హైదరాబాద్ : సోమాజిగూడలోని జలసౌధ కార్యాలయంలో ఇవాళ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) సమావేశం కానుంది. కేఆర్ఎంబీ చైర్మన్ ఎంపీ సింగ్ నేతృత్వంలో జరిగే ఈ సమావేశానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చెందిన నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొననున్నారు. కేంద్ర జలశక్తి శాఖ గెజిట్ నోటిఫికేషన్ అమలుపై చర్చించనున్నారు. ఉమ్మడి ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తెచ్చే అంశంపై చర్చించనున్నారు.
సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయని, వాటిని పరిష్కరించిన తర్వాతే కేంద్రం విడుదల చేసిన గెజిట్ను అమలు చేయాలని తెలంగాణ సాగునీటిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ పోమవారం డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. సోమవారం జరిగిన గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) సమావేశంలో ఆయన గెజిట్ అమలుకు సంబంధించిన పలు అంశాలపై తెలంగాణ వాదనలను గట్టిగా వినిపించారు. ప్రాజెక్టులన్నింటినీ తమ పరిధిలోకి తీసుకోకుండా ప్రయోగాత్మకంగా పెద్దవాగు ప్రాజెక్టును మాత్రమే ఆధీనంలోకి తీసుకొని కేవలం ఆ ప్రాజెక్టునే పర్యవేక్షిస్తామని జీఆర్ఎంబీ ప్రతిపాదించడంపై తెలంగాణ అధికారులు స్పందిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తేనే ఆ ప్రాజెక్టును అప్పగిస్తామని చెప్పారు. సీలేరు విద్యుత్ ప్రాజెక్టును బోర్డు పరిధిలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, తెలంగాణలోని గోదావరి ప్రాజెక్టులన్నింటినీ బోర్డు పరిధిలోకి తీసుకోవాలని ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు వాదించారు. సీలేరు విద్యుత్ ప్రాజెక్టును బోర్డు పరిధిలోకి తీసుకునేదాన్ని అంగీకరించేది లేదన్నారు. సమావేశంలో జీఆర్ఎంబీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్, సభ్యులు, తెలంగాణ సాగునీటిశాఖ ఈఎన్సీ మురళీధర్, ఏపీ అధికారులు పాల్గొన్నారు.