KTR | రేవంత్ మాట్లాడితే చాలు మేనేజ్మెంట్ కోటా అంటున్నడు. మరి రాహుల్, ప్రియాంక కూడా మేనేజ్మెంట్ కోటానా? రేవంత్రెడ్డిది పేమెంట్ కోటా. సీఎం పదవిని కొనుక్కున్న ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం విచిత్రంగా ఉన్నది. పేమెంట్ కోటా సీఎం కనుకే ఢిల్లీకి కప్పం కడుతున్నడు. దందాలు చేయడం, బ్యాగులు మోయడం కాంగ్రెస్ నేతలకు అలవాటే. అందుకే బిల్డర్లు, రియల్టర్ల మీద పడ్డడు. రెండున్నర నెలలుగా నగరంలో భవనాల అనుమతులను నిలిపివేసి, వసూళ్ల పేరుతో బిల్డర్లను వేధిస్తున్నడు. రేవంత్ ట్యాక్స్పై త్వరలోనే బిల్డర్లు, కాంట్రాక్టర్లు రోడ్లపైకి వస్తరు.
– కేటీఆర్
హైదరాబాద్, ఫిబ్రవరి 29 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు దీటుగా స్పందించారు. మగాడివైతే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటైనా గెలిచి చూపించాలన్న రేవంత్రెడ్డి సవాలుకు కేటీఆర్ ప్రతిసవాలు విసిరారు. ‘ఎవరో ఎందుకు.. మనమిద్దరమే ముఖాముఖి తలపడదాం.. మల్కాజిగిరి నుంచే పోటీచేద్దాం.. రా..’ అని సవాల్ చేశారు. ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడిపోతారో మల్కాజిగిరి ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు. గురువారం ఆయన తెలంగాణభవన్లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. మేడిగడ్డకు శుక్రవారం తలపెట్టిన పర్యటనతోపాటు రాష్ట్ర రాజకీయాలు, ఎన్డీఎస్ఏ నివేదిక, బీజేపీ, కాంగ్రెస్ అవకాశవాద పొత్తులు సహా పలు అంశాలపై కూలంకషంగా మాట్లాడారు. రేవంత్రెడ్డి కూడా ఎన్నికల్లో ఓడిపోయాడని, అప్పుడు ఆయన మగాడు కాదా? అని కేటీఆర్ ప్రశ్నించారు. కొడంగల్లో గత ఎన్నికల్లో బీఆర్ఎస్ చేతిలోనే ఓడిపోయారని, ఆయన ఎంపీగా ఉన్న మల్కాజిగిరి పరిధిలో ఒక్క అసెంబ్లీ సీటును కూడా కాంగ్రెస్ గెల్చుకోలేదని గుర్తుచేశారు. జీహెచ్ఎంసీలో ఆయన ఎంతమంది కార్పొరేటర్లను గెలిపించుకున్నాడో చెప్పాలని సవాల్ చేశారు. రేవంత్రెడ్డి ఏదో ఐడెంటిటీ క్రైసిస్లో ఉన్నట్టు కనిపిస్తున్నాడని ఎద్దేవా చేశారు. రేవంత్రెడ్డి గతంలో కూడా అనేక సవాళ్లు విసిరారని, 2015లో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సొంతంగా గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నారని, 2018లో కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించారని గుర్తుచేశారు. అప్పుడు రేవంత్రెడ్డి మాటపై నిలబడలేదని, ఆయన మాటలకు విలువలేదని పేర్కొన్నారు.
‘రేవంత్రెడ్డికి నిజంగా అంత ఉబలాటమే ఉంటే.. ఆయనకు నేను కూడా సవాలు చేస్తున్న. నువ్వు రా. సీఎం పదవికి, కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యి. నేను కూడా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. మల్కాజిగిరి లోక్సభకు ఇద్దరం పోటీచేద్దాం. మల్కాజిగిరి ఎంపీగా నీకు సిట్టింగ్ స్థానం కదా.. ఆ ఒక్క సీటు గెలువు. చూస్తా. రేవంత్రెడ్డి పోటీచేస్తే.. నేనే ఆయనపై పోటీచేస్తా. నా సవాలును ఆయన స్వీకరించాలి.’ అని కేటీఆర్ సవాలు విసిరారు. ఎవరికెన్ని సీట్లు అన్నది ప్రజలు తేలుస్తారని, మగాడైతే అంటూ రేవంత్ మాట్లాడిన తీరు సరికాదని హితవు చెప్పారు. మహిళలను కించపరిచేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని, మగాళ్లే గెలవాలి.. మహిళలు గెలవకూడదా? అని ప్రశ్నించారు. మహిళా సమాజం దీనిపై రేవంత్రెడ్డిని ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. గెలుపోటముల గురించి ముఖ్యంత్రి రేవంత్రెడ్డి మాటలు విచిత్రంగా ఉన్నాయని, గడిచిన రెండు ఎన్నికల్లో వాళ్ల పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ ఓటమిని చవిచూశారని, మరి వాళ్లను ఏమంటారో చెప్పాలని కేటీఆర్ చురకలేశారు.
ఎంపీగా నీ సిట్టింగ్ స్థానం మల్కాజిగిరిలోనే కొట్లాడుదాం రా. సిట్టింగ్ ఎంపీగా నీ పర్ఫార్మెన్స్, మొన్నటివరకు మున్సిపల్ శాఖ మంత్రిగా నా పర్ఫార్మెన్స్ తేల్చుకుందాం. సేఫ్గా ఆడొద్దు. రెండు పదవులకు రాజీనామా చేసి రా.. నువ్వు గెలుస్తావా.. నేను గెలుస్తానా చూద్దాం.
–కేటీఆర్
రాజకీయాల్లో పార్టీలు మారడం సహజమని, వారిని అవకాశవాదులని అనలేమని కేటీఆర్ స్పష్టంచేశారు. గెలుపు గుర్రాలకే పార్టీలు టికెట్ ఇస్తాయని, కాంగ్రెస్ కూడా రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి వెళ్లిన సునీతా మహేందర్రెడ్డికి చేవెళ్ల, సికింద్రాబాద్ నుంచి బొంతు రామ్మోహన్, మల్కాజిగిరి నుంచి కంచర్ల చంద్రశేఖర్రెడ్డి వంటివారికి టికెట్లు ఇస్తుందని, మల్కాజిగిరిలో అల్లు అర్జున్తో ప్రచారం చేయించినా ఆశ్చర్యంలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్లో పోటీచేసేవారు లేకపోవడంతో బీఆర్ఎస్ నుంచి తీసుకున్నారని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ ఎన్నికల హామీలు ఏమయ్యాయని కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్రెడ్డి మగాడైతే మార్చి 17లోపు రైతులకు రుణమాఫీ చేయాలని తాను కూడా అనగలనని పేర్కొన్నారు. మగాడివైతే ఎన్నికల కోడ్ వచ్చేలోగా కోటిమందికిపైగా ఆడబిడ్డల ఖాతాల్లో రూ.2,500 వేసి చూపించమని, 420 హామీలు అమలు చేసి చూపించమని తాను కూడా అంటానని చెప్పారు.
శనివారం నుంచి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పార్టీ లోక్సభ అభ్యర్థుల ఎంపికపై దృష్టిసారిస్తారు. సమావేశాలు పెడతారు. అభ్యర్థుల ఎంపికపై పూర్తిస్థాయిలో కసరత్తు జరుగుతున్నది. ఈసారి ఎన్నికల్లో మా పార్టీ మంచి స్థానాలే గెలుస్తుంది.
-కేటీఆర్
రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ రెండూ కలిసి పనిచేస్తున్నాయని కేటీఆర్ విశ్లేషించారు. భువనగిరి మున్సిపల్ చైర్మన్ పదవి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిని దించేసి బీజేపీ, కాంగ్రెస్ పదవులు పంచుకున్నాయని చెప్పారు. నల్లగొండ, మణికొండ, మక్తల్.. ఇలా అనేక ఉదాహరణలు ఉన్నాయని వివరించారు. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ఊహించుకోవాలని, కాంగ్రెస్ నుంచి ఇప్పుడు బీజేపీకి సహకరిస్తున్నదెవరో కనిపిస్తున్నదని పేర్కొన్నారు. హిమాచల్లో ఏం జరుగుతున్నదో చూస్తున్నారని, రేపు తెలంగాణలో ఏం జరుగుతుందో చూస్తారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీజేపీ సంసారం చేస్తున్నాయో, వ్యభిచారం చేస్తున్నాయో అర్థం కావడంలేదని ఎద్దేవా చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసిందన్న ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి వ్యాఖ్యలను పలువురు మీడియా ప్రతినిధులు కేటీఆర్ దృష్టికి తీసుకొనిరాగా.. దివాలా తీసింది వాళ్ల బుర్రలని, ఖజానా కాదని స్పష్టంచేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే లంకెబిందెలు లేవని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇప్పుడు తెలంగాణతల్లిపై ఉన్న నగలను మాయం చేశాడని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేత, మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్కు రాసిన లేఖపై కేటీఆర్ స్పందించారు. కల్వకుర్తి అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేయకుండా పారిపోయిన వ్యక్తి కూడా మాట్లాడటం శోచనీయమని పేర్కొన్నారు.
మహారాష్ట్రలో పార్టీ పోటీచేయడంపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ తెలంగాణపై మాత్రమే ఉన్నదని, తమ కార్యక్షేత్రం తెలంగాణనే అని కేటీఆర్ స్పష్టం చేశారు. 111 జీవో రద్దు కోసం అన్ని పార్టీలు డిమాండ్ హైదరాబాద్ చుట్టూ ఉన్న 84 గ్రామాల పరిధిలోని లక్షా 32 వేల ఎకరాలకు సంబంధించి జీవో 111ను రద్దు చేయడంపై కాంగ్రెస్ సర్కారు తనకు నచ్చింది చేసుకోవచ్చని కేటీఆర్ స్పష్టంచేశారు. వాస్తవానికి కాంగ్రెస్, బీజేపీ సహా అన్ని పార్టీలు జీవో రద్దు కోసం డిమాండ్ చేశాయని గుర్తు చేశారు.మేడిగడ్డ మొదటి కాదు.. చివరిది కూడా కాబోదు బరాజ్లు, ప్రాజెక్టులు వంటివాటికి లీకేజీలు ఏర్పడటం, కుంగడం, కూలిపోవడం అన్నది ప్రపంచవ్యాప్తంగా ఉన్నదేనని కేటీఆర్ చెప్పారు. మేడిగడ్డ బరాజ్లోని కొంత భాగం కుంగడం ప్రపంచంలో ఇదే మొదటిది కాదని, చివరిది కూడా కాబోదని పేర్కొన్నారు. ఏదైనా చిన్న సమస్య వచ్చినప్పుడు ప్రభుత్వాలు దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని, రాజకీయ ప్రయోజనాలు ఆశించవద్దని హితవు చెప్పారు. ప్రభుత్వం ఏర్పడి దాదాపు సుమారు 83 రోజులైనా, కేవలం ఆరోపణలు, శ్వేతపత్రాల పేరుతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. మేడిగడ్డ అంశంలో ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకోవాలన్నదానిపై ప్రభుత్వం ఇప్పటివరకు దృష్టి పెట్టకపోవడం, నిపుణులతో ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం విడ్డూరమని పేర్కొన్నారు.
ఢిల్లీకి కప్పం కట్టే బాధ్యతను కర్ణాటక నుంచి శివకుమార్, తెలంగాణ నుంచి రేవంత్రెడ్డి తీసుకున్నారు. దందాలు చేయడం, బ్యాగులు మోయడం కాంగ్రెస్ నేతలకు అలవాటే.
-కేటీఆర్
ఔటర్ రింగ్రోడ్డు టోల్, మేడిగడ్డతోపాటు ఏ ప్రాజెక్టులో, ఏ పథకంలో అవినీతి, అక్రమాలు జరిగినా ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చని, తామేమీ వ్యతిరేకించడంలేదని కేటీఆర్ స్పష్టంచేశారు. అన్ని రకాల విచారణలను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. కక్షపూరితంగా వ్యవహరిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. బీఆర్ఎస్ను లక్ష్యంగా చేసుకొని, లేనివి ఉన్నట్టు చేసి చూపించే ప్రయత్నం చేస్తే తగిన సమాధానం చెప్తామని, న్యాయస్థానాలను సైతం ఆశ్రయిస్తామని స్పష్టంచేశారు. మేడిగడ్డపై నిపుణుల కమిటీని వేసి వానకాలంలోపు మరమ్మతుల ప్రక్రియను పూర్తిచేయాలని సూచించారు. కాఫర్ డ్యాంను కట్టి మరమ్మతుల ప్రక్రియను పూర్తిచేయొచ్చని పేర్కొన్నారు. బీఆర్ఎస్ను రాజకీయంగా వేధిస్తామంటే, కేసీఆర్పై నిందలు వేస్తామంటే తాము రాజకీయంగా, న్యాయపరంగా ఎదుర్కొంటామని స్పష్టంచేశారు. రైతులకు నీళ్లు ఇవ్వాలని, మేడిగడ్డ మరమ్మతులు చేయాలన్నది తమ డిమాండ్ అని చెప్పారు.
బీఆర్ఎస్ పార్టీ మేడిగడ్డకు వెళ్తుంటే కాంగ్రెస్ నేతలు పోటీగా పాలమూరు యాత్రకు వెళ్తున్నారని, తాము కాంగ్రెస్ యాత్రను స్వాగతిస్తున్నామని కేటీఆర్ చెప్పారు. ఏనుగు వెళ్లింది.. తోక చిక్కింది అన్నట్టుగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తీరు ఉన్నదని, ప్రాజెక్టు పనులు 80% పూర్తయ్యాయని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు తవ్వించాల్సింది కాలువలేనని వివరించారు. ఉద్దాండాపూర్, నార్లాపూర్, వట్టెం, కరివెన, ఏదులను కట్టించింది కేసీఆరే అని చెప్పారు. ఇప్పటికే ఒక పంప్ను మొదలు పెట్టామని, మిగిలిన వాటిని స్విచ్ ఆన్ చేయడమే మిగిలి ఉన్నదని గుర్తుచేశారు. కాలువలు తవ్వి పాలమూరు ప్రజలకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ నేతలు ఇచ్చే సలహాలు తమకు అవసరంలేదని పలువురు మంత్రులు చెప్తున్నారని విలేకరులు కేటీఆర్ దృష్టికి తీసుకురాగా.. రాష్ట్ర బాగు కోసం బీఆర్ఎస్ ఇచ్చే సలహాలు కాంగ్రెస్ వాళ్లకు పట్టవని, కానీ, సునీల్ కనుగోలు సలహాలు మాత్రమే కావాలని ఎద్దేవా చేశారు. ఒకవైపు కాళేశ్వరం వృథా అని ప్రచారం చేస్తున్నారని, మరోవైపు కాళేశ్వరం నుంచి మూసీకి నీళ్లు తీసుకెళ్లి హైదరాబాద్కు తాగునీళ్లు ఇస్తామని ప్రభుత్వం చెప్తున్నదని పేర్కొన్నారు. ఈ రోజుకు కూడా మేడిగడ్డ నుంచి అయిదు వేల క్యూసెక్కుల నీళ్లు కిందకు వెళ్తున్నాయని, కరవు కాలంలో కూడా అక్కడ నీటిలభ్యత ఉంటుందని చెప్పారు.
భువనగిరి నుంచి బీజేపీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్న వెదిరె శ్రీరాం కూడా ఏదో నిపుణుడిలా మాట్లాడుతున్నాడని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాళేశ్వరానికి 400 అనుమతులు ఇచ్చినవాళ్లు వెధవలా..? అని ప్రశ్నించారు. సీడబ్ల్యూసీలో ఉన్న వాళ్లందరూ శుంఠలు.. ఈయన ఒక్కరికే తెలివి ఉన్నదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో సలహాదారుగా ఉన్న ఆయన కూడా బాధ్యత తీసుకోవాలని పేర్కొన్నారు. తాను ఇటీవల పార్టీ కార్యక్రమానికి వెళ్తుంటే కాంగ్రెస్ కార్యకర్తలు తన కారుకు అడ్డంపడ్డారని, రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నారో తనకు అర్థం కావడంలేదని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ఇంకా తాను ప్రతిపక్షంలోనే ఉన్నట్టు ప్రవర్తిస్తున్నదని ఎద్దేవాచేశారు.
ప్రాజెక్టులో ఏమైనా సమస్యలు ఉత్పన్నమయితే వాటిని పరిష్కరించి ప్రజలకు నీళ్లను ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని కేటీఆర్ స్పష్టంచేశారు. మార్చి 31 తర్వాత పంటలకు నీళ్లు ఇచ్చే పరిస్థితిలేదని ఇంజినీరింగ్ అధికారులే చెప్తున్నారని, ఇంకో 2-3 తడులకు నీళ్లు ఇవ్వకపోతే పంటలు ఎండిపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. నీళ్లు ఇచ్చే అవకాశం ఉండీ నీళ్లు ఇవ్వకపోవడం కిరాతకమని, క్రూయల్ పాలిటిక్స్ అని అభివర్ణించారు. మీకు చేతకాకపోతే చెప్పండి మేం బాగు చేయించి చూపిస్తామని హరీశ్రావు కూడా చెప్పారని గుర్తుచేశారు. అందుకు సిద్ధంగా ఉన్నారా? చేతకాదని ఒప్పుకోండి.. అధికారం నుంచి తప్పుకోండని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి సూచించారు. అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డతో సహా కాళేశ్వరం స్కీం ప్రజల కోసం రూపొందించిందని, ప్రజల అవసరాలను తీర్చేందుకు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మేడిగడ్డ అన్నది కాళేశ్వరంలో చాలా చిన్నదని స్పష్టంచేశారు.
మేడిగడ్డతోపాటు కాళేశ్వరంలోని మిగిలిన బరాజ్లు కొట్టుకుపోతే బాగుండన్న ఆశ కాంగ్రెస్లో ఉన్నట్టు కనిపిస్తున్నది. అందుకే వాళ్లు మరమ్మతుల విషయంలో జాప్యం చేస్తున్నారు.
–కేటీఆర్
‘రేవంత్రెడ్డి మాట్లాడితే మేనేజ్మెంట్ కోటా అని నన్ను అంటుంటాడు. మరి రాహుల్గాంధీ, ప్రియాంకగాంధీ ఎవరో చెప్పాలి. వాళ్లు కూడా మేనేజ్మెంట్ కోటానా?’ అని కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్రెడ్డిది పేమెంట్ కోటా అని, ఆయన కూడా ప్రజలు ఎన్నుకున్న అభ్యర్థిలా మాట్లాడితే ఎట్లా? అని నిలదీశారు. పేమెంట్ కోటాలో వచ్చిన సీఎం ఇప్పుడు ఢిల్లీకి కప్పం కట్టేందుకు హైదరాబాద్లో బిల్డర్లపై పడ్డారని విమర్శించారు. రెండున్నర నెలలుగా భవనాల అనుమతులను నిలిపివేశారని, బిల్డర్లను వేధిస్తున్నారని ఆరోపించారు. త్వరలోనే బిల్డర్లు, కాంట్రాక్టర్లు రోడ్లపైకి వస్తారని పేర్కొన్నారు.
మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి నీటిపారుదల రంగంపై సరైన అవగాహన లేదని కేటీఆర్ విమర్శించారు. మేడిగడ్డపై నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నిపుణుల కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారని, అసలు ఎన్డీఎస్ఏ అన్నదే కేంద్రంలోని బీజేపీ సర్కారు సంస్థ అని, రాజకీయ కోణంలోనే నివేదికలు ఇస్తున్నదని చెప్పారు. ఎన్డీఎస్ఏ వారు కనీసం మేడిగడ్డ బరాజ్ కిందకు దిగి మట్టి నమూనాలు స్వీకరించారా? హైడ్రోలాజికల్ స్టడీ చేశారా? అని ప్రశ్నించారు. ఏదిపడితే అది రిపోర్టులో రాశారని, రాజకీయాల కోసం, ఎన్నికల కోసం ఎన్డీఎస్ఏ రిపోర్టును ప్రామాణికంగా తీసుకోవడం దారుణమని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి కామన్ సెన్స్లేదని, రైతాంగాన్ని ఆదుకోవాలన్న ఆలోచన, సమస్యకు పరిష్కారం కనుక్కోవాలన్న ఆలోచన లేదని విమర్శించారు. ఎవరు నాన్సెన్స్ మాట్లాడుతున్నారో, న్యూసెన్స్ మాట్లాడుతున్నారో ప్రజలకు తెలుసునని పేర్కొన్నారు. ఉత్తమ్కుమార్ సమీక్ష చేసుకొని, సమస్యకు పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేయాలని సూచించారు. బీఆర్ఎస్ మేడిగడ్డకు వెళ్తామంటే, కాంగ్రెస్ పార్టీ పాలమూరు-రంగారెడ్డికి వెళ్తామని చెప్తున్నదని, ఎన్నాళ్లు ఈ తరహా రాజకీయాలు చేస్తారని ప్రశ్నించారు. ఎన్డీఎస్ఏ నివేదిక కేవలం రాజకీయ ప్రేరేపిత రిపోర్టు అని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో మీడియాకు తొలుత రిపోర్టు ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటో తెలియడంలేదా? అని ప్రశ్నించారు. ఎన్డీఎస్ఏకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదన్న వాదనను కేటీఆర్ తోసిపుచ్చారు. ఎన్డీఎస్ఏ కోరుకుంటే అప్పుడు రాష్ట్రంలో ఉన్న ఎన్నికల సంఘం అన్నిరకాల సమాచారం ఇచ్చేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు సహకరించలేదన్నవారు డిటైల్డ్ రిపోర్టు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. గుజరాత్లోని మోర్బీడ్యాం కూలిపోతే 130 మంది మరణించారని, అక్కడ ఎన్డీఎస్ఏ ఎందుకు నివేదికను ఆలస్యంగా ఇచ్చిందని ప్రశ్నించారు. దేశంలో ఎన్డీఎస్ఏ ఇప్పటివరకు ఇలా ఎక్కడైనా స్పందించిందా? మోదీ ఆస్థాన సంస్థ ఎన్డీఎస్ఏ అని, ఆ సంస్థకు విశ్వసనీయతలేదని స్పష్టంచేశారు.