హైదరాబాద్, జనవరి 30(నమస్తే తెలంగాణ): శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల అప్పగింతపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలతో కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) గురువారం కీలక సమావేశం నిర్వహించనున్నది. ఈ సమావేశానికి హాజరుకావాల్సిందిగా రెండు రాష్ర్టాల నీటిపారుదల శాఖ అధికారులకు లేఖ రాసింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం శ్రీశైలం డ్యామ్ ఏపీ పరిధిలో, నాగార్జునసాగర్ డ్యామ్ తెలంగాణ పరిధిలో ఉండాలి. తెలంగాణ, ఏపీ అధికారులతో కేంద్ర జల్శక్తిశాఖ ఈ నెల 17న సమావేశమైంది.
శ్రీశైలం, నాగార్జునసాగర్ డ్యామ్లతోపాటు వాటికి సంబంధించిన 15 ఔట్లెట్లు, ఆస్తులు, ఉద్యోగులను నెలరోజుల్లోగా బోర్డుకు అప్పగించాలని ఇరు రాష్ర్టాలను ఆదేశించారు. ఇందుకు ఏపీ ఒప్పుకోగా తెలంగాణ అధికారులు వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో గురువారం మరోసారి సమావేశం కావాలని కేఆర్ఎంబీ నిర్ణయించింది. ఇటీవలి సమావేశంలో ప్రాజెక్టులకు సంబంధించి ఇరు రాష్ర్టాలు ఒప్పుకొన్నట్టు పలు అంశాలను లేఖలో ప్రస్తావించింది. ప్రాజెక్టుల అప్పగింత తదితర అంశాలపై ఏడురోజుల్లోగా కచ్చితమైన కార్యాచరణతో వస్తామని అంగీకరించిన విషయాన్ని గుర్తు చేసింది.