మల్కాజిగిరిలో పోటీ చేయాలని నేను విసిరిన సవాలుకు రేవంత్రెడ్డి పారిపోయాడు. దమ్ముంటే ఇప్పటికైనా మల్కాజిగిరిలో పోటీకి రావాలి. కొడంగల్లో రేవంత్రెడ్డి రాజీనామా చేసి వస్తే, నేను కూడా సిరిసిల్లలో రాజీనామా చేసి పోటీలో నిలబడతా. -కేటీఆర్
హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పిరికోడు అని, ఎంపీగా తన సిట్టింగ్ స్థానమైన మల్కాజిగిరిలో పోటీ చేద్దామంటే పారిపోయాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఎద్దేవా చేశారు. ఎంపీగా ఐదేండ్లలో రేవంత్రెడ్డి మల్కాజిగిరికి ఒక్క పనీ చేయలేదని, ఒక్క కాలనీ కూడా తిరగలేదని దుయ్యబట్టారు. ఈ ఎన్నికల్లో పోటీ పదేండ్ల (బీఆర్ఎస్) నిజానికి, వంద రోజుల అబద్ధానికి (కాంగ్రెస్), పదేండ్లు విషం చిమ్మిన బీజేపీకి మధ్య జరుగుతున్నదని పేర్కొన్నారు. బుధవారం తెలంగాణభవన్లో మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. నిన్న ఒక యూట్యూబ్ చానల్ చూశానని, 10 లక్షల ఫో న్లను కేసీఆర్ ట్యాప్ చేశాడంటూ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో నాగార్జున సినిమాలో గ్రీకువీరుడు అనే పాట ఉండేదని, ఇప్పుడు రేవంత్రెడ్డి లీకువీరుడుగా మారారని ఎద్దేవా చేశారు. ఆయనకు సీఎం పదవిని నడపొస్తలేదని విమర్శించారు. ‘ధైర్యం ఉంటే నీవు ముఖ్యమంత్రివి. తప్పులు ఏం జరిగినయో, ఎవరెవరు బాధ్యులో వారిని లోపల వెయ్, మేమేమీ వద్దనడం లేదు. కానీ లీక్లు మాత్రం బంద్ చేయ్’ అని పేర్కొన్నారు. దొంగల ఫోన్లు ట్యాప్ చేయడం పోలీసుల పని అని, చేస్తే గిస్తే ఒకరిద్దరి లుచ్చాగాళ్ల ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చని, ఆ విషయం తనకేమీ తెలియదని పేర్కొన్నారు. అంతర్జాతీయ కుంభకోణం ఏదో జరిగినట్టు, ఏమో అయిపోయినట్టు కాంగ్రెస్ హామీలపై ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
రేవంత్ పారిపోయిండు
తన సిట్టింగ్ ఎంపీ స్థానం మల్కాజిగిరిలో పోటీ చేయడానికి రేవంత్ జంకుతున్నారని కేటీఆర్ విమర్శించారు. ఇద్దరం ఎమ్మెల్యే స్థానాలకు రాజీనామా చేసి, మల్కాజిగిరిలో పోటీ చేద్దామన్న తన సవాల్ను స్వీకరించడం లేదని ఎద్దేవా చేశారు. సీఎం పదవిలో ఉండి కూడా మల్కాజిగిరిలో పోటీకి రేవంత్రెడ్డి భయపడుతున్నారని, ఆయన పిరికోడని విమర్శించారు. దమ్ముంటే ఇప్పటికైనా పోటీకి రావాలని సవాల్ చేశారు. బిల్డప్లు, మాటలు ఎక్కువ.. అసలు కాడికి వచ్చేసరికి పారిపోతడని ఎద్దేవా చేశారు. ఎంపీగా ఐదేండ్లలో రేవంత్రెడ్డి ఒక్క పనీ చేయలేదని, ఒక్క కాలనీ తిరగలేదని దుయ్యబట్టారు. మెడలో పేగులు వేసుకుంటానంటడు, ఆయన ఏమైనా బోటి కొడతడా? అని మండిపడ్డారు. సచివాలయంలో లంకబిందెల సంగతేమో కానీ, హైదరాబాద్లో ఖాళీ బిందెలు కనిపిస్తున్నాయని విమర్శించారు. లంకెబిందెల కోసం తట్ట, పారలు పట్టుకొని, అర్ధరాత్రి చీకట్లో కరుడుగట్టిన దొంగలు తిరుగుతారని చెప్పారు. అడ్డగోలుగా మాట్లాడుతున్న రేవంత్రెడ్డి సీఎంగా ఉండటంతో ప్రజలు సిగ్గుపడుతున్నారని దుయ్యబట్టారు. సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల తీర్పుతో ఆ నోరు మూతపడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అయితే నా జేబులో ఉండాలి లేదంటే జైల్లో ఉండాలనే విధంగా మోదీ ప్రవర్తన ఉన్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
కాంగ్రెస్ మనిషివా? బీజేపీ మనిషివా?
రేవంత్రెడ్డి కాంగ్రెస్ మనిషో, బీజేపీ మనిషో తనకు అర్థం కావడంలేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రాహుల్గాంధీ దేశమంతా తిరిగి మోదీని ‘చౌకీదార్ చోర్ హై’ అంటే, రేవంత్రెడ్డి మాత్రం ‘మా బడే భాయ్’ అంటున్నాడని గుర్తుచేశారు. అదానీ ఫ్రాడ్ అని రాహుల్ అంటే, రేవంత్రెడ్డి మాత్రం ‘హమారా ఫ్రెండ్ హై’ అంటున్నాడని దుయ్యబట్టారు. గుజరాత్ మాడల్ చేస్తానంటున్న రేవంత్రెడ్డి.. గోద్రా హింస చేస్తారా? బుల్డోజర్లు తీసుకొచ్చి పేద ప్రజలపైకి నడిపిస్తాడా? అని ప్రశ్నించారు. కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తే రాహుల్గాంధీ అన్యాయం అంటాడని, అదే కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేస్తే రేవంత్రెడ్డి మాత్రం కరెక్టే అంటాడని దుయ్యబట్టారు. రాహుల్గాంధీ కరెక్టా? రేవంత్రెడ్డి కరెక్టా? అనేది కాంగ్రెస్ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్కు ఒకఓటు వేసినా, అది నేరుగా బీజేపీకి లాభం జరుగుతుందని చెప్పారు. 30-40 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలోకి పోయేందుకు రేవంత్రెడ్డి సిద్ధంగా ఉన్నారని, మోదీ కాళ్ల దగ్గర ఉండాలనేది ఆయన ఎత్తుగడ అని ఎద్దేవా చేశారు. ఇది జరగబోయే వాస్తవమని, పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ బీజేపీలోకి వెళ్తాడని పేర్కొన్నారు. రేవంత్రెడ్డి తిరగని పార్టీ దేశంలో లేదని విమర్శించారు. ఏబీవీపీ నుంచి టీఆర్ఎస్కి, టీఆర్ఎస్ నుంచి టీడీపీకి, టీడీపీ నుంచి కాంగ్రెస్కి వెళ్లాడని గుర్తుచేశారు. కాంగ్రెస్ నుంచి మళ్లీ మాతృసంస్థ బీజేపీకి వెళ్తాడని చెప్పారు. రేవంత్కు అవకాశవాదమే తప్ప మరే ఎజెండా లేదని దుయ్యబట్టారు.
కాంగ్రెస్పై అన్ని వర్గాల్లో ఆగ్రహం
రాష్ట్రవ్యాప్తంగా రైతాంగం సంక్షోభంలో చికుకున్నా, కరువుతో సతమతమవుతున్నా, అకాల వర్షాలతో ఇబ్బందులు పడుతున్నా, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేటీఆర్ మండిపడ్డారు. కల్యాణిలక్ష్మి పథకం కింద తులం బంగారం ఇవ్వడంలేదని, రైతులకు రుణమాఫీ చేయలేదని, వడగండ్ల వర్షం వచ్చినా రైతులను పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్ ఇచ్చిన 30 వేల ఉద్యోగాలను తన ఖాతాలో వేసుకున్న రేవంత్పై యువత కోపంగా ఉన్నారని చెప్పారు. రైతులు, ఆటో డ్రైవర్లు, వృద్ధులు, మహిళలు ఇలా అన్ని వర్గాలు కాంగ్రెస్ పాలనపై ఆగ్రహంగా ఉన్నాయని, ఏ ఒక్కవర్గం కూడా సంతోషంగా లేదని వివరించారు. రేవంత్రెడ్డి నుంచి మొదలుకొని యూట్యూబ్లో అడ్డగోలుగా పార్టీపై, పార్టీ నాయకత్వంపై మొరిగే కుకలపై తాము దాడులు చేయాల్సిన అవసరం లేదని, ఓటు ద్వారానే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఓటుతో ఇలాంటి సన్నాసులపై వేసే వేటే సరియైన సమాధానమని పేర్కొన్నారు. రూ.రెండు లక్షల రుణమాఫీ జరిగిన వాళ్లందరూ కాంగ్రెస్కు ఓటు వేయాలని, రుణమాఫీ జరగని వాళ్లు బీఆర్ఎస్ ఓటువేయాలని కోరారు. కంటోన్మెంట్లో ఎమ్మెల్యే చనిపోయారని, అక్కడ నందిత కుటుంబం, క్రిశాంక్, నగేశ్, మహేశ్, పాండు, లోకనాథం తదితర చురుకైన నాయకులు ఉన్నారని పేర్కొన్నారు.
మల్కాజిగిరికి బీజేపీ చేసిందేమిటి?
హుజూరాబాద్, గజ్వేల్లో ఓడిపోయిన ఈటల రాజేందర్ మలాజిగిరికి వచ్చాడని కేటీఆర్ ఎద్దేవా చేశారు. బీజేపీ నేతలు రైతు రుణమాఫీ గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటుందని చెప్పారు. కార్పొరేట్లకు రూ.14.50 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిన మోదీ ప్రభుత్వం.. రైతన్నలకు ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదని దుయ్యబట్టారు. దమ్ము, ధైర్యం ఉంటే బీజేపీ ప్రభుత్వం మలాజిగిరికి, కంటోన్మెంట్కి ఏం చేసిందో చెప్పి ఈటెల ఓటు అడగాలని సవాల్ చేశారు. బీజేపీకి ఎలక్ట్రోబాండ్ల రూపంలో రూ.11 వేల కోట్లపైన ఉన్నమాట వాస్తవం కాదా? కుబేరుల జాబితాలో 609వ స్థానంలో ఉన్న అదానీని తీసుకొచ్చి రెండో స్థానంలో కుర్చోబెట్టిన మోదీ నీతిమంతుడా? అని ప్రశ్నించారు.
వాళ్లకు ఓటు అడిగే హకు లేదు: మల్లారెడ్డి
కాంగ్రెస్, బీజేపీ ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతాయని, మోసం చేసినందుకు ఓట్లు వేయాల్నా? అని మాజీ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. రెండు పార్టీలు చేసిందేమీ లేదని, వాళ్లకు ఓటడిగే హకులేదని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఎందుకు ఓటేశామా? అని ఇప్పుడు బాధపడుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభు త్వం అన్నీ బంద్ చేస్తున్నదని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో రోజూ వర్షం పడేదని, పిలిస్తే వానొచ్చేదని, ఇప్పుడు చెరువులన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయని చెప్పారు. కేటీఆర్ చేసిన అభివృద్ధి కారణంగానే హైదరాబాద్, రంగారెడ్డిలో ఎమ్మెల్యేలు గెలిచారని, హైదరాబాద్లో ఏ ఫ్లైఓవర్ చూసినా కేటీఆర్ కనిపిస్తారని పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్ బోసిపోయిందని, కళ తప్పిందని చెప్పారు.
‘వాళ్లు వెన్నుపోటు పొడిచిపోయారు’
మలాజిగిరిలో నిలబడింది రాగిడి లక్ష్మారెడ్డి కాదు- మన గులాబీ సైనికులంతా నిలబడ్డారు అన్న రీతిలో పనిచేద్దామని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. సీనియారిటీ కంటే సిన్సియారిటీ ముఖ్యమని, అది రాగిడిలో ఉన్నదని చెప్పారు. మల్కాజిగిరి ఎంపీ నియోజకవర్గ పరిధిలో మూడున్నర లక్షల మెజార్టీ బీఆర్ఎస్కు ఉన్నదని, అయినా మనం మన కార్పొరేటర్, సర్పంచ్ ఎన్నికల స్థాయిలో పనిచేద్దామని కోరారు. మలాజిగిరిలో పోటీచేస్తున్న కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు కేసీఆర్ ద్వారా పదవులు పొంది వెన్నుపోటు పొడిచి వెళ్లినవారేనని, వారికి ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్తోనే హైదరాబాద్ అభివృద్ధి
హైదరాబాద్ను అన్ని రకాలుగా అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఐటీలో హైదరాబాద్ను దేశంలోనే టాప్గా నిలిపిన ఘనత కేటీఆర్కే దక్కుతుందని చెప్పారు. ఓడిపోయిన వారికి మల్కాజిగిరి పునరావాస కేంద్రంగా మారిందా? అని ప్రశ్నించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్యాదవ్, సుధీర్రెడ్డి, కేపీ వివేకానంద, మాధవరం కృష్ణారావు, బండారు లక్ష్మారెడ్డి, మర్రి రాజశేఖర్రెడ్డి, ఎమ్మెల్సీలు వాణీదేవి, యెగ్గె మల్లేశం, కార్పొరేటర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
‘నువ్వు రాహుల్గాంధీ మనిషివా? నరేంద్రమోదీ మనిషివా? బీజేపీ మనిషివా? కాంగ్రెస్ మనిషివా? రేవంత్రెడ్డి చెప్పాలె. పార్లమెంట్ ఎన్నికల తరువాత 30-40 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలోకి వెళ్లేందుకురేవంత్రెడ్డి సిద్ధంగా ఉన్నాడు.’ -కేటీఆర్