KTR | సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కాదు.. ఎగవేతల రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. వరంగల్ వచ్చి భద్రకాళి అమ్మవారి మీద ఒట్టుపెట్టి రుణమాఫీ చేస్తానని అన్నాడని గుర్తుచేశారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఏ ఊరికైనా వెళ్లి అడుగుదాం.. ఒక్క ఊరిలోనైనా రైతులందరికీ రుణమాఫీ జరిగిందంటే రాజీనామా చేస్తానని సవాలు విసిరారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో రుణమాఫీ చారానా.. టోపీ బారానా అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రుణమాఫీ పూర్తికాక రైతులు పురుగుల మందు తాగారని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో అన్నీ దందాలు, కమీషన్లు, కొట్లాటలే అని విమర్శించారు. రేవంత్ రెడ్డి 69సార్లు ఢిల్లీకి వెళ్లాడని.. కానీ 69 పైసలు కూడా తేలేదని కేటీఆర్ విమర్శించారు. రేవంత్ రెడ్డి రెగ్యులర్ సీఎం కాదని.. రెన్యువల్ సీఎం అని ఎద్దేవా చేశారు. ఢిల్లీకి వెళ్లి రేవంత్ రెడ్డి కప్పం కడుతున్నాడని తెలిపారు. రాష్ట్రంలో రాహుల్ బంధు నడుస్తుందని అన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు, ప్రజల గురించి పట్టించుకునే వాళ్లే లేరని అన్నారు. రైతులకు ఇవ్వడానికి పైసలు లేవు.. కానీ రాహుల్ గాంధీకి మాత్రం మూటలు పంపిస్తున్నాడని అన్నారు.
కేసీఆర్ పదేళ్ల పాలనలో రైతులను నంబర్వన్ స్థానంలో నిలిపారని కేటీఆర్ గుర్తుచేశారు. ఆగమైన తెలంగాణను బాగుచేసింది బీఆర్ఎస్ అని తెలిపారు. రైతు ప్రగతికి కేసీఆర్ అద్భుతమైన పథకాలు తీసుకొచ్చారని పేర్కొన్నారు. కేసీఆర్ కంటే రైతును బాగా చూసుకున్న నాయకుడు దేశంలోనే లేడని స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో రైతు ప్రగతికి విప్లవం సృష్టించామని అన్నారు. పదేళ్లలో రైతులకు రూ.5లక్షల కోట్లు ఖర్చుపెట్టిన నాయకుడు కేసీఆర్ అని తెలిపారు. కేసీఆర్ హయాంలో సాగు పెరిగి వరంగల్లో భూముల రేట్లు పెరిగాయని అన్నారు. కానీ కాంగ్రెస్ వచ్చాక భూముల ధరలు పడిపోయాయని అన్నారు. ధాన్యం కొనుగోలు కోసం వానల్లో, ఎండల్లో రైతులు పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లక్సెట్టిపేట కొనుగోలు కేంద్రంలో గోడ కూలి నలుగురు రైతులు చనిపోయారని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో మళ్లీ వెనుకటి రోజులు వస్తున్నాయని వాపోయారు.