వరంగల్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ గద్వాల/అలంపూర్: అసెంబ్లీ ఎన్నికల ముందు అభయహస్తం పేరిట హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. నాలుగు నెలలుగా వాటిని నెరవేర్చకుండా భస్మాసుర హస్తం చూపెడుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు మండిపడ్డారు. సీఎం రేవంత్రెడ్డి లోక్సభ ఎన్నికల్లోనూ మరోసారి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని చెప్పారు. రైతుల రుణమాఫీ హామీని పక్కనబెట్టిన రేవంత్రెడ్డి.. ఏ ఊరికి పోతే అక్కడి దేవుడి మీద ప్రమాణం చేసి లోక్సభ ఎన్నికల్లోనూ మోసం చేస్తున్నారని చెప్పారు. ఒకసారి మోస పోతే మోసగాడి తప్పు అని, రెండుసార్లు మోసపోతే తప్పు మనదే అవుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ హామీలను నెరవేర్చాలంటే బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు బీఆర్ఎస్కు వస్తేనే కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని చెప్పారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగం గా కేటీఆర్ మంగళవారం వరంగల్ లోక్సభ పరిధిలోని వరంగల్ తూర్పు, వర్ధన్నపేట, గద్వాల అసెంబ్లీ నియోజకవర్గాల బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశాల్లో కేటీఆర్ ప్రసంగించారు.
‘రేవంత్రెడ్డి ఎన్నికలకు ముందు తులంబంగారం అన్నాడు,ఆడపడుచులకు నెలకు రూ.2500, స్కూటీ బైక్లు, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ అన్నాడు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 150 రోజులవుతున్నది. రాష్ట్రంలో ఎవ్వరికైనా తులం బంగారం వచ్చిందా? ఆసరా పెన్షను రూ.4 వేలు పెరిగిందా? ఆటోడ్రైవర్లకు నెలకు వెయ్యి, వ్యవసాయ కూలీలకు వెయ్యి ఇచ్చాడా? అని నిలదీశారు. మోసపు మాటలతో అధికారంలోకి వచ్చాడు. మోసం చేసే వాళ్లతో అప్రమత్తంగా ఉందాం. బీఆర్ఎస్ గెలిస్తేనే కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు, 6 గ్యారెంటీలు అమలవుతాయి. నిజంగా కేసీఆర్ మళ్లీ రావాలంటే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ను 12 సీట్లలో గెలిపించాలి. ఇదే జరిగితే ఏడాదిలోపు కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారు’ అని చెప్పారు. బీజేపీని ఎదుర్కొనేది కేసీఆర్ ఒక్కరేనని కేటీఆర్ అన్నారు. కుట్ర చేసి బిడ్డను అరెస్టు చేసినా కేసీఆర్ బీజేపీపై పోరాటం ఆపడంలేదని చెప్పారు. రాష్ర్టానికి బీజేపీ ఒక్క మంచి పని చేయలేదని వివరించారు. ‘తెలంగాణపై సవతితల్లి ప్రేమ చూపిస్తున్న బీజేపీకి ఓట్లు వేయవద్దు. మనం రాముడికి మొక్కుదాం. తెలంగాణకు ఒక్కటీ ఇయ్యని బీజేపీని ఓట్లతో తొక్కుదాం’ అని పిలుపునిచ్చారు. అన్ని అవకాశాలు ఇచ్చినా బీఆర్ఎస్ను మోసం చేసిన కడియం శ్రీహరి, అరూరి రమేశ్ విశ్వాసఘాతకులు అని కేటీఆర్ మండిపడ్డారు. ‘సుధీర్కుమార్ కేసీఆర్ వెన్నంటి ఉన్న నాయకుడు. అందరం కష్టపడి పని చేస్తే సుధీర్కుమార్ గెలుపు సాధ్యమవుతుంది. వరంగల్ మొదటి నుంచి బీఆర్ఎస్ గడ్డ. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకుందాం’ అని కేటీఆర్ అన్నారు. సమావేశాల్లో వరంగల్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి మారెపల్లి సుధీర్కుమార్, మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు దాస్యం వినయభాస్కర్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, మాజీ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, నన్నపునేని నరేందర్ పాల్గొన్నారు.
ఏకాలంలో రైతులకు రుణమాఫీ చేయాలని సీఎం రేవంత్రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. మంగళవారం జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తాలోని ఏజీఆర్ ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ శేణ్రుల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుగా నాగర్కర్నూల్ సెగ్మెంట్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అధిక మెజార్టీతో గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. పదేండ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి చూస్తారో.. పూటకో అబద్ధపు మాటలు చెప్పే సీఎం రేవంత్ పార్టీని గెలిపిస్తారో ప్రజలే తేల్చుకోవాలని సూచించారు. కష్టకాలంలో సీనియర్ మంత్రులు, ఎమ్మెల్యే లు పార్టీని వీడి కాంగ్రెస్లో చేరుతున్నారని, కానీ మన ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అధికార పార్టీ ఆఫర్ చేసిన టీఎస్పీఎస్సీ చైర్మన్, రాష్ట్ర ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్, ఎంపీ స్థానాలు ఆశ చూపినా కాదని బీఆర్ఎస్లో చేరారని గుర్తు చేశారు. కేసీఆర్ 1000 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తే వాటిని అద్భుతంగా తీర్చిదిద్దిన వ్యక్తి ఆర్ఎస్ అన్నారు.
బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి కోరారు. ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ అలంపూర్ ప్రజలు ప్రవీణ్కుమార్ను గెలిపించాలని కోరారు. ఆర్ఎస్పీ మాట్లాడుతూ తెలంగాణను ప్రపంచస్థాయిలో నిలిపిన వ్యక్తి కేసీఆర్ అన్నారు. నేను పార్లమెంట్కు వెళితే నడిగడ్డ ప్రజలందరూ పార్లమెంట్కు వెళ్లినట్టేనని అన్నారు. ఎమ్మెల్యే విజయుడు మాట్లాడుతూ ఆర్ఎస్పీ అన్నను ఆదరించాలని కోరారు. సమావేశంలో పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జిలు దేవర మల్లప్ప, అభిలాష్రావు, బైకాని శ్రీనివాసులు పాల్గొన్నారు.