హైదరాబాద్, ఫిబ్రవరి 28 : రాజోలిబండ డైవర్షన్ స్కీం(ఆర్డీఎస్)కు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు మార్చి 9న హైదరాబాద్లోని జలసౌధలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నది. సమావేశంలో పాల్గొనాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ ఈఎన్సీలు, కర్ణాటక నీరవరి నిగమా లిమిటెడ్ ఎండీ, తుంగభద్ర బోర్డు చైర్మన్కు కేఆర్ఎంబీ ఈఈ శివశంకరయ్య ఇటీవల లేఖలు రాశారు. కేఆర్ఎంబీ కమిటీ జనవరి 28న బోర్డుకు అందజేసిన ఫీల్డ్ అబ్జర్వేషన్ నివేదికపై చర్చించనున్నట్టు పేర్కొన్నారు. మూడు రాష్ర్టాలు చీఫ్ ఇంజనీర్ స్థాయి అధికారిని సమావేశానికి పంపాలని బోర్డు సూచించింది.