ కాదని అన్నారు. పార్టీపై గతంలో జరిగిన దుష్ప్రచారాన్ని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలపైనే ఉన్నదని పేర్కొన్నారు. సంక్షేమ కార్యక్రమాలు అన్నీ నేరుగా లబ్ధిదారుల ఖాతాలో వేసిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ అని తెలిపారు. ఇలా చేయటం వల్ల ప్రభుత్వం, పార్టీ అనే తేడాను ప్రజలు తెలుసుకోలేకపోయారని చెప్పారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో పింఛన్ల కోసం సంవత్సరానికి రూ.800 కోట్లు ఖర్చు చేస్తే, కేసీఆర్ సర్కార్ రూ.11,700 కోట్లు ఖర్చు పెట్టిందని కేటీఆర్ వివరించారు. ఈస్థాయిలో భారీగా పించన్లు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు అందించినా వాటి గురించి చెప్పుకోవడంలో విఫలమయ్యామని పేర్కొన్నారు. త్వరలో పార్టీ అన్ని స్థాయిల్లో కమిటీలు వేస్తామని, ఆ తరువాత క్యాడర్కు శిక్షణ తరగతులు నిర్వహిస్తామని చెప్పారు. కార్యకర్తల అభిప్రాయాల మేరకు కార్యక్రమాల రూపకల్పన ఉంటుందని వెల్లడించారు. కేసీఆర్ సర్కార్ తెలంగాణను బంగారు పళ్లెంలో పెట్టి కాంగ్రెస్కు అప్పగించిందని తెలిపారు. ఈ సమావేశంలో అసెంబ్లీ మాజీ స్పీకర్లు పోచారం శ్రీనివాస్రెడ్డి, సిరికొండ మధుసూదనాచారి, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీనేత కే కేవశరావు, మాజీ మంత్రులు కడియం శ్రీహరి, నిరంజన్రెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, వీ శ్రీనివాస్గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, లక్ష్మారెడ్డి, చంద్రశేఖర్, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అంజయ్య యాదవ్, పట్నం నరేందర్రెడ్డి, రామ్మోహన్రెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, పార్టీ నేతలు ఎర్ర శేఖర్, అల్లీపురం వెంకటేశ్వర్రెడ్డి, వాల్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ సర్కార్ హయాంలో పదేండ్లపాటు రైతులు సంతోషంగా వ్యవసాయంపై దృష్టిపెట్టి అద్భుతమైన పంటలు పండించారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు నెలలు కూడా కాకముందే రైతులు రోడ్డెక్కారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువుల కోసం లైన్లో నిలబడే పరిస్థితులు మళ్లీ వచ్చాయని అన్నారు. ఎరువులను పోలీస్స్టేషన్లో పెట్టి పంచే పరిస్థితి రావడం బాధాకరమని పేర్కొన్నారు. రైతుబంధు సొమ్ము ఎంతమందికి పడిందో తెలియని దారుణ పరిస్థితి నెలకొన్నదని తెలిపారు.