KTR | కారు కేవలం సర్వీసింగ్కు వెళ్లిందని.. మళ్లీ రెట్టింపు వేగంతో దూసుకొస్తుందని కేటీఆర్ అన్నారు. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ వాళ్లు తప్పుడు కేసులు పెడుతున్నారని.. కార్యకర్తలు అధైర్యపడొదన్నారు. పార్టీ కార్యకర్తలకు లీగల్ సెల్ అండగా ఉంటుందన్నారు. మోదీకి, రేవంత్ రెడ్డికి భయపడే పార్టీ బీఆర్ఎస్ కాదన్నారు. ఎట్టి పనికైనా మట్టి పనికైనా తెలంగాణ ఏకైక గొంతుక బీఆర్ఎస్ అన్నారు. పార్లమెంటులో తెలంగాణ సమస్య ల మీద పోరాడిన చరిత్ర బీఆర్ఎస్దేనన్నారు.
ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఢిల్లీలో తెలంగాణ గొంతుక వినబడాలంటే బీఆర్ఎస్ గెలవాలన్నారు. కాంగ్రెస్ బీజేపీ కలిసి తెలంగాణ గొంతుక బీఆర్ఎస్ను ఖతం చేయాలని చూస్తున్నాయన్నారు. బండి సంజయ్ వ్యాఖ్యలు చూసినా, రోజు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కొత్త పలుకు చుసినా అదే విషయం రుజువు అవుతుందన్నారు. ఇటీవల మోదీని రేవంత్, భట్టి కలిసినపుడు ఆయన బీఆర్ఎస్ను ఫినిష్ చేసేందుకు పూర్తిగా సహకరిస్తాం అన్నారట.. ఇది రాధాకృష్ణ చెప్పారన్నారు. బీఆర్ఎస్ బీజేపీ టీం కాదని.. బీజేపీ, కాంగ్రెస్లు ఒక్కటేనని స్పష్టంగా తెలియడం లేదా? అంటూ ప్రశ్నించారు. అదానీ, మోదీ ఒక్కటేనని ఢిల్లీలో విమర్శించే కాంగ్రెస్.. దావోస్లో అదే అదానీతో పెట్టుబడుల ఒప్పందం కుదుర్చుకున్నారని విమర్శించారు.
అదానీకి బీఆర్ఎస్ అవకాశమే ఇవ్వలేదన్నారు. మైనారిటీల్లో ఉన్న అపోహలను తొలగించాలన్నారు. మల్కాజ్గిరిలో భారీ మెజారిటీ దిశగా కష్టపడదామని పిలుపునిచ్చారు. సమావేశంలో మాజీ మంత్రులు మల్లారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, కడియం శ్రీహరి, మాజీ స్పీకర్లు పోచారం శ్రీనివాస్ రెడ్డి, మధుసూధనాచారి, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, నియోజకవర్గాల ఇన్చార్జీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు పాల్గొన్నారు.