హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 29న ‘దీక్షా దివస్’ను ఘనంగా నిర్వహించనున్నట్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. దశాబ్దంన్నర క్రితం, పార్టీ అధినేత కేసీఆర్.. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అనే గొప్ప త్యాగ నిరతితో దీక్ష చేపట్టి, తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారని గుర్తుచేశారు. తెలంగాణ చరిత్రలో గొప్పదైన ఈ ఘట్టాన్ని ఘనంగా నిర్వహించాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జిల్లా అధ్యక్షులు, పార్టీ జనరల్ బాడీ సభ్యులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీక్షా దివస్ నిర్వహణపై మార్గనిర్దేశం చేశారు. దానికంటే ముందుగా ఈ నెల 26న అన్ని జిల్లాల పార్టీ కేంద్రాల్లో ముఖ్య నాయకులతో సన్నాహక సమావేశాలు నిర్వహించుకోవాలని సూచించారు. సమావేశాలకు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు సహా ఇతర కీలక నేతలందరినీ ఆహ్వానించాలని ఆదేశించారు. 29న ఘనంగా నిర్వహించే దీక్షా దివస్ను విజయవంతానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించడమే ఈ సన్నాహక సమావేశాల ముఖ్య ఉద్దేశమని స్పష్టంచేశారు.
దీక్షా దివస్ను అన్ని జిల్లా కేంద్రాల్లోని పార్టీ కార్యాలయాల్లోనే నిర్వహించాలని కేటీఆర్ సూచించారు. ఒక రోజు ముందుగా, అంటే 28న సాయంత్రం జిల్లా కేంద్రాలు, పట్టణాలను బ్యానర్లు, ఫ్లెక్సీలతో అలంకరించాలని సూచించారు. పార్టీ కార్యాలయ ప్రాంగణాన్ని కూడా సుందరంగా తీర్చిదిద్దాలని కోరారు. జిల్లాలోని ముఖ్య నాయకులందరికీ ప్రత్యేకంగా సమాచారం అందించి, ఈ సమావేశాన్ని కనీసం 1000 మంది కీలక పార్టీ నేతలతో నిర్వహించాలని లక్ష్యం పెట్టుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా మొదట తెలంగాణ తల్లి, అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి, కార్యక్రమ ప్రారంభానికి గుర్తుగా కేసీఆర్ భారీ కటౌట్కు పాలాభిషేకం చేయాలని చెప్పారు. దీక్షాదివస్ సందర్భంగా జరిగిన అనేక కీలక సంఘటనలు, వార్తలు పరిణామాల సమాహారంతో ఫొటో ప్రదర్శన తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఈ ఫొటోలను పార్టీ కేంద్ర కార్యాలయం జిల్లాలకు పంపిస్తుందని వివరించారు. వీటితో పాటు స్థానిక జిల్లాల్లో దీక్షాదివస్ సందర్భంగా జరిగిన సంఘటనలు, ఫొటోలు, వార్తా కవరేజీ క్లిప్పింగ్లతో మరో ఉప విభాగాన్ని కూడా ఏర్పాటు చేసుకోచ్చని సూచించారు. కేవలం రాజకీయ ఉపన్యాసాలే కాకుండా, ఆనాటి ఉద్యమ సంస్కృతులను, ముఖ్యంగా దీక్షా దివస్ వివరాలను తెలిపే వక్తలను ఆహ్వానించాలని, వారి సమయాన్ని ఇప్పుడే నిర్దారించుకోవాలని సూచించారు.
దీక్షా దివస్ రోజు పండ్లు పంపిణీ చేయాలని, వీలుంటే అన్నదానం వంటి సామాజిక కార్యక్రమాలు చేపట్టవచ్చని కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్లోని నిమ్స్ హాస్పిటల్లో ప్రత్యేకంగా పండ్లు పంపిణీ చేయాలని, పార్టీ యూత్, విద్యార్థి విభాగం తరఫున ప్రతి యూనివర్సిటీలో దీక్షా దివస్ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా దీక్షాదివస్ పేరుతో, కేసీఆర్ చిత్రంతో తయారు చేసిన ప్రత్యేక
టీ-షర్టులను ధరించాలని చెప్పారు.